ఆ స్కూల్లో ఐదు తరగతులకు ఒకే టీచర్- అన్ని సబ్జెక్టులకు ఆయనే గురువు- ఆందోళనలో స్టూడెంట్స్, పేరెంట్స్
55 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు- అన్ని సబ్జెక్టులు ఆయనే బోధన

Published : November 9, 2025 at 9:44 PM IST
One Teacher For Five Classes: సాధారణంగా ఏదైనా స్కూల్లో ప్రతీ సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటారు. ఆ సబ్జెక్ట్లోని పాఠాలను విద్యార్థులకు ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు భోదిస్తారు. అయితే మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలోని ఓ పాఠశాలలో మాత్రం వింత పరిస్థితి ఏర్పడింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒకే ఒక టీచర్ ఉన్నారు. అన్ని సబ్జెక్టులకు ఆయనే గురువు. దీంతో స్కూల్ పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తమ పిల్లల భవిష్యత్ ఏంటి అని వాపోతున్నారు.
55 మందికి ఒకే టీచర్
కొల్హాపుర్లోని కలంబే టార్ఫ్ కాలే గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. అక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలకు పాఠాలు భోదిస్తున్నారు. ఆ పాఠశాలలో మొత్తం 55 మంది విద్యార్థులు ఉండగా, ఒకే ఒక టీచర్ ఉన్నారు. ఆయనే అన్ని తరగతులకు సబ్జెక్టులను భోదిస్తున్నారు. అయితే ఇదే విషయంపై ఈ ఏడాది మార్చి నుంచి గ్రామస్థులు, గ్రామ పంచాయతీ, పాఠశాల నిర్వహణ కమిటీ కలిసి జిల్లా పరిషత్ ప్రాథమిక విద్యా శాఖకు పదేపదే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలాగే రాష్ట్ర విద్యా మంత్రి దాదాసాహెబ్ భూసేకి వినతిపత్రం ఇచ్చినా ఎటువంటి మార్పు లేదు. పాఠశాలకు కొత్త ఉపాధ్యాయులు ఇప్పటివరకు ఎవరూ రాలేదు.
గ్రామస్థుల్లో ఆందోళన!
రాష్ట్ర విద్యా హక్కు చట్టం ప్రకారం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. అలాగే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే కలంబే టార్ఫ్ కాలే పాఠశాలలో అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ క్రమంలో విద్యా హక్కు చట్టం నిబంధనలను పాఠశాల విద్యా శాఖ పాటించడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
8 నెలలుగా ఒకే టీచర్
కొన్నాళ్ల క్రితం వరకు ఈ స్కూల్లోని విద్యార్థులు పలు టాలెంట్ ఎగ్జామ్లో రాణించారు. స్కాలర్ షిప్ ఇచ్చే ప్రతిభ శోధన పరీక్షలో మొదటి స్థానంలో నిలిచారు. అయితే గత 8 నెలలుగా ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల చదువుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు 1నుంచి 5వ తరగతి వరకు స్టూటెంట్స్ అన్ని సబ్జెక్టులను బోధించడం కష్టతరమవుతోంది.
ఆందోళన బాట పడతామన్న గ్రామస్థులు
అయితే, కలంబే టార్ఫ్ కాలే గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ జిల్లాలోని ఓ టీచర్ కొన్నాళ్ల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తవారు ఇంకా రాలేదు. అయితే గ్రామంలోని స్కూల్లో పనిచేసేందుకు ఒక టీచర్ కూడా ప్రభుత్వానికి దొరకడం లేదా అని కలంబే టార్ఫ్ కాలే గ్రామస్థులు ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ విషయాన్ని జిల్లా విద్యా శాఖ దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఈ తీవ్రమైన సమస్యను విస్మరిస్తోందని మండిపడ్డారు. టీచర్ను త్వరగా నియమించకపోతే, పాఠశాల విద్యార్థులను సంఘటితపరిచి జిల్లా పరిషత్లో నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
అయితే స్కూల్లో టీచర్ల కొరతపై ప్రశ్నించేందుకు ఈటీవీ భారత్ ప్రతినిధి జిల్లా పరిషత్ ప్రాథమిక విద్యా శాఖ అధికారి మీనా షెల్కర్ను సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే, ఆమె అందుబాటులో లేరు. కాగా, జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులు చాలా చోట్ల పదవీ విరమణ చేస్తుండటంతో ఈ సమస్య మరింత జఠిలమైంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరగా ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాలని విద్యార్థుల తల్లీదండ్రులు కోరుతున్నారు. త్వరలో బదిలీలు పూర్తి చేయాలని విద్యా శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా, స్కూళ్లలో టీచర్ల కొరతపై జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్. కార్తికేయన్ స్పందించారు. "పోస్టింగ్ కోసం ప్రతిపాదనలు అందాయి. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో వీలైనంత త్వరగా టీచర్లను నియమిస్తాం" అని తెలిపారు.
భారతీయ మల్లయోధుడి డాక్యుమెంటరీ- అమెరికాలో విశేష ప్రేక్షకాదరణ- ఇంతకీ ఎవరీ బాడీ బిల్డర్?
100 సీసీ బైక్పై సోదరుల సాహస యాత్ర- గ్వాలియర్ నుంచి హిమాలయాల వరకు- డెడ్ చీప్గా టూర్స్!

