ETV Bharat / bharat

ఎన్నికల కోసం లగ్జరీ ప్రచార వాహనాలు- రోల్స్ రాయిస్​ తరహా ఫీచర్లు- ధర రూ.కోట్లకు పైనే!

కోయంబత్తూరులో అత్యాధునిక ఎన్నికల ప్రచార వాహనాలు తయారీ- అందులో కంప్యూటర్లు, ఎల్​ఈడీ స్క్రీన్లు- రోల్స్​ రాయిస్ తరహా ఫీచర్లు!

Rolls Royce Style Campaign Vans
Rolls Royce Style Campaign Vans (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 3:28 PM IST

4 Min Read
Choose ETV Bharat

Rolls Royce Style Campaign Vans : తమిళనాడులో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి లగ్జరీ లుక్స్​తో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రచార వాహనాలను సిద్ధం చేయిస్తున్నాయి. అందులో కంప్యూటర్లు, స్మార్ట్​ ఎల్​ఈడీలు, రోల్స్​ రాయిస్​ కారులోని పుష్​ క్యాబిన్​ తరహా ఇంటీరియర్​ను ఏర్పాటు చేస్తున్నారు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ పూర్తి కథనం చదవండి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఓ వైపు పొత్తులు, సీట్ల సర్దుబాటు చర్చలు చూస్తూనే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో గోడలపై ఆయా పార్టీలు చిహ్నాలు దర్శనమిస్తున్నాయి. ఏప్రిల్​లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో, రాజకీయ పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాయి.

లగ్జరీ ప్రచార వాహనాల కోసం ఆర్డర్స్
అందుకే పలు రాజకీయ పార్టీలు కోయంబత్తూరులోని శివానంద కాలనీలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. తమ నాయకుల కోసం ప్రత్యేకంగా అత్యంత విలాసవంతమైన ప్రచార రథాలను తయారు చేయమని అడుగుతున్నాయి.

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్​లకు చెందిన నాయకుల కోసం ఎన్నికల ప్రచార వాహనాలు డిజైన్ చేసిన అనుభవం ఈ ప్రైవేట్ సంస్థకు ఉంది. క్రమంగా ఇది రాజకీయ నాయకుల కోసం క్యాంపెయిన్​ వెహికల్స్​ తయారుచేసే అగ్రగామి సంస్థగా ఎదిగింది. అందుకే ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ కోసం అత్యాధునిక సౌకర్యాలున్న వ్యాన్​ల కోసం ఆ సంస్థను ఆశ్రయిస్తున్నాయి.

"గతంలో రాజకీయ నాయకులు తమ ఎన్నికల ప్రచారం కోసం ఎక్కువగా 'టెంపో ట్రావెలర్ల'ను ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి 'ఫోర్స్​ అర్బానియా' వ్యాన్​లు వచ్చేశాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే వారి అవసరాలకు అనుగుణంగా వీటిని అప్​గ్రేడ్​ చేస్తున్నాం. మేము రీమోలింగ్ చేసిన వాహనాలను పరిశీలిస్తే, అందులో అత్యాధునిక సాంకేతికతతో, లగ్జరీ ఫిట్టింగ్​లతో అద్భుతంగా ఉంటుంది."
- రియాస్​, ఎన్నికల ప్రచార వాహనాలను రీమోడలింగ్ చేసే ప్రైవేటు సంస్థ యజమాని

డిజైన్ చేశారిలా!
"రాజకీయ నాయకులు ఎన్నికల కోసం దీర్ఘకాలంపాటు ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు, ఫోర్స్​ అర్బానియాను రీడిజైన్ చేశాం. అందులో నేతలు కూర్చునేందుకు 'స్వివెల్​ మెకానిజం'తో కూడిన సీట్లు అమర్చాం. దీని వల్ల వారు సౌకర్యవంతంగా కూర్చొని ప్రసంగించవచ్చు. అంతేకాదు వాహనంలోనే సులభంగా అటూఇటూ కదలవచ్చు. ఇక బహిరంగ సభల కోసం ఈ వ్యాన్లలో హైడ్రాలిక్​/ మాన్యువల్ లిఫ్ట్​ సిస్టమ్​తో కూడిన స్టేజ్​ ఏర్పాటు చేశాం. లిఫ్ట్ ఇష్టం లేనివారు కదిలే మెట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ వల్ల నేతలు ఎత్తైన వేదికపై నుంచి నేరుగా ప్రజలతో మాట్లాడే అవకాశం ఏర్పడుతుంది.

