Telangana Panchayat Elections Results2025

ETV Bharat / bharat

'స్వచ్ఛమైన గాలి కావాలి'- కాలుష్యంపై 'ఇండియా గేట్'​ వద్ద నిరసనలు

చిన్నారుల ‘ఊపిరి’ ఉక్కిరిబిక్కిరి- దిల్లీలో నిరసనలు

Delhi Air Pollution Protest
Delhi Air Pollution Protest (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : November 9, 2025 at 10:57 PM IST

2 Min Read
Choose ETV Bharat

Delhi Air Pollution Protest : దేశ రాజధాని దిల్లీలో కాలుష్య తీవ్రతతో గాలి నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ దిల్లీ వాసులు ఆందోళనలు చేపట్టారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు తల్లిదండ్రులు, పర్యావరణ కార్యకర్తలు ఇండియా గేట్‌ వద్ద భారీ నిరసనకు దిగారు. ముఖ్యంగా చిన్నారులతో కలిసి అనేక మంది మహిళలు హాజరై, ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

"మాకు ఉన్నది ఒకటే సమస్య. అది స్వచ్ఛమైన గాలి. ఈ సమస్య అనేక ఏళ్లుగా ఉన్నా, ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. ఇది రాజ్యాంగ హక్కులను అతిక్రమించడమే అవుతుంది. దాదాపు 10 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాం. ప్రజల ఆరోగ్య, హక్కుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మాకు అర్థం కావడం లేదు. మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన చేపట్టాం. కానీ పోలీసులు వచ్చి మమ్మల్ని లాకెళ్లి బస్సుల్లో ఎక్కించారు. ఇది రాజకీయ అంశం కాదు. కేవలం స్వచ్ఛమైన గాలి కోసం మాత్రమే పోరాడుతున్నాం."

--నేహా, ఉద్యమకారిణి

షీలా దీక్షిత్‌ హయాంలో దిల్లీ ‘గ్రీన్‌ క్యాపిటల్‌’
స్వచ్ఛమైన గాలిని అందించడంలో దిల్లీ ప్రభుత్వం విఫలమైందని మరో నిరసనకారుడు ఆరోపించారు. మాజీ సీఎం షీలా దీక్షిత్‌ హయాంలో దిల్లీ ‘గ్రీన్‌ క్యాపిటల్‌’గా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ నాయకులు మాత్రం బాధ్యత వహించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.

"ప్రజా ప్రతినిధులతో సమావేశం కావాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరినప్పటికీ నిరాకరించారు. కాలుష్య తీవ్రత వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తల్లిదండ్రులు భారీ స్థాయిలో వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. స్వచ్ఛమైన గాలిలో పెరిగే పిల్లలతో పోలిస్తే వీరి జీవితకాలం దాదాపు 10 సంవత్సరాలు తక్కువగా ఉంటోంది."

--భావ్రీన్‌ ఖండారీ, పర్యావరణవేత్త

అయితే, ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా గేట్‌ వద్ద నిరసనలకు దిగారని పేర్కొంటూ పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇండియా గేట్​ నిరసనల ప్రాంతం కాదని డీసీపీ దేవేశ్​ మహాలా తెలిపారు. వీఐపీ రాకపోకలతో పాటు భద్రత కారణాల దృష్ట్యా బలగాలను మోహరించినట్లు చెప్పారు. నిరసనల కోసం నిబంధనల ప్రకారం జంతర్​ మంతర్​ వద్ద అనుమతి తీసుకుని చేపట్టాలని సూచించారు. కాగా, ఆదివారం దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఉదయం సమయంలో గాలి నాణ్యత సూచిక 391గా నమోదు కాగా ఆ తర్వాత కాస్త తగ్గింది. సాయంత్రం 4 గంటల సమయంలో గాలి నాణ్యత సూచిక 370గా నమోదైంది.