దీపావళికి ట్రిప్ ప్లాన్ చేశారా? టైగర్ రిజర్వ్ పార్క్కు వెళ్తున్నారా? అయితే కేటుగాళ్లతో జర జాగ్రత్త!
మోసపోకుండా జాగ్రత్త పడాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే!

Published : October 18, 2025 at 6:49 PM IST
Tiger Reserve Park Bookings : దీపావళికి హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారా? టైగర్ రిజర్వ్ పార్క్లో సఫారీతోపాటు నైట్ స్టే చేయాలనుకుంటున్నారా? అది కూడా ఉత్తర్ప్రదేశ్లోని రామ్నగర్ కార్బెట్ టైగర్ రిజర్వ్ పార్క్కు వెళ్లాలనుకుటున్నారా? అయితే మీరు జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే సఫారీతోపాటు నైట్ స్టే బుకింగ్ ముసుగులో చాలా మంది నకిలీ ఏజెంట్లు పనిచేస్తున్నారు. వారంతా పర్యాటకులను మోసం చేస్తున్నారు.
ఇటీవల దిల్లీ, కేరళకు చెందిన ఇద్దరు పర్యటకులు రూ.లక్షల్లో మోసపోయారు. దీంతో లబోదిబోమని పోలీసులను ఆశ్రయించినా, తమ ఫిర్యాదులను వారు తీవ్రంగా పరిగణించడం లేదని చెబుతున్నారు. ఈ విధంగా మోసగాళ్లకు ధైర్యం ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగింది? వారిద్దరు ఎలా మోసపోయారు? మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి కేసు: దిల్లీలోని సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ నివాసి నిఖిల్ మెహ్రా 2025 జనవరిలో కార్బెట్ను సందర్శించాలని అనుకున్నాడు. సఫారీ, రాత్రి బస బుక్ చేసుకోవడానికి అతడు రామ్నగర్కు చెందిన ఒక యువకుడిని సంప్రదించాడు. ఆ యువకుడు మే 8 నుంచి 11 వరకు, మే 23 నుంచి 25 వరకు, మే 29 నుంచి జూన్ 1 వరకు రాత్రి బస బుక్ చేసుకున్నాడు. రూ.1.32 లక్షల మొత్తాన్ని కోట్ చేశాడు. నిఖిల్ గూగుల్ పే ద్వారా యువకుడి ఖాతాకు డబ్బును బదిలీ చేశాడు.
కొన్ని రోజుల తర్వాత, నిందితుడు అతడికి నకిలీ కార్బెట్ పార్క్ పర్మిట్ను పంపాడు. అయితే, నిఖిల్ కార్బెట్కు వచ్చినప్పుడు, ఆ పర్మిట్ నకిలీదని తేలింది. ఆ తర్వాత మే 27న రామ్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరాశ చెందాడు. ఫిర్యాదు బీజేపీ నాయకుడు మదన్ జోషికి చేరినప్పుడు, నిందితుడిని పిలిపించారు. విచారణలో, ఆ యువకుడు తన తప్పును అంగీకరించి, కొంత డబ్బు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు.
రెండో కేసు: ఇప్పుడు అక్టోబర్ 12న అదే యువకుడు కేరళకు చెందిన మనోజ్ అనే పర్యాటకుడిని రాత్రి బస పేరుతో రూ.80,000 మోసం చేశాడు. మనోజ్ ప్రకారం, అతడికి కూడా నకిలీ పర్మిట్ కూడా ఇచ్చాడు. దీంతో నిందితుడు సగం మొత్తాన్ని తిరిగి ఇచ్చాడు. కానీ రూ.45,000 ఇంకా బకాయి ఉంది. జిమ్ కార్బెట్లో వన్యప్రాణుల ఫొటోగ్రఫీ పర్యటనలను ప్రచారం చేస్తూ నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీని సృష్టించడం ద్వారా యువకుడు మోసానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
అధికారుల హెచ్చరికలు
అయితే ఈ ఘటనల తర్వాత కార్బెట్ నేషనల్ పార్క్ అధికారులు పర్యాటకులకు హెచ్చరిక ఇచ్చారు. బుక్ చేసే ముందు కేవలం ఆఫీషియల్ వెబ్సైట్ https://corbettgov.orgను ఉపయోగించమని చెప్పారు. అనధికారిక ఏజెంట్లకు బలి కాకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఏజెంట్లు లేదా ప్రైవేట్ వెబ్సైట్ల బారిన పడవద్దని సూచించారు.
పర్యాటకులకు సూచనలు
- నైట్ స్టే బుక్ చేసే ముందు ఎల్లప్పుడూ అధికారిక వెబ్సైట్ను ఉపయోగించండి.
- ఫేక్ ఈమెయిల్, సోషల్ మీడియా ప్రోఫైల్లను గమనించండి.
- ఏజెంట్ ద్వారా బుక్ చేసుకునే సందర్భంలో, ఫిర్యాదు చేయదగిన రసీదు లేదా కాంట్రాక్ట్ ఉండేలా చూడండి.
- ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ లభించినా, తక్షణంగా పోలీస్ ఫిర్యాదు చేయండి.
- సోషల్ మీడియాలో నకిలీ ఆఫర్స్కు బలి కాకుండా జాగ్రత్త వహించండి.
ఏజెంట్లకు బలి కాకుండా, అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవడం అత్యంత ముఖ్యం. లేకపోతే, లక్షల రూపాయలు మోసపోయే ప్రమాదం ఉంది.

