బిహార్ రాజకీయాల్లోకి మరో వారసుడు- జేడీయూలోకి సీఎం కొడుకు
నిశాంత్ కుమార్కు పార్టీలో కీలక బాధ్యతలను ఇవ్వనున్నట్లు బిహార్ మంత్రి వెల్లడి

Published : March 3, 2026 at 1:05 PM IST
Nitish Kumar Son in Politics : బిహార్ రాజకీయాల్లోకి మరో వారసుడు రానున్నారు. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. హోలీ సందర్భంగా పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. నిశాంత్ కుమార్కు పార్టీలో కీలక బాధ్యతలను ఇవ్వనున్నట్లు బిహార్ మంత్రి శ్రవణ్ కుమార్ వెల్లడించారు. బిహార్ ప్రజలు, జేడీయూ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
"హోలీ పండగ సందర్భంగా బిహార్ యువత, జేడీయూ కార్యకర్తల కోరిక మేరకు నిశాంత్ కుమార్ పార్టీలో చేరనున్నారు. ఆయనకు ఏ పదవి ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఆయనకు పార్టీ చాలా కీలకమైన బాధ్యతలను అప్పగించనుంది. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది."
--శ్రవణ్ కుమార్, బిహార్ మంత్రి
మరోవైపు నిశాంత్ కుమార్ పార్టీలో చేరడంపై బిహార్ మంత్రి అశోక్ చౌదరీ స్పందించారు. విద్యావంతుడు ఇంజినీర్ అయిన నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆయన చెప్పారు. నీతీశ్ కుమార్ సింప్లిసిటీ, వ్యవహార శైలి నిశాంత్లోనూ ఉన్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తల ఒత్తడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
"నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లో ఉండాలి. ఆయన ఇంజినీర్ మాత్రమే కాకుండా నీతీశ్ పోలికలు చాలా ఉన్నాయి. ఇదంతా పార్టీ కార్యకర్తల మద్దతు, ఒత్తిడి వల్లే జరుగుతుంది. ఇందులో నీతీశ్ కుమార్ నిర్ణయం ఏం లేదు. నిశాంత్ పార్టీలో చేరాలని చాలా రోజుల నుంచి పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. హోలీ పండగకు ఇదొక అద్భుతమైన బహుమతి."
--అశోక్ చౌదరి, బిహార్ మంత్రి
బిహార్ రాజకీయాల్లో నిశాంత్ కుమార్ తప్పనిసరిగా ప్రవేశించాలని జేడీయూ నేత నీరజ్ కుమార్ అన్నారు. రాజ్యసభకు నిశాంత్ కుమార్ అర్హత గల వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. "నిశాంత్ లాంటి వ్యక్తి పార్టీలో చేరాలని కార్యకర్తలు, మద్దతుదారు కోరుకున్నారు. అయితే ఎవరు రాజ్యసభకు వెళ్లాలని విషయాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఎవరైనా ఆయన అర్హతను ప్రశ్నిస్తే నిశాంత్పై ఏదైనా అవినీతి మరకలు ఉన్నాయా? ఎలాంటి మచ్చ లేని వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రజా జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు నిశాంత్ను తేజస్వీ యాదవ్తో పోలిస్తే, ఆయనపై నాలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. నిశాంత్ కుమార్ చదువులోనూ చాలా మందున్నారు. కాబట్టి వీరిద్దరి మధ్య ఎలాంటి పోలిక లేదు. ఇప్పుడు బిహార్ యువత నిశాంత్ రాజకీయ ప్రవేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది." అని నీరజ్ కుమార్ అన్నారు.
నిశాంత్ కుమార్ రాజకీయ ఎంట్రీపై చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతోంది. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినప్పుడు ఈ ప్రచారం ఊపందుకుంది. గతేడాది డిసెంబర్లో దీనిపై స్పందించిన జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, రాజకీయ ప్రవేశంపై నిశాంత్ నిర్ణయం తీసుకుంటారన్నారు. నిశాంత్ పార్టీ కోసం పని చేయాలని కార్యకర్తలు, మద్దతుదారులు కోరుకుంటున్నారని తెలిపారు. " పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రతీ ఒక్కరూ నిశాంత్ రావాలని కోరుకుంటున్నారు. మా అందరికీ నిశాంత్ పార్టీ చేరాలని ఉంది. ఇక ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు పార్టీలో చేరాలని ఆయనే నిర్ణయించుకోవాలి." అని అన్నారు.
మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా స్పందించారు. "ఇది నీతీశ్ కుమార్ ఏర్పాటు చేసిన పార్టీ. ఈ ఎన్నికల తర్వాత ఈ అంశంపై ఆయన నిర్ణయం తీసుకుంటారు. నీతీశ్ కుమార్ నిర్ణయం తీసుకుంటే పార్టీ మొత్తం దానిని అంగీకరిస్తుంది." అని అన్నారు.

