'నా కొడుకు శవం మాకొద్దు' - 11ఏళ్ల బాలికపై హత్యాచార నిందితుడు హతం- మృతదేహం వద్దన్న కన్నతల్లి
11ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో నిందితుడు ప్రభాస్ మోండల్ ఎన్కౌెంటర్- నిందితుడి తల్లి, భార్య సంచలన వ్యాఖ్యలు

Published : July 8, 2026 at 9:59 PM IST
Encounter In Bengal : బంగాల్లో సంచలనం సృష్టించిన 11 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మోండల్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఈ తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితుడు పోలీసుల నుంచి గన్ లాక్కుని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులపై కాల్పులు జరపడంతో వారు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రభాస్ మోండల్ అక్కడికక్కడే హతమయ్యాడు.
నా కొడుక్కి తగిన శాస్తి జరిగింది
కుమారుడు ఎన్కౌంటర్లో చనిపోయాడన్న వార్త తెలిసినా నిందితుడి తల్లి సంధ్యా మోండల్ ఏ మాత్రం బాధపడలేదు. తన కొడుకు శవాన్ని చూడటానికి తాను ఆసుపత్రికి వెళ్లనని తేల్చి చెప్పింది. తమ కుటుంబం నుంచి సైతం ఎవరూ ఆ బాడీని క్లెయిమ్ చేయరని పోలీసులకు తెగేసి చెప్పింది. చిన్నప్పటి నుంచే నిందితుడు చెడు అలవాట్లకు బానిసయ్యాడని ఆమె తెలిపింది. తాను చెప్పిన మాట ఎప్పుడూ వినలేదని తప్పు చేస్తే శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. నిందితుడు అరెస్ట్ అయినప్పుడే ఈ విషయం చెప్పినట్టు గుర్తు చేసింది. తన కుమారుడు చేసిన దానికి తగిన శాస్తి జరిగిందని ఆ తల్లి పేర్కొంది.
పెళ్లైనప్పటి నుంచి వేధింపులే
అలాగే నిందితుడి భార్య చంపా మోండల్ సైతం అతడి మరణంపై ఏ మాత్రం విచారం వ్యక్తం చేయలేదు. పెళ్లైనప్పటి నుంచి అతని ప్రవర్తన చూస్తున్నానని, ఎన్నో హింసలు భరించానని గుర్తు చేసుకుంది. ఈ కేసులో అతని పేరు బయటకు వచ్చినప్పుడు, అతను ఇలాంటి దారుణానికి పాల్పడగలడని తనకు అనిపించిందని పేర్కొంది. గతంలోనూ ప్రభాస్ మోండల్ ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడని పేర్కొంది. 'నా భర్త స్వభావం నాకు తెలుసు. అందుకే అతడు ఈ నేరానికి పాల్పడి ఉండవచ్చని నేను నమ్ముతున్నాను. మా వివాహం జరిగినప్పటి నుంచి అతనిలో ఎన్నో దుర్మార్గపు ప్రవర్తనలను చూశాను. అతని వేధింపులను భరిస్తూనే కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను' అని ప్రభాస్ మోండల్ భార్య చంపా మీడియాతో తెలిపింది. అలాగే మృతదేహాన్ని గుర్తించడానికి పోలీసులు తమను ఆసుపత్రికి పిలిచారని తెలిపింది. కానీ, కుటుంబంలోని ఇతర సభ్యులతో సంప్రదించకుండా మృతదేహాన్ని తీసుకునే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని ఆమె స్పష్టం చేశారు. కాగా, ప్రభాస్కు భార్యకు ఒక సంతానం ఉన్నారు.
పోలీసులపై నమ్మకం ఉంది
మరోవైపు, బాధితురాలి తండ్రి మాత్రం ముఖ్యమంత్రి, పోలీసు యంత్రాంగంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్ గురించి వివరంగా మాట్లాడటానికి నిరాకరించినప్పటికీ, దర్యాప్తు సాగుతున్న తీరు పట్ల తమ కుటుంబానికి సంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. 'మాకు పోలీసు యంత్రాంగంపై పూర్తి నమ్మకం ఉంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని ఎవరినీ వదిలిపెట్టబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చారు. పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేస్తున్నారని, నిందితులందరికీ చట్టపరంగా శిక్ష పడుతుందని మేము నమ్ముతున్నాము. మా కుమార్తెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం' అని బాధితురాలి తండ్రి తెలిపారు.

ఈనెల 4వ తేదీన కనిపించకుండా పోయిన 11 ఏళ్ల బాలిక మృతదేహం మరుసటి రోజు సూర్జ్యపూర్ హాట్ ప్రాంతంలోని ఒక చెరువులో లభ్యమైంది. నిందితుడు బాలికపై అత్యాచారం చేసి, శవాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేసినట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ దారుణంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తెల్లవారుజామున నిందితుడిని విచారణ నిమిత్తం ఘటనా స్థలానికి తీసుకెళ్లగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కేసులో ఆనంద సర్దార్, దిబాకర్ సర్దార్లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం బంగాల్ ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు కుట్ర- దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు- 11 మంది అరెస్టు
కేవలం ఒక్క రూపాయి, కొబ్బరికాయతోనే పెళ్లి- వరకట్నం దురాచారానికి చెక్ పెట్టిన ఆదర్శ కుటుంబం

