ETV Bharat / bharat

ముంబయిలో వర్ష బీభత్సం- విరిగిపడిన కొండచరియలు- రైల్వే సరీస్వులు రద్దు

భారీ వర్షాలతో జలదిగ్బంధంలో ముంబయి- వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి- విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Heavy Rains In Mumbai
Heavy Rains In Mumbai (ETV bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 6, 2026 at 8:12 AM IST

3 Min Read
Choose ETV Bharat

Heavy Rains In Mumbai : దేశవ్యాప్తంగా వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రధానంగా వర్షాల దెబ్బకు దేశఆర్థిక రాజధాని ముంబయి నగరం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముంబయి పుణె మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు. ఈ వర్షాలు కారణంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడంతో సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, కర్జాత్‌-లోనావాల మధ్య ఠాకూర్‌వాడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే ఖండాలా-మంకీ హిల్ మధ్య మరో చోట కూడా మట్టి, రాళ్లు పట్టాలపైకి చేరాయి. దీంతో ముంబయి-పుణె మార్గంలో నడిచే పలు ముఖ్యమైన రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. సుదూర రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించగా, కొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేయడం లేదా సమయాలను మార్చారు. కొండచరియలు తొలగించి రైల్వే ట్రాక్‌లను పునరుద్ధరించే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైళ్ల తాజా వివరాలను తెలుసుకుని బయలుదేరాలని సూచించారు. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్స్​లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.

లోనావాలా వద్ద భారీ ట్రాఫిక్ జామ్
భారీ వర్షాల కారణంగా ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలోని 'మిస్సింగ్ లింక్' మార్గంలో టన్నెల్-2 సమీపంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సోమవారం తెల్లవారుజామున నుంచి పుణె నుంచి ముంబయి వెళ్లే వాహనాలను లోనావాలా మీదుగా మళ్లించారు. దీంతో లోనావాలా నగరం గుండా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు పుణే-మంగావ్ జాతీయ రహదారి (పౌడ్-మంగావ్ మార్గం)పై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ముంబయి-పుణె మార్గంలో ప్రయాణించాలని వాహనదారులు, రైలు ప్రయాణికులకు అధికారులు సూచించారు. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతాయని వెల్లడించారు.

ఏడుగురు మృతి
మాన్‌ఖుర్ద్ ప్రాంతంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి మూడంతస్తుల నివాస భవనం కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరొకరు గాయపడ్డారు. భవనం పక్కనే గుడిసే కూడా కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. గోరెగావ్ ఈస్ట్‌లోని ఆరే కాలనీ ప్రాంతంలో చెట్టుకొమ్మ పడి 18 ఏళ్ల యువకుడు మృతిచెందాడు.

విద్యాసంస్థలకు సెలవు
వర్షాలు కారణంగా ముంబయి, ఫుణె, థానే, పాల్ఘర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు బీఎంసీ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ముంబయికి ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో గంటకు 60 నుంచి 70 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

అటు గుజరాత్‌లోనూ కురిసిన వానలు కారణంగా, పలుచోట్ల రోడ్లపై పెద్దఎత్తున నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లోనూ రాబోయే 24 గంటల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లోనూ వానలు దంచికొట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో ఒడిశా, బంగాల్​ కొన్ని ప్రాంతాలకు హైఅలర్ట్‌ జారీ చేశారు.

హర్మూజ్​ జలసంధిని దాటిన 15 ఎరువుల నౌకలు- సరఫరాకు ఎలాంటి ఢోకా లేదన్న కేంద్రం

భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం- పలు విమానాలు రద్దు- అంబానీ కాన్వాయ్​కు తప్పిన ప్రమాదం