కేవలం ఒక్క రూపాయి, కొబ్బరికాయతోనే పెళ్లి- వరకట్నం దురాచారానికి చెక్ పెట్టిన ఆదర్శ కుటుంబం
ఆడపిల్లలకు చదువే అసలైన కట్నం- వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న వరుడి కుటుంబం- ఎక్కడో తెలుసా?

Published : July 8, 2026 at 8:10 PM IST
No Dowry Wedding : దేశంలో వరకట్న వేధింపులు, మరణాలు గురించి ప్రతినిత్యం వార్తలు వింటున్న ఈ రోజుల్లో, ఈ సామాజిక దురాచారానికి వ్యతిరేకంగా ఓ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. వధువు కుటుంబం నుంచి ఎలాంటి కట్నం ఆశించకుండా పెళ్లి జరిపించింది. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ పూర్తి కథనం చదవండి.
రాజస్థాన్లోని సికార్ జిల్లా మద్ని-మందా ప్రాంతానికి చెందిన బురానియా కుటుంబం ఈ గొప్ప నిర్ణయం తీసుకుంది. వధువు కుటుంబం నుంచి ఎలాంటి కట్నం ఆశించకుండా, ఎంతో సింపుల్గా పెళ్లి జరిపించింది. అర్జున్రామ్ బురానియా కుమారుడైన సుభాశ్ బురానియా, పంచీలాల్ రాబియా కుమార్తె అయిన సరోజ్ను పెళ్లిచేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్ పోలీస్ శాఖలో పనిచేస్తోంది. అయితే పెళ్లికి ముందే ఇరుకుటుంబాలు కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకోకూడదని నిర్ణయించుకున్నాయి. కేవలం ఒక రూపాయి, కొబ్బరికాయ మార్చుకొని ఎంతో సాదాసీదాగా వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాయి.
ఇదే మొదటిసారి కాదు!
గతంలో ఈ కుటుంబం తమ కుమార్తె పింకీ బురానియా పెళ్లిని కూడా ఇదే పద్ధతిలో జరిపించడం విశేషం. "ఇది మా ఇంట్లో కొత్తగా మొదలైన పద్ధతి కాదు. ఏళ్ల తరబడి మా కుటుంబం దీనిని ఒక నియమంలాగా పాటిస్తోంది. నా తండ్రి బోదూరామ్, మా పెద్దక్క డాక్టర్ సుమన్ పెళ్లి కూడా ఇదే విధంగా ఎలాంటి కట్నకానుకలు ఇవ్వకుండా చేశారు. ఈ విధంగా ఒక మంచి సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ రోజు మా కుటుంబం అంతా కలిసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఇకపై మా ఇంట్లో జరిగే ఏ పెళ్లిలోనూ వరకట్నం ఇవ్వకూడదు, తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాం. సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వడం కోసమే ఒక రూపాయి, కొబ్బరికాయ ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాన్ని పాటిస్తున్నాం" అని వరుడి బంధువు (సోదరుడు) డాక్టర్ యుధ్వీర్ సింగ్ బురానియా చెప్పారు.
ఆడపిల్లలకు చదువే అసలైన కట్నం
బురానియాలది ఒక వ్యవసాయ కుటుంబం. అయినప్పటికీ వారు చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ కుటుంబంలోని అమ్మాయిలు (డాక్టర్ సుమన్, డాక్టర్ ప్రియాంక) ఇద్దరూ మెడికల్ ఫీల్డ్లో సెటిల్ అయ్యారు. పెద్ద కుమారుడు మహేశ్ కుమార్ బురానియా 'సశస్త్ర సీమా బల్' (ఎస్ఎస్బీ)లో చేరి దేశానికి సేవ చేస్తున్నారు. అలాగే ఆ ఇంటి అల్లుడు డాక్టర్ పంకజ్ నితార్వాల్ జైపుర్లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. "ఈ మంచి ఆలోచనను ముందుకు తీసుకువెళ్లడంలో మా అల్లుడి సహకారం ఉంది. ఆడపిల్లలను బాగా చదివించి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయడమే మనం ఇచ్చే అతిపెద్ద కట్నం అని మా కుటుంబం నమ్ముతుంది" అని యుధ్వీర్ చెప్పారు.
ఆ తెగలో వరకట్నం బ్యాన్
నేటి ఆధునిక సమాజంలోనూ కొందరు వరకట్నం పేరుతో మహిళల్ని వేధిస్తుంటే, బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉంటే థరు తెగ మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ తెగ ప్రజలెవరూ వధువు కుటుంబం నుంచి కట్నం తీసుకోరు. అక్కడి పెళ్లిళ్లలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ తప్పే. ఒకవేళ ఎవరైనా వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా వారిని గ్రామ నుంచి బహిష్కరిస్తారు కూడా. అందువల్ల ఆ తెగ ప్రజలెవ్వరూ ఈ నియమాలను ఉల్లంఘించడానికి ధైర్యం చేయరు. అయితే ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు శతాబ్దాలుగా వారు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. థరు తెగ ప్రజలు పెళ్లిని రెండు కుటుంబాలను, రెండు హృదయాలను కలిపే పవిత్ర బంధంగా భావిస్తారు. అందుకే వివాహం చేయడం కోసం వరకట్నం తీసుకుని దాన్నొక వ్యాపారంలా మార్చాలని వారు చూడరు. ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1966లో గోబర్హియా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక్క వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

