ETV Bharat / bharat

'ఎగ్జిట్​ పోల్స్ అంచనాల కన్నా మెరుగైన ఫలితాలు'- బిహార్​ ఎన్నికలపై NDA ధీమా

మూడింట రెండొంతుల మెజారిటీతో బిహార్​లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు

Bihar Exit Poll Result 2025
Bihar Exit Poll Result 2025 (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : November 11, 2025 at 8:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bihar Exit Poll Result 2025 : ఎగ్జిట్​ పోల్స్ అంచనాల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని బిహార్ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఓటింగ్​ షేర్ కూడా 50శాతం దగ్గర్లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల మెజారిటీతో బిహార్​లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. "బిహార్​ ప్రజలకు నా ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమికి బిహార్ ప్రజలు ఓటు వేశారని నమ్మకంతో ఉన్నాం. మూడింట రెండొంతుల మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ఎగ్జిట్​ పోల్స్​ కన్నా ఫలితాల్లో ఎక్కువగా వస్తాయి. మా ఓటింగ్ షేర్​ కూడా 50 శాతం దాటుతుందని అనుకుంటున్నాం." అని సామ్రాట్ చౌదరీ అన్నారు.

"ప్రజాస్వామ్యానికి బిహార్ గడ్డ తల్లిలాంటింది. 2020లో ఓటింగ్ శాతం 57శాతం జరిగితే, ఈ సారి తొలి దశలో 65శాతం, రెండో దశలో 68శాతానికి చేరింది. దీనిని చూస్తేనే బిహార్ ప్రజలు వారసత్వాన్ని, కుటుంబ రాజకీయాలను తిరస్కరించినట్లు అర్థమవుతుంది. ప్రధాని మోదీ, సీఎం నీతీశ్ కుమార్​ లాంటి నేతలపైనే నమ్మకం ఉంచారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కన్నా ఫలితాల్లో ఎక్కువ సీట్లు వస్తాయి. భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది"

--విజయ్​ కుమార్ సిన్హా, బిహార ఉప ముఖ్యమంత్రి

"బిహార్ అంతటా నీతీశ్​ గాలి వీచింది. ఎన్డీఏ నేతృత్వంలో నీతీశ్ కుమార్​ మరోసారి అదరగొట్టారు. ఆయనను బిహార్ ఓటర్లు బలంగా విశ్వసించారు. నవంబర్​ 14న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ప్రతిపక్ష కూటమి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతున్నాయి. ఈ విషయం తేజస్వీ యాదవ్​కు కూడా తెలుసు. ఆయన ఎన్ని చెప్పినా, మహాగఠ్​బంధన్​ పూర్తిగా తుడిచిపెట్టుకుపోనుంది. బిహార్ ప్రజలు వారిని తిరస్కరించారు. ఎన్డీఏపై నమ్మకం ఉంచి ఓటు వేశారు. నీతీశ్​ కుమార్​ మరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా కాబోతున్నారు."

--రాజీవ్​ రంజన్​ ప్రసాద్​, జేడీయూ నేత

"ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​కు ఓటు వేసినందుకు బిహార్ ప్రజలకు నా ధన్యావాదాలు. బిహార్ ప్రజలు అభివృద్ధికి, సుపరిపాలనకు పట్టం కట్టారు. సీఎం నీతీశ్​ కుమార్​కు శుభాకాంక్షలు. ఎన్డీఏకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభించింది."

--ఉమేశ్ సింగ్ కుశ్వాహా, జేడీయూ నేత

"బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగింది. బిహార్​ ప్రజలు మోదీ, నీతీశ్​ సహా ఎన్డీఏ కూటమిపై నమ్మకం ఉంచారు. మూడింట రెండొంతుల మెజారిటీతో బిహార్​లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది."

--నిత్యానంద రాయ్​, కేంద్ర మంత్రి

"పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన జనాలను చూస్తే బిహార్​లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అర్థమవుతుంది. ఎగ్జిట్​ పోల్స్ కూడా ఎన్డీఏ తిరిగి అధికారాన్ని దక్కించుకుంటుందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ, సీఎం నీతీశ్​ కుమార్​ అభివృద్ధికి బిహార్ ప్రజలు ఓటు వేశారు. రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయ్యారు."

--షెహన్వాజ్​ హుస్సేన్​ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి

ఎన్డీయేదే అధికారమని చెప్పిన ఎగ్జిట్ పోల్స్
మరోవైపు బిహార్ తుది దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎన్నికలపై ఎగ్జిట్​ పోల్స్​ విడుదలయ్యాయి. బిహార్‌లో మరోసారి ఎన్డీయేనే అధికారం చేపడుతుందని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ జోస్యం చెప్పాయి. బిహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాల్సి ఉంది. అయితే, దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ ఎన్డీయేకు 130 సీట్ల పైనే దక్కుతాయని అంచనావేశాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌ కూటమి అటూఇటుగా 100 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చిచెప్పాయి. ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన జన్‌సురాజ్‌ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని అది సున్నా నుంచి గరిష్ఠంగా ఐదు స్థానాల్లో నెగ్గే అవకాశం ఉందని స్పష్టంచేశాయి.