'మిల్క్ ఏటీఎం'- ఇకపై 24 గంటలూ అందుబాటులో పాలు- ఈ మిషన్ ప్రత్యేకతలు తెలుసా?
ఏటీఎం మిషన్ మాదిరిగానే 'మిల్క్ ఏటీఎం'- ప్రజలకు అందుబాటులో ఉండాలని విన్నూత నిర్ణయం

Published : January 11, 2026 at 7:22 PM IST
Milk ATM in Chhindwara : సాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు విత్డ్రా లేదా డిపాజిట్ చేసే మిషన్ అని మనకు తెలుసు. కానీ ఓ చోట అచ్చం ఏటీఎంలా ఉండే ఓ మిషన్లో డబ్బులకు బదులు పాలు వస్తున్నాయి. మిషన్ నుంచి పాలు రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. మధ్యప్రదేశ్లో అచ్చం ఏటీఎం మిషన్ లాగానే కార్డు లేదా స్కాన్ చేసి వారికి కావాల్సినన్ని పాలను పొందే వెసులుబాటును తీసుకొచ్చారు. ప్రజలకు 24 గంటలు పాలు అందుబాటులో ఉండాలని ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇది. ఇందుకోసం 'మిల్క్ ఏటీఎం' మిషన్ను ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఈ మిషన్ రాకతో అతని పాల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? మిషన్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం !
మిల్క్ ఏటీఎంతో పాల సమస్యలకు చెక్!
ఛింద్వాఢా జిల్లాకు చెందిన ఆకాశ్ సూర్యవంశీ అనే వ్యక్తి మిల్క్ ఏటీఎం మిషన్ను ఏర్పాటు చేశారు. సాధారణంగా మధ్యాహ్నం లేదా రాత్రి సమయాల్లో ప్రజలు పాలకోసం ఇబ్బందులు పడడం సర్వసాధారణమని, కానీ ఈ స్టార్టప్తో ఇకపై ప్రజలకు 24 గంటలూ పాలు అందుబాటులో ఉంచవచ్చునని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను ప్రధాన నగరాల్లో ఉన్న మిల్క్ ఏటీఎంలను చూశానని, దాన్ని ఛింద్వాఢాలో ప్రారంభిస్తే ప్రజలకు పాల సమస్యల నుంచి విముక్తి కలిగించవచ్చునని భావించారు. ఈ క్రమంలో మిల్క్ ఏటీఎంను ప్రారంభించారు. దీంతో ప్రజలు ఇకపై రాత్రుల్లో కూడా పాల కోసం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
"ఈ ఏటీఎం చూడటానికి నగదు లావాదేవీలు చేసే మిషన్లాగానే కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అదొక 'మిల్క్ ఏటీఎం మిషన్'. దీని ప్రత్యేకతలు ఏంటంటే? ఇందులో దాదాపు 200 లీటర్లు పాలను నిల్వచేయగల సామర్థ్యం ఉంది. అంతేకాదు ఈ మిషన్లోని పాలు 5 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ప్రజలు వీటిని కార్డ్ లేదా క్యూఆర్ ద్వారా పొందవచ్చు." అని ఆకాశ్ వంశీ తెలిపారు.
ఆవులు, గేదెలు పెంచేవారికి ప్రయోజనం!
మరోవైపు, ఈ స్టార్టప్ను ప్రారంభించిన ఆకాశ్ వంశీ తన గ్రామంలో పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నానని తెలిపారు. అయితే ఈ మిషన్ను ఏర్పాటు చేయడం వల్ల పాల ఉత్పత్తిదారులు, రైతులు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ యంత్రం రాకతో ఇకపై వారు 24 గంటలు పాల సరఫరా చేయగలరని ఆకాశ్ పేర్కొన్నారు. ఈ మిల్క్ ఏటీఎం 24 గంటలు పనిచేయడం వల్ల పాల వినియోగం కూడా పెరుగుతుందని, అలాగే వినియోగదారులకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఆవులు, గేదెలు పెంచేవారు కూడా ప్రయోజనం పొందుతారని తెలిపారు. అయితే, ఒకప్పుడు నిర్ధిష్ట సమయాల్లో మాత్రమే పాలను సేకరించేవారని, కానీ ఈ యంత్రం రాకతో ఎప్పుడైన పాలకేంద్రానికి వచ్చి పాలను అందిచవచ్చునని ఆయన పేర్కొన్నారు.
ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది!
ఈ సందర్భంగా ఛింద్వాఢాలోని వార్డ్ నంబర్ 42 కౌన్సిలర్ సందీప్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ మిల్క్ ఏటీఎం మిషన్, పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ప్రధాన చొరవ అని అభివర్ణించారు. ఇది ప్రజలకు స్వచ్ఛమైన, శుభ్రమైన పాలను అందిస్తుందని తెలిపారు. ప్రజలు పాలు కొనడానికి తమ ఇంటినుంచి పాల డబ్బాలు, బాటిళ్లను కూడా తీసుకువస్తారని, అయితే దీనివల్ల ప్లాస్టిక్ వాడకం చాలా వరకు తగ్గితుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, నగరం కూడా పరిశుభ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
రైతులకు గుడ్న్యూస్ - 'కర్ణ 18' చెరకు వంగడం అభివృద్ధి- అన్నదాతలకు లాభాలు మస్త్!
రూ.18లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయంలోకి- 'సలాడ్ ఆకు' సాగుతో రూ.కోట్ల సంపాదన!

