మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా- ఓవర్ స్పీడ్ వెళ్లినందుకు ఫైన్
రాంచీలో మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ కారుకు చలాన్- అధికవేగంతో ప్రయాణించినందుకే!

Published : March 4, 2026 at 3:09 PM IST
Mahendra Singh Dhoni Car Challan : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయనకు రూ.1,000 జరిమానా విధించారు అధికారులు. ఝార్ఖండ్లోని రాంచీలో మార్చి 1న కాంకే రింగ్ రోడ్లోని బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో ఆయన లగ్జరీ కారు వేగ పరిమితిని మించి ప్రయాణించింది. దీంతో ఆటోమేటిక్ కెమెరాలు ధోనీ కారుపై చలాన్ జారీ చేశాయి. ఆ ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 60 కిలోమీటర్లు ఉండగా, ధోనీ కారు మాత్రం పరిమితిని మించి ప్రయాణించింది. దీంతో చలాన్ జారీ అయ్యింది. అయితే, ధోనీ ఆ కారులో ఉన్నారో లేదో అన్న విషయంపై ఇంకా స్పష్టతలేదు. ఎందుకంటే ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ధోనీ మంగళవారం రాంచీలో కనిపించారని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రధాన కూడళ్లలో రింగ్ రోడ్ వద్ద ఈ ఆటోమెటిక్ వ్యవస్థ 24x7 పనిచేస్తుందని రాంచీ పోలీసులు పేర్కొన్నారు. అతివేగం, సిగ్నల్ జంపింగ్, ఇతర ఉల్లంఘనలను పర్యవేక్షిస్తుందని చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి ఎవరికైనా జరిమానా తప్పదన్నారు. అయితే, ఇదివరకు కూడా ధోనీ పలు కేసుల్లో వార్తల్లో నిలిచారు. ఇటీవల పరువు నష్టం కేసులో మద్రాసు హైకోర్టు ధోనీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. 2013నాటి కేసు ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ డబ్బును మార్చిలోపు చెల్లించాలని కూడా ఆదేశించింది.

అసలేంటి ఈ పరువు నష్టం కేసు?
తన పరువుకు భంగం కలిగించారంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్పై ధోనీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా, సాక్ష్యాలకు సంబంధించిన సీడీ పత్రాలను లిఖితపూర్వకంగా మార్చినందుకు గాను, ధోనీ రూ.10 లక్షల ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని మార్చి 12వ తేదీ లోపు చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసులో ధోనీయే పిటిషనర్ అయినప్పటికీ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే, ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా కొన్ని సీడీలు ఉన్నాయి. ఈ వీడియో/ఆడియో రికార్డులను కోర్టు భాషలోకి, లిఖితపూర్వక పత్రాలుగా మార్చాల్సి ఉంది. దీనికోసం కోర్టు ఒక ట్రాన్స్లేటర్ను, ఒక టైపిస్ట్ను నియమించింది. ఈ పని చాలా పెద్దది. వారు దీనికోసం తమ పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టింది. వారి శ్రమకు, అదనపు ఖర్చులకు గాను ఈ ఫీజు చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. ఈ రూ.10 లక్షలను 'చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్'లో జమ చేయాలని ధోనీని ఆదేశించింది.
గతంలోనూ బైక్కు నంబర్ ప్లేట్ లేదని ఫైన్
అదేవిధంగా బైక్లు, కార్ల పట్ల తనకున్న ప్రేమ కారణంగా కూడా ధోనీ చాలాసార్లు వార్తల్లో నిలిచారు. 2015 ధోనీ ప్రయాణించిన బైక్కు నంబర్ ప్లేట్లేదని రూ.500 ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. రాంచీ నగర వీధుల్లో ఆయన ప్రయాణించిన బైక్కు ముందు వెనుక భాగంలో నంబర్ ప్లేట్ లేదని అధికారులు చెబుతున్నారు. కానీ, ముందు చక్రంపై ఉన్న మడ్గడ్పై మాత్రం నంబర్ రాసి ఉందని అధికారులు తెలిపారు. వాస్తవానికి అది వాహనానికి ముందు భాగంలో ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, చలాన్ను ధోనీ ఇంటికి పంపించామని, ఆయన ఆ ఫైన్ను చెల్లించారని అధికారులు పేర్కొన్నారు.
ఫామ్హౌస్లో ధోనీ ఆర్గానిక్ సాగు- 38ఎకరాల్లో టమాటా పంట - మార్కెట్లో మంచి గిరాకీ
ఐపీఎల్ బెట్టింగ్ వివాదం: రూ.10 లక్షలు చెల్లించాలని ధోనీకి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు!

