ETV Bharat / bharat

'నెతన్యాహు వ్యాఖ్యలపై మోదీ మౌనం- దేశ నాగరికత, విలువలకే తీరని ద్రోహం'- కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

తమకు భారత్ మద్దతు ఉందంటూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం- మోదీ మౌనాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్​ నేత జైరాం రమేశ్​- ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య

Congress MP Jairam Ramesh
Congress MP Jairam Ramesh (ANI File Photo)
author img

By ETV Bharat Telugu Team

Published : July 6, 2026 at 1:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Congress Slams Modi About Israel Talks : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ చర్యలపై "స్వయం ప్రకటిత, అవార్డుల కోసం ఆరాటపడే విశ్వగురువు" వహిస్తున్న మౌనం దేశ నాగరికత, విలువలకే తీరని ద్రోహమని విమర్శించింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం మండిపడింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జే.డీ. వాన్స్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు భారత్ మద్దతును ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఈ మేరకు వ్యాఖ్యానిస్తూ, తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్​ ఒక ప్రకటన విడుదల చేశారు.

"నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు తప్పు. నిస్సందేహంగా ఇజ్రాయెల్, మోదీ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంది. అయితే, గాజాలో పిల్లలను కూడా వదలకుండా సాగుతున్న మరణకాండ, వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లను బలవంతంగా తొలగించి స్థానభ్రంశం చేయడం, ఇరాన్‌పై వైమానిక దాడులు, దక్షిణ లెబనాన్​లో క్రూరమైన సైనిక చర్యలను కోట్ల మంది భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవన్నీ మానవత్వంపైనే జరుగుతున్న దాడులు."
- జైరాం రమేశ్​, కాంగ్రెస్ నేత

'సైబర్‌ సాయాన్ని అనేక దేశాలు కోరుతుంటాయి'
అంతకుముందు, భారత్‌ నుంచి తమకు మద్దతు ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. అమెరికా- ఇరాన్‌ శాంతి చర్చల్ని ఇజ్రాయెల్‌ గౌరవించాలని, యావత్‌ ప్రపంచంలో శక్తిమంతమైన అమెరికా మద్దతు మాత్రమే ఇజ్రాయెల్‌కు ఉందని ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు తిప్పి కొట్టారు. తమకు అనేక దేశాల అండ ఉందని, అందులో చిన్న దేశమైన ఇండియా కూడా ఉందని స్పష్టం చేశారు. అలాగే, ఫేస్‌బుక్‌లోనూ తనకు మద్దతు ఉందని తెలిపారు. అంతేకాదు, తమ దేశంలోని అగ్రశ్రేణి సైబర్‌ భద్రత నిపుణుల సాయాన్ని అనేక దేశాలు కోరుతుంటాయని, చాలా దేశాల నేతలు ఫోన్‌ చేసి, వారి సమస్యలు చెప్పి ఏఐ, సైబర్‌ నిపుణుల చేయూతను కోరుతుంటారని పేర్కొన్నారు. అయితే, ప్రపంచంలో సైబర్‌ రంగంలో ఇజ్రాయెల్‌ రెండోస్థానంలో ఉందని, తమ సాంకేతికత ఎంతో మేలైనదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలను ఇజ్రాయెల్ గౌరవించాలని జే. డీ. వాన్స్ గత నెలలో వైట్ హౌస్ ప్రెస్ మీట్‌లో తెలిపారు. అయితే, ట్రంప్ ప్రభుత్వ ఒప్పందాలపై ఇజ్రాయెల్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంపై వాన్స్​ స్పందించారు. "నేనే గనుక ఇజ్రాయెల్ మంత్రి వర్గంలో ఉంటే, ప్రపంచంలో మాకున్న ఏకైక శక్తిమంతమైన మిత్రదేశం (అమెరికా) పై ఇలాంటి విమర్శలు చేసేవాడిని కాదు" అని వ్యాఖ్యానించారు.

ఆ నిబంధనలు చిన్న పరిశ్రమల ఉనికికే ప్రమాదం
మరోవైపు, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా ఉన్న బస్సు, ట్రక్ బాడీ- బిల్డింగ్ వంటి చిన్న పరిశ్రమల ఉనికికే ప్రమాదంగా మారాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న ఒక స్థానిక వాహన నిర్మాణ వర్క్‌షాప్‌ను సందర్శించిన ఆయన, అక్కడి కార్మికులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు కేవలం బడా పారిశ్రామికవేత్తలకే అనుకూలంగా ఉన్నాయని, 'మేక్ ఇన్ ఇండియా', 'వోకల్ ఫర్ లోకల్' అనేవి కేవలం నినాదాలుగానే మిగిలిపోయాయని రాహుల్ గాంధీ విమర్శించారు. బస్సుల్లో తలెత్తే సాంకేతిక లోపాల వల్ల జరిగే అగ్నిప్రమాదాలకు, కేవలం వాహనాల బాడీని నిర్మించే నిరుపేద కార్మికులనే బాధ్యులను చేస్తూ నిబంధనలు తీసుకురావడం శోచనీయమన్నారు. నిబంధనల భారం మోయలేక ఈ చిన్న ఫ్యాక్టరీలు మూతపడితే లక్షలాది మంది ఉపాధి దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

''ఇన్‌ఫ్రామ్యాన్' అదృశ్యమయ్యారు'- ముంబయి భారీ వర్షాలపై విపక్షాల ఫైర్​- రెడ్​ అలర్ట్ జారీ

విక్రమ్​-1 ద్వారా నింగిలోకి సారాభాయ్​, సీవీ రామన్, అబ్దుల్ కలాం​​- భారత శాస్త్రవేత్తలకు స్కైరూట్​ నివాళి!