ETV Bharat / bharat

అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్న NCB- ముంబయిలో రూ.1,745 కోట్ల కొకైన్‌ స్వాధీనం

ముంబయిలో రూ.1,745కోట్ల 349కిలోల హై-గ్రేడ్ కొకైన్‌ను స్వాధీనం- డ్రగ్స్‌ ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తామన్న అమిత్ షా- సలీండోలాను భారత్‌కు తరలించిన కొన్నిరోజులకే భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

NCB Busts Major Narcotics
NCB Busts Major Narcotics (X/AmitShah)
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2026 at 12:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

NCB Busts Major Narcotics : అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ముంబయిలో 1,745కోట్ల విలువైన 349కిలోల హై-గ్రేడ్ కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు అమిత్‌ షా ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలని ప్రభుత్వం నిశ్చయించినట్లు చెప్పారు. NCB ఓ చిన్న సరుకు ఆధారంగా వెళ్లి భారీ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఛేదించటం 'బాటమ్-టు-టాప్' విధానానికి ఓ అద్భుత ఉదాహరణ అని అమిత్‌ షా పేర్కొన్నారు. దీనిని ఒక అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్‌పై సాధించిన ఒక పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా NCB బృందాన్ని అభినందించారు. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, డ్రగ్ ట్రాఫికర్ సలీం డోలాను తుర్కియే నుంచి భారత్‌కు తరలించిన కొన్నిరోజులకే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.

"మాదకద్రవ్యాల ముఠాను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి నిశ్చయించుకున్నాం. ముంబయిలో రూ.1,745 కోట్ల విలువైన 349 కిలోల అత్యంత నాణ్యమైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఫలితంగా ప్రధాన అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాపై నార్కోటిక్స్ బ్యూరో ఉక్కుపాదం మోపింది. ఇది బాటమ్ టు టాప్ విధానానికి ఒక ఉదాహరణ. ఈ విధానంలో ఏజెన్సీ ఒక చిన్న సరుకును గుర్తించి దాని ఆధారంగా ఒక భారీ నెట్‌వర్క్‌ను పట్టుకుంది. ఈ అద్భుతమైన విజయానికి ఎన్‌సీబీ బృందానికి అభినందనలు."

--అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

ఇదిలా ఉండగా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్, దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు మహ్మద్ సలీం డోలాను భారత్‌కు అప్పగించింది తుర్కియే. ఇస్తాంబుల్‌ నుంచి అతడిని ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకొచ్చారు. 'ఆపరేషన్ గ్లోబల్ హంట్' కింద అంతర్జాతీయ, భారత నిఘా సంస్థలతో సమన్వయంతో ఈ ఆపరేషన్​ చేపట్టారు. భారత నిఘా ఏజెన్సీలు ఇచ్చిన సమాచారంతో తుర్కియే పోలీసులు శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నాయి. గతంలోనే సలీం డోలాపై భారత్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం సలీంను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు. గతేడాది జూన్‌లో సలీమ్‌ డోలా కుమారుడు తాహెర్‌ యూఏఈలో పట్టుబడ్డాడు. తాహెర్‌ను కూడా యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ క్రమంలోనే సలీమ్‌ డోలా ఆచూకీ లభించినట్లు సమాచారం. సలీం డోలాను విజయవంతంగా భారత్‌కు తీసుకురావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో అధికారులను ప్రశంసించారు. డ్రగ్స్ మాఫియా కింగ్‌పిన్‌లకు ప్రపంచంలో ఏ మూలనా రక్షణ దొరకదని అమిత్ షా హెచ్చరించారు.

కాగా, రెండు రోజుల క్రితమే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 11.4 కిలోల క్రిస్టల్‌మెత్‌ను స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.11.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా, ట్రాలీ బ్యాగులతో అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు మహిళలను గమనించారు. వారిని ఆపి తనిఖీలు చేపట్టగా బ్యాగుల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. దీంతో ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు శంషాబాద్‌ విమానాశ్రయంలో కూడా భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఎయిర్‌ ఆసియా విమానంలో బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 6.15 కిలోల హైడ్రోఫోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.15 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 16 సీల్డ్‌ ప్యాకెట్లలో దీనిని తెస్తుండగా తనిఖీలు చేపట్టి అధికారులు పట్టుకున్నారు.

ఈ షూలతో శత్రువులకు చుక్కలే! సైనికుడి బూట్లలోనే బుల్లెట్లు- వీటి ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్యపోతారు!

మిస్సైల్ ఫోర్స్‌ అభివృద్ధిపై భారత్ ఫోకస్- అగ్ని 6 పరీక్షకు రెడీ- ట్రయల్స్ దశకు లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిస్సైల్