ETV Bharat / bharat

'రాహుల్ ఏజ్ పెరుగుతోంది- కానీ ఆ గద్దె దక్కదు'- కాంగ్రెస్​కు బీజేపీ కౌంటర్ ఎటాక్

ఇజ్రాయెల్​లో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు- రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ ఘాటు వ్యాఖ్యలు

Sambit Patra, BJP national spokesperson
Sambit Patra, BJP national spokesperson (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 6:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

BJP Says Rahul Getting Old : ఇజ్రాయెల్​ పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ గురువారం తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీకి వయసు అయిపోతోందని, ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం లేనందున కాంగ్రెస్​ అసంతృప్తితో ఉందని ఎద్దేవా చేసింది. "రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం పూర్తిగా రాజీపడ్డారు. దేశ తొలి ప్రధానిగా ఉన్న సమయంలో జవహర్​లాల్ నెహ్రూ భారత భూభాగాలను చైనా, పాకిస్థాన్​లకు ఎందుకు కానుకగా ఇచ్చేశారో కాంగ్రెస్ దేశానికి చెప్పాలి" అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు.

నెతన్యాహు సర్కార్​కు మద్దతా?
అంతకుముందు, ఇజ్రాయెల్ పార్లమెంట్​లో ప్రధాని మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును మోదీ నిస్సిగ్గుగా సమర్థించారని విమర్శించింది. "గాజాలో మారణహోమానికి పాల్పడుతున్న, వేలాది మంది పాలస్తీనియన్లను ఆకలితో అలమటించేలా చేస్తున్న నెహన్యాహు ప్రభుత్వానికి మోదీ నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చారు" అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్​ శర్మ ఎక్స్ వేదికగా విమర్శించారు.

బీజేపీ కౌంటర్ ఎటాక్
కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ ప్రతిదాడికి దిగింది. దేశానికి, ప్రధాని మోదీకి ఏదైనా మంచి జరిగినప్పుడు కాంగ్రెస్​ దానిని 'చెడు వార్త'గా భావిస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. "ఇజ్రాయెల్ పార్లమెంట్​లో ప్రధాని మోదీకి లభించిన గౌరవం దేశానికే గర్వకారణం. అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా మోదీ, మోదీ అని నినదించారు. అది 140 కోట్ల భారతీయుల పట్ల ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్న ప్రేమకు నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు.

"భారత్​-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు స్పీకర్ ఆఫ్​ ది కెస్సెట్​ మెడల్​ లభించింది. కానీ అధికారం (ప్రధాని పీఠం) దక్కలేదనే బాధలో కాంగ్రెస్ ఉంది. రాహుల్ బాబాకు వయస్సు మళ్లుతోంది. కానీ ఆయనకు ప్రధాని పీఠం దక్కదు."
- సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి

నెహ్రూపై తీవ్ర ఆరోపణలు
ఎప్​స్టీన్​ ఫైల్స్ ప్రభావంతో మోదీ రాజీపడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించడంపై సంబిత్ పాత్ర తీవ్రంగా స్పందించారు. ఆయన జవహర్​లాల్​ నెహ్రూపై సంచలన ఆరోపణలు చేశారు. నెహ్రూ హయాంలో భారత్​ మ్యాప్​ను శాశ్వతంగా మారుస్తూ చైనా, పాకిస్థాన్​లకు కీలక భూభాగాలను అప్పగించారని ఆరోపించారు. చైనాకు కోపం వస్తుందనే భయంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించారని అన్నారు.

'చైనా, పాకిస్థాన్​లు జవహర్​లాల్​ నెహ్రూకు ఏమైనా లంచం ఇచ్చాయా? భద్రతా మండలి సీటును ఆయన ఎందుకు వదులుకున్నారు? అనేది కాంగ్రెస్ చెప్పాలి. నెహ్రూను 'చాచా కాంప్రమైజ్డ్' అని పిలవాలి' అని సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు.

ఈ ఏడు ప్రశ్నలకు సమాధానం కావాలి?
అన్ని రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన నెహ్రూ కుటుంబం 7 కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు.

  1. పండిట్ నెహ్రూ టిబెట్​ను ఎందుకు చైనీస్ భూభాగంగా అంగీకరించారు.
  2. ఆక్సాయ్​చిన్​ ప్రాంతంలో చైనా కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చేసిన హెచ్చరికలను నెహ్రూ ఒక వదంతిగా కొట్టిపడేశారు. పార్లమెంట్​లో కూడా దీనిని ఒక వదంతి అని ఎందుకు చెప్పారు?
  3. ఎవరి సమ్మతి లేకుండా నెహ్రూ కశ్మీర్​లో ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండమ్​)కు ఎందుకు పిలుపునిచ్చారు?
  4. బంగాల్​లోని బెరుబారీ యూనియన్​లో సగభాగాన్ని నెహ్రూ ఎందుకు పాకిస్థాన్​కు కానుకగా ఇచ్చేశారు?
  5. స్వరణ్​ సింగ్- భుట్టో చర్చల సమయంలో పూంచ్​, ఉరి, గురెజ్ ప్రాంతాలను పాక్​కు అప్పగించడానికి భారత్ ఎందుకు అంగీకరించింది?
  6. పంజాబ్​లోని సర్జా మజ్రా, రఖ్​ హర్దిత్ సింగ్​, పాఠన్​కే గ్రామాలను దాయాదికి అప్పగించే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
  7. ఎవరి ఒత్తిడి వల్ల పండిట్ నెహ్రూ రాణ్​ ఆఫ్​ కచ్​లో 300 చదరపు మైళ్ల భూమిని భారత్ కల్పోయేలా చేశారు?

ఎప్​స్టీన్​​ ఫైల్స్​తో అమెరికా ఒత్తిడి- ట్రేడ్​ డీల్ వల్ల మన రైతులే బలి : రాహుల్ గాంధీ

NCERT వివాదం- బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి