ETV Bharat / bharat

'దేశంలో అల్లర్లు జరిగే అవకాశం'- అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశాలు

దేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్న హోంశాఖ- రెచ్చగొట్టే ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

Home Ministry
Home Ministry (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 11:31 AM IST

3 Min Read
Choose ETV Bharat

Home Ministry To States : ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా పడే అవకాశాలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఎక్కడైనా సామాజిక, మత పరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలపై ప్రభావం చూపొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక లేఖ రాసింది.

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం, అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు చేపట్టిన సైనిక చర్యల తర్వాత దేశంలో కొన్ని వర్గాలు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఫిబ్రవరి 28న రాష్ట్రాలకు పంపిన లేఖలో అప్రమత్తంగా ఉండాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ముఖ్యంగా మతపరమైన సభలు, సమావేశాలు, ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించింది.

రెచ్చగొట్టే ప్రసంగాలపై నిఘా
హోంశాఖ లేఖలో కీలకంగా ప్రస్తావించిన అంశం రెచ్చగొట్టే ప్రసంగాలు. కొన్ని తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తులు విదేశీ పరిణామాలను ఉపయోగించుకుని ప్రజలను ప్రేరేపించే ప్రయత్నం చేయొచ్చని హెచ్చరించింది. ఇరాన్​కు వ్యతిరేక భావజాలంతో ఉన్న కొంతమంది మత ప్రచారకులు ఉద్రిక్తతలు సృష్టించేలా ప్రసంగాలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి ప్రసంగాలు స్థానికంగా సామాజిక కలహాలకు దారి తీసే ప్రమాదం ఉందని, అందుకే ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల్లో కూడా పుకార్లు, తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని, వాటిని వెంటనే అరికట్టాలని సూచించింది.

ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం పెంచాలి
రాష్ట్ర పోలీస్ విభాగాలు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్లు, కేంద్ర ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచాలని కేంద్రం తెలిపింది. అనుమానాస్పద సమావేశాలు, గుంపులు, విద్వేషపూరిత పోస్టులు, విదేశీ నిధుల ప్రవాహం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునేలా కంట్రోల్ రూమ్‌లను సిద్ధంగా ఉంచాలని, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలు ఇచ్చింది.

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం
ఇటీవల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనితో ప్రాంతీయ యుద్ధ భయం మరింత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తోంది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ దౌత్యపరమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది.

దేశీయ శాంతిభద్రతలే లక్ష్యం
విదేశాల్లో జరిగిన సంఘటనలు దేశంలో సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. భారతదేశం మతపరంగా, భాషాపరంగా, సంస్కృతిపరంగా వైవిధ్యభరితమైన దేశం కావడంతో చిన్న ఉద్రిక్తత కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా నిరోధించాలనే ఉద్దేశంతో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో పుకార్లపై కఠిన చర్యలు
తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు, విద్వేషపూరిత పోస్టులు వేగంగా వ్యాప్తి చెందే ఈ కాలంలో సోషల్ మీడియా పర్యవేక్షణ కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉండే సమాచారాన్ని వెంటనే తొలగించాలనీ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రజలకు కూడా అప్రమత్తత అవసరమని, పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.

అప్రమత్తతే పరిష్కారం
అంతర్జాతీయ ఉద్రిక్తతలు దేశీయంగా ఎలాంటి ప్రభావం చూపకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. శాంతి, సామరస్యాన్ని కాపాడటం అందరి బాధ్యత అని, చట్టవ్యవస్థకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర సూచనలను అమలు చేస్తూ సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అప్రమత్తత పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.

నెతన్యాహు, UAE అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ- పౌరుల రక్షణ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం

మోదీ అధ్యక్షతన CCS సమావేశం- పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చ