ఇక నేతల సుదీర్ఘ ప్రచారయాత్రలను దృష్టిలో ఉంచుకుని, వాహనంలో విశ్రాంతి తీసుకోవడానికి బెర్త్​లు ఏర్పాటు చేశాం. పార్టీ కార్యకర్తలతో, ముఖ్యులతో సమావేశం నిర్వహించడానికి సోఫా సెట్లు కూడా పొందుపరిచాం. అంతేకాదు ఈ ప్రచార వాహనాల్లో ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దీని వల్ల నాయకులు వాహనం లోపల ఉన్నప్పటికీ, బయట ఉన్న కార్యకర్తలు వారిని స్పష్టంగా చూడవచ్చు. అలాగే నాయకులు ఇచ్చే ప్రసంగాలు ప్రజలందరికీ స్పష్టంగా వినిపించేలా దీనిలో అత్యాధునిక ఆడియో సిస్టమ్​లను ఏర్పాటు చేశాం. నేతల వెంట వచ్చే భద్రతా సిబ్బంది కోసం వాహన బయట హ్యాండ్​రైల్స్​, మెట్లు పెట్టాం. దీని వల్ల సుమారు 15 మంది సిబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు" అని రియాస్​ పేర్కొన్నారు.

అడ్వాన్స్​డ్ ఫీచర్స్​
గత ఎన్నికల్లో వాడిన ప్రచార వాహనాల కంటే, ఈసారి తయారు చేస్తున్న వాహనాల్లో అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచినట్లు రియాస్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రచార రథాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, 24 గంటల ఇంటర్నెట్ సౌకర్యం, రెండు స్మార్ట్​ ఎల్​ఈడీ టీవీలు, బయటివైపు ఒక పెద్ద ఎల్​ఈడీ డిస్​ప్లే స్క్రీన్​, ప్రచార కార్యక్రమాలను రికార్డ్ చేయడానికి కెమెరాలు అమర్చినట్లు తెలిపారు.

"ఇక లగ్జరీల విషయానికి వస్తే, టచ్​ సెన్సార్స్​తో పనిచేసే రెక్లైనర్ సీట్లు, రోల్స్ రాయిస్​ కార్ల తరహాలో ప్రీమియం యాంబియెంట్​ సీలింగ్ లైటింగ్, అధునాతన గ్రీన్​ రెస్ట్​రూమ్​ సౌకర్యాలు ఉంటాయి. అయితే ఈ హై-ఎండ్​ ప్రచార వాహనాల తయారీకి అయ్యే ఖర్చు, వాటిలో పొందుపరిచే ఫీచర్లు, స్పెసిఫికేషన్లను బట్టి సుమారు రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుంది. వివిధ రాజకీయ పార్టీలు నుంచి, ముఖ్యంగా చెన్నై నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నెలలోనే మేము 7 వాహనాలను డెలివరీ చేశాం. మరికొన్ని తయారీ దశలో ఉన్నాయి." అని రియాస్ చెప్పారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ తరహా వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

'న్యాయ వ్యవస్థలో అవినీతి'పై NCERT బుక్‌లో ఛాప్టర్- సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

'గ్రీన్ గోల్డ్‌'తో స్వయం ఉపాధి- రూ.120తో రూ.50వేల ఆదాయం- ఈ పనిని నేర్చుకుంటే జీవితం మారిపోతుంది!