రూ.50వేల పెట్టుబడితో పుట్టగొడుగుల సాగు- ఏటా రూ.7 కోట్ల రాబడి- యువ రైతు సక్సెస్ స్టోరీ!
పుట్టగొడుగుల సాగులో అదరగొడుతున్న రైతు- ఏటా భారీగా లాభాలు

Published : November 8, 2025 at 3:10 PM IST
Mushroom Farming Success Story : హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన ఓ వ్యక్తి పుట్టగొడుగుల సాగులో అదరగొడుతున్నాడు. 11 ఏళ్ల క్రితం రూ.50,000 పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఏటా రూ.7 కోట్ల వార్షిక టర్నోవర్ సాధిస్తున్నాడు. చదివింది ఎనిమిదో తరగతే అయినా తన తెలివితేటలతో పుట్ట గొడుగుల సాగులో మంచి లాభాలను గడిస్తున్నాడు. ఈ క్రమంలో మష్రూమ్ పెంపకంలో రాణిస్తున్న యద్వీందర్ సింగ్ గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
డంకీ రూట్లో విదేశాలకు వెళ్లాలనుకుని!
కురుక్షేత్ర జిల్లాలోని తల్హేరి గ్రామానికి చెందిన యద్వీందర్ సింగ్ ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. 2006లో డంకీ రూట్లో కొరియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే దారి మధ్యలో సమస్యలు ఎదురవ్వడంతో వెనక్కి తగ్గాడు. దీంతో దేశంలోనే ఉండిపోయాడు. (విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్నే డంకీ రూట్ అని పిలుస్తారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, షిప్ కంటైనర్లు, వాహనాల్లో రహస్య కంపార్టుమెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు తీసుకుంటారు). అక్రమంగా విదేశాలకు వెళ్లాలనుకున్న యద్వీందర్ ఆగిపోవడమే, అతడి జీవితాన్ని సమూలంగా మార్చేసింది. పుట్టగొడుగుల సాగును ప్రారంభించేటట్లు చేసింది.

11 ఏళ్ల క్రితం సాగు స్టార్ట్
2008లో యద్వీందర్ తమ గ్రామంలోని పుట్టగొడుగుల ఫార్మ్లో పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడు అతడి జీతం నెలకు రూ.3,200. అక్కడ పనిచేస్తున్నప్పుడు పుట్టగొడుగుల పెంపకంలో యద్వీందర్ నైపుణ్యం సాధించాడు. ఈ క్రమంలో సూపర్ వైజర్గా పదోన్నతి పొందాడు. ఆ తర్వాత తానే సొంతంగా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఆపై ఉద్యోగాన్ని మానేసి సొంతంగా మష్రూమ్ సాగు చేపట్టాడు. 2014లో మూతపడిన తన కోళ్ల ఫామ్లో రూ.50వేలు పెట్టుబడితో మష్రూమ్ సాగును మొదలుపెట్టాడు. ఈ 11 ఏళ్ల కాలంలో అంచెలంచెలుగా ఎదిగి పుట్టగొడుగుల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. ప్రస్తుతం పుట్టగొడుగుల సాగు ద్వారా ఏటా రూ.7 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. అయితే ఈ సాగులో యద్వీంజర్కు సక్సెస్ అంత ఈజీగా రాలేదు. చాలా ఆటుపోట్లు, సవాళ్లను ఎదుర్కొన్నాడు.

"2006లో డంకీ రూట్ ద్వారా విదేశాలకు వెళ్లాలని అనుకున్నాను. కానీ ప్రయాణం మధ్యలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. అందువల్ల స్వదేశానికి తిరిగి వచ్చాను. విదేశాల్లో ఉన్నా ఇంత డబ్బు సంపాదించలేకపోయేవాడిని. భారత్ తిరిగొచ్చేయడమే మంచిదయ్యింది. పుట్టగొడుగుల కంపోస్ట్ను తయారుచేస్తున్నాను. అందుకోసం మూడు ఎకరాల్లో శాశ్వత ప్లాంట్ను నిర్మించాను. 12-15 ఎకరాల్లో పుట్టగొడుగులను సాగు చేస్తున్నాను. షెడ్డులో మష్రూమ్ను పెంచుతున్నాను. నా ఫార్మ్లోని పుట్టగొడుగుల కంపోస్ట్, విత్తనాలు హరియాణాకు సరఫరా చేస్తాను. అక్కడ వాటికి భారీ డిమాండ్ ఉంది. నేను పండించిన పుట్టగొడుగులను దిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్ వంటి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తాను. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి" అని యద్వీందర్ సింగ్ తెలిపాడు.

250 మందికి ఉపాధి
అంతేకాకుండా యద్వీందర్ సింగ్ పుట్టగొడుగుల సాగు ద్వారా తానే లబ్ధి పొందడం లేదు. మరో 250 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందులో 150 మంది మహిళలు కూడా ఉన్నారు. తన పుట్టగొడుగుల ఫార్మ్లో వీరందరికీ పని కల్పిస్తాడు. దీంతో యద్వీందర్ సింగ్పై ప్రశంసలు కురుస్తున్నాయి.

పుట్టగొడుగల సాగుకు ఆసక్తి
పుట్టగొడుగుల పెంపకం హరియాణా సహా భారతదేశమంతటా ప్రజాదరణ పొందుతోంది. మష్రూమ్స్లో పోషక విలువలు, ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే పుట్టగొడుగులలో తక్కువ కేలరీలు, కొవ్వును కలిగి ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ఆహారం. మష్రూమ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.


ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వాటిలో బటన్, ఓస్టెర్, మిల్కీ పుట్టగొడుగులు వంటి కొన్ని రకాలను మాత్రమే మానవులు తినదగినవి. పుట్టగొడుగుల సాగును తక్కువ స్థలం, సమయం, తక్కువ ఖర్చుతో చేయవచ్చు. అలాగే మంచి లాభాలను పొందొచ్చు. అందుకే దేశంలోని రైతులు పుట్టగొడుగుల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.


లగ్జరీ కారును మించిన ఆటో- ఏసీ, డీజే, టీవీ, కలర్ఫుల్ లైటింగ్- ఎక్కడో తెలుసా?
'బిహార్కు తుపాకుల రాజ్యం వద్దు- పిల్లల మెదళ్లలో విషం నింపుతున్నారు'- ఆర్జేడీపై మోదీ ధ్వజం

