పులుల గణన ప్రారంభం- 3 విడతల్లో ప్రక్రియ- ఎందుకు? ఎలా చేస్తారు?
దేశవ్యాప్తంగా ప్రారంభమైన పులుల గణన- మొత్తం 3,167 పులులు ఉన్నట్లు గుర్తింపు

Published : December 15, 2025 at 5:12 PM IST
National Tiger Census Begins : భారత్లో పులుల జనాభాను లెక్కించేందుకు తలపెట్టిన పులుల గణన ప్రక్రియ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుతో పాటు వివిధ జంతు అభయారణ్యాల్లో ప్రారంభమైంది. ప్రతి నాలుగేళ్లకోసారి చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా దేశ అడవుల్లో పులుల విస్తరణ, సంచార మార్గాలను అధికారులు అంచనా వేస్తారు. మొత్తం మూడు విడతల్లో జరిగే ఈ పులుల గణనను అధికారులు శాస్త్రీయంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు. 2022 చివరిసారిగా చేపట్టిన పులుల గణన ప్రకారం దేశంలో 3,167 పులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కచ్చితమైన డేటాను పొందడానికి 550కి పైగా కెమెరా ట్రాప్లు!
దేశవ్యాప్తంగా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే జాతీయ పులుల జనాభా గణన ప్రక్రియ అధికారికంగా డిసెంబర్ 14న ప్రారంభమైంది. ఇందులో భాగంగా కార్బెట్ టైగర్ రిజర్వ్ కూడా పెద్ద పిల్లుల లెక్కింపు జరుపుతోంది. ఈ సందర్భంగా కార్బెట్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ మిశ్రా మాట్లాడారు. కార్బెట్లో పులుల గణన పనులు ప్రారంభమైందని, ఈ ప్రక్రియ మూడు దశల్లో పూర్తవుతుందని తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని కవర్ చేయడానికి, అలాగే కచ్చితమైన డేటాను పొందడానికి రిజర్వ్ ప్రాంతంలో 550కి పైగా కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశామన్నారు. పులుల సంరక్షణకు గణన చాలా ముఖ్యమైనదని, రాబోయే సంవత్సరాల్లో సరికొత్త వ్యూహాన్ని నిర్ణయించడంలో ఈ ప్రక్రియ ఎంతో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
పులుల గణన కోసం ప్రత్యేక శిక్షణ!
ఈ గణనలో భాగంగా దేశంలోని అన్ని ప్రధాన పులుల అభయారణ్యాలు, అటవీ ప్రాంతాల్లో పులుల సంఖ్య, వాటి కదలికలు నమూనాలపై శాస్త్రీయ అంచనా నిర్వహించనున్నారు. ఈ సారి పులుల గణనలో ఆధునిక పద్ధతులను పాటించనున్నారు. అదే విధంగా శాస్త్రీయ పద్ధతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) పులుల గణన కోసం అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
శిక్షణ సమయంలో, పులుల సంఖ్య తెలుసుకోవడం, డేటా సేకరణ, విశ్లేషణ, శాస్త్రీయ అంశాలు వంటి విషయాలను కచ్చితమైన సమాచారంతో సేకరిస్తారు. అనంతరం వాటిని నిర్ధరించడానికి తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈసారి పులుల గణనలో కెమెరా ట్రాప్ టెక్నాలజీని ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. పులులను గుర్తించడానికి ఈ సాంకేతికత అత్యంత ఆధునికమైనదిగా, నమ్మదగినదిగా పరిగణిస్తున్నారు. కెమెరా ట్రాప్ల ఆధారంగా, అవి సంచరించిన ప్రాంతాల్లో వాటి చారల నమూనా ఆధారంగా పులులను గుర్తిస్తారు.
పులుల గణన కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు!
ప్రతి పులి చారలు మానవ వేలిముద్రల మాదిరిగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. దీంతో వాటిని అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల పులుల వాస్తవ సంఖ్యను తెలుసుకోవడమే కాకుండా వాటి భూభాగం, ఆవాసాలు, కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్యమైన డేటాను సేకరించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాతీయంగా పులుల గణన కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాదని, భవిష్యత్తు పరిరక్షణ విధానాలు, వన్యప్రాణుల నిర్వహణను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వారు అంటున్నారు. పులుల సంఖ్య పెరగడం లేదా తగ్గడం ఆధారంగా, ప్రభుత్వం అటవీ శాఖ పరిరక్షణ ప్రణాళికలను బలోపేతం చేసేందుకు వీలు ఉంటుంది.
మరోవైపు కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. పులుల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోని ప్రముఖ పులుల ఆవాసాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఇక్కడ 260కి పైగా పులుల ఉనికి నమోదైంది. ఇది భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ముఖ్యమైనది. ఉత్తరాఖండ్లో మొత్తం పులుల సంఖ్య 560 ఉంటుందని అంచనా.
వందలాది వేటగాళ్లను పట్టించిన 'జీని'- పులులను సైతం కాపాడుతున్న శునకం!

