అంబులెన్స్లో మంటలు- నవజాత శిశువు సహా నలుగురు మృతి
అంబులెన్స్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు- శిశువు, శిశువు తండ్రి, డాక్టర్, నర్సు మృతి

Published : November 18, 2025 at 12:18 PM IST
Ambulance Catches Fire : ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి వెంటనే ఆసుపత్రికి తరలించే అంబులెన్స్కే అపాయం ఎదురైంది. మంటలు అంటుకుని అందులో ఉన్న నవజాత శిశువు సహా నలుగురు మృతిచెందారు. ఈ ఘటన గుజరాత్లోని అర్వల్లి జిల్లా మొదాసా పట్టణంలో జరిగింది. ఈ ప్రమాదంలో డాక్టర్, మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన శిశువు అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం మొదాసా నుంచి అహ్మదాబాద్కు అంబులెన్సులో బయలుదేరారు.
సోమవారం అర్థరాత్రి తర్వాత దాదాపు ఒంటి గంట ప్రాంతంలో మొదాసా- ధన్సుర రోడ్డులో ప్రయాణిస్తున్న అంబులెన్స్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటన రోడ్డుకు అవతల ఉన్న పెట్రోల్ బంకు సీసీ కెమెరాలో నమోదైంది. ఈ ఘటనలో శిశువు, శిశువు తండ్రి జిగ్నేష్ మోచి, డాక్టర్ శాంతిలాల్ రెంటియా, నర్సు బూరిబెన్ మనత్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మోచి ఇద్దరు బంధువులు, ఆంబులెన్సు డ్రైవరుకు కాలిన గాయాలైనట్లు చెప్పారు. వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. మంటలు అంటుకున్న వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ముందు సీట్లో కూర్చున్న డ్రైవరు, శిశువు బంధువులు గాయాలతో బయటపడ్డారు. కాగా వెనకసీట్లో ఉన్న చిన్నారి, తండ్రి, డాక్టరు, నర్సు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించినట్లు అర్వల్లి జిల్లా ఎస్పీ మనోహర్ సింహ్ జడేజా తెలిపారు.
డబుల్ డెక్కర్ బస్సు బోల్తా- ముగ్గురు మృతి!
ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్వేపై మంగళవారం తెల్లవారుజామున డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దిల్లీ నుంచి బిహార్లోని సివాన్కు వెళుతున్న బస్సు మంగళవారం తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో లాలా లజపతి రాయ్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (బిల్హౌర్) మంజయ్ సింగ్ తెలిపారు. మరోవైపు ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
పాల వ్యాను- ప్రయాణికుల వ్యాను ఢీ- ఒకరు మృతి!
మరోవైపు, ఓ పాల వ్యాను, ప్రయాణికుల వ్యాన్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం తమిళనాడులోని దిండిగల్లో జరిగింది. ప్రమాద ధాటికి ప్రయాణికుల వ్యాన్ నుజ్జునుజ్జయ్యింది. పాల వ్యాన్ కొంత మేర దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వ్యానులో చిక్కుకుపోయిన క్షతగాత్రులను వెలికితీశారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి విచారణ చేపట్టినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించే పనిలో ఉన్నామని పోలీసులు పేర్కొన్నారు.
రైల్వే లైన్ దాటుతుండగా ఢీకొట్టిన ట్రైన్- ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం

