ETV Bharat / bharat

ఆనాడు కశ్మీర్​లో పర్యటించిన ఖమేనీ- ఆర్టికