తెలంగాణ, గుజరాత్ డ్రగ్ నెట్వర్క్ల గుట్టు రట్టు- రూ.100 కోట్ల మాదకద్రవ్యాలు సీజ్!
అంతర్రాష్ట్ర డ్రగ్స్ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు- రూ. 100 కోట్ల విలువైన మత్తుపదార్థాలు, డ్రగ్స్ తయారీ సామాగ్రి స్వాధీనం!

Published : June 3, 2026 at 9:42 PM IST
100 crore Drug Case : తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అక్రమంగా నడుపుతున్న డ్రగ్స్ తయారీ కేంద్రాల గుట్టును ముంబయి పోలీసులు రట్టు చేశారు. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి సుమారు రూ.100 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, తయారీకి వాడే పరికరాలు, రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముంబయి పోలీసులు చేపట్టిన డ్రగ్స్ దందా ఆపరేషన్లో తీగ తాగితే తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో డొంక కదిలింది.
వేర్వేరు రాష్ట్రాల్లో భారీ నెట్వర్క్!
మే 21న ముంబయి శివారు ప్రాంతాల్లో క్యాబ్ డ్రైవర్గా చలామనీ అవుతూ మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ముస్కాన్ సమీర్ ఖాన్ (26)ను శాకినాక పోలీసులు పక్కా సమాచారంతో పట్టేశారు. ఆమె వద్ద నుంచి 101 గ్రాముల మెఫెడ్రోన్ (MD) అనే రకం డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెతోపాటు డ్రగ్ సరఫరాదారు పప్పును ఆరెస్టు చేసి విచారించగా గుజరాత్ నర్మదా జిల్లాలోని డ్రగ్స్ అక్రమ దందా బయటపడింది. నర్మద జిల్లా నందోద్ తాలూకాలో ఉన్న వర్ఖద్ గ్రామంలో కొందరు వ్యక్తులు మెఫెడ్రోన్(MD) అనే మాదకద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి రూ.75 కోట్ల విలువైన నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అందులో 20 గ్రాముల MD డ్రగ్స్ ఉంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

తెలంగాణ కేంద్రం ఇలా!
మే 29న మహారాష్ట్ర మీరా రోడ్- భయందర్, వసాయి-విరార్కు చెందిన క్రైమ్ డిటెక్షన్ యూనిట్ పోలీసులు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పీచేర్యాగడి తండాలో నడుపుతున్న డ్రగ్స్ ముఠాను ఛేదించారు. ఈ కేంద్రంపై దాడిచేసి రూ.21 కోట్ల విలువైన మత్తుపదార్థాలు, రసాయనాలు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు. అలాగే ఇక్కడ్నుంచి రోజుకు రూ.21 కోట్ల విలువవైన MD డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆపరేషన్ సాగిందిలా!
ఈ ఆపరేషన్ సుమారు రెండు నెలలుగా కొనసాగింది. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా ఠాణేలోని ప్రధాన కార్యాలయంలో డ్రగ్స్ ముఠా వివరాలను పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్ 4న మహారాష్ట్ర నయనగర్లో నివసించే ఫిర్దౌస్ అర్బాజ్ ఖురేషి నివాసంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్లో రూ. 2.66 కోట్ల విలువైన 1.324 కిలోగ్రాముల MD మాదకద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఫిర్దోస్ అర్బాజ్ ఖురేషి, ఆమె భర్త అర్బాజ్ వకీల్ ఖురేషీపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో మీరా రోడ్, ఆజాద్ మైదాన్, మాల్వాని, మనోర్, ఖలాపూర్ ప్రాంతాలకు చెందిన 15 మందిని అరెస్టు చేసి వారి బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అలాగే వీరి నుంచి రూ.13.66 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్వర్క్ గుట్టు రట్టు!
అయితే ముంబయిలో పలు ప్రాంతాల్లో అరెస్టైన వారిని విచారించగా, అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్వర్క్ గుట్టు బయటపడింది. అనంతరం ఛత్తీస్గడ్లోని ఖలాపుర్లో వీరస్వామి నాయుడు, హైదరాబాద్లో నాసిర్, మొహమూద్ మెహబూబ్ ఖాన్ అదుపులోకి తీసుకున్నారు. నాసిర్ను పోలీసులు విచారించగా జహీరాబాద్ ప్రాంతంలోని కోహీర్ మండలం పీచేర్యాగడి తండాలో డ్రగ్స్ తయారీ కేంద్రం గురించి బయటపడింది. ఈ సమాచారం మేరకు మహారాష్ట్ర పోలీసులు గతనెల 29న తెలంగాణలో దాడులు నిర్వహించి డ్రగ్ర్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు.
విమానయాన రంగానికి ప్యాకేజీ- రహదారులకు భారీగా నిధులు- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
'సెక్షన్ 301' విషయంలో యూఎస్తో చర్చలు జరుపుతున్నాం : అమెరికా టారిఫ్ల ప్రతిపాదనల వేళ భారత్

