ఇంట్లోనే లాభాల పంట- అరుదైన పుట్టగొడుగుతో భారీ ఆదాయం- కిలో ధర రూ.లక్ష
ఇంటినే ఆధునిక వ్యవసాయ కేంద్రంగా మార్చిన దేవికా సింగ్- భూమి లేకుండానే 90 రోజుల్లో లక్ష రూపాయల ఆదాయం - హిమాలయాలు, టిబెట్ వంటి చల్లని ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పుట్టగొడుగును పండిస్తున్న దేవికా

Published : January 21, 2026 at 5:21 PM IST
Bhopal Girl Mushroom Farming : ఇంట్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో, లక్షల రూపాయల విలువైన పంట సాగు చేస్తున్నారని వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మధ్యప్రదేశ్కు చెందిన ఓ యువతి ఇదే పని చేసి చూపిస్తోంది. ఆమె తన ఇంట్లో ఒక భాగాన్ని పూర్తిస్థాయి ఆధునిక వ్యవసాయ క్షేత్రంగా మార్చింది. అత్యంత ఖరీదైన పంటను పండిస్తోంది. హిమాలయాలు వంటి చల్లటి ప్రాంతాల్లో దొరికే 'కీడాజడీ' ( కార్డిసెప్స్) అనే అరుదైన పుట్టగొడుగును సాగు చేస్తూ రూ.లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తోంది.
కార్డిసెప్స్కు పెరిగిన డిమాండ్
భోపాల్లోని భావడియా కాలా ప్రాంతానికి చెందిన దేవికా సింగ్ ఈ పుట్టగొడులను పండిస్తోంది. ఫుడ్ అంట్ సైన్స్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత బయోటెక్ రంగంలో పని చేసింది. ఆ అనుభవంతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. కీడాజడి పుట్టగొడుగులు సాధారణంగా హిమాలయాలు, టిబెట్ వంటి చల్లటి ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దేవికా సింగ్ మాత్రం తన ఇంట్లోనే సాగు చేస్తోంది. ఈ పంటకు అవసరమైన ఉష్ణోగ్రత, తేమను ప్రత్యేకంగా నియంత్రిస్తూ, ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చింది.

ఇంట్లోనే మినీ ల్యాబ్
కొవిడ్ కాలంలో కీడాజడీ పుట్టగొడుగుకు పెరిగిన డిమాండ్ వల్లే తనకు ఈ ఆలోచన వచ్చిందని దేవికా సింగ్ చెబుతోంది. 'ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసం ఆ ప్రదేశం అంతా చల్లగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేశా. ఉష్ణోగ్రత 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూశా. తగిన తేమ, లైటింగ్ తగ్గట్టు ఇంట్లోనే ఒక మినీ ల్యాబ్ను క్రియేట్ చేశా. ఇందుకోసం దాదాపు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశా. ఒక సంవత్సరం పాటు పరిశోధన చేసిన తర్వాత ఈ పుట్టగొడుగుల సాగు చేయడం ప్రారంభించా' అని దేవికా సింగ్ తెలిపింది.
90 రోజుల్లోనే పంట
అయితే ఈ పుట్టగొడుగులను సాగు చేయడం ప్రారభించిన 70-90 రోజుల్లోనే మొదటి పంట సిద్ధమైందని దేవికా సింగ్ తెలిపింది. ఒక కిలోగ్రాము కీడాజడీ ధర మార్కెట్లో రూ. లక్ష రూపాయల వరకు పలికిందని చెప్పింది. గత ఆరు నెలల్లో మూడు పంటలను విజయవంతంగా పండించినట్లు దేవికా సింగ్ తెలిపింది. ఆమె ఇంట్లో చేసిన సెటప్ ద్వారా ఏడాదికి సుమారు 20 కిలోల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని చెప్పింది.

ప్రక్రియ ఇలా
కీడాజడి తయారీ ప్రక్రియ గురించి దేవికా వివరించారు. ముందుగా లిక్విడ్ మష్రూమ్ కల్చర్ను తయారు చేస్తాం. ఆ తర్వాత బ్రౌన్ రైస్ను బేస్గా తీసుకుని ప్లేటింగ్ చేస్తారు. కల్చర్ను రైస్పై వేస్తాడు. నెమ్మదిగా పుట్టగొడుగు వస్తుంది. తర్వాత లైటింగ్, కూలింగ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో పెడతాం. బ్రౌన్ రైస్లో పోషక విలువలు అధికంగా ఉండటంతో మష్రూమ్ అభివృద్ధికి సహాయపడుతుంది' అని దేవికా తెలిపింది.
ఎందుకు అంత డిమాండ్?
కీడాజడీ పుట్టగొడుగులో B1, B2, B12 విటమిన్లు వంటి అనేక రకాలు పోషకాలు ఉంటాయి. సహజ స్టెరాయిడ్గా ఉపయోగిస్తారు. క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, థైరాయిడ్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనిని "హిమాలయన్ గోల్డ్", "హిమాలయన్ వయాగ్రా" అని కూడా పిలుస్తారు.

అడవుల్లో దొరికే కీడాజడి ప్రమాదం కూడా
బటన్, ఓస్టెర్, మిల్కీ వంటి పుట్టగొడుగులు ఆహారం కోసం ఉపయోగిస్తారని దేవికా సింగ్ తెలిపింది. కానీ కొన్నింటిల్లో ముఖ్యమైన ఔషధ గుణాల ఉంటాయని, అటువంటి ఒకటి ఈ కీడాజడీ అని పేర్కొంది. సహజంగా అడవుల్లో దొరికే కీడాజడీలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కలిగించే లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ దీని ధర ఇతర పుట్టగొడుగుల కంటే ఎక్కువ ఉంటుంది. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలు, టిబెట్ల్లో అనేక కుటుంబాలకు ఇవి జీవనోపాధి. కానీ దీనికి ఉంటే ఇన్ఫెక్షన్ లక్షణాలు వల్ల వినియోగం ప్రమాదకరంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ల్యాబ్లో పండించిన కీడాజడి సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.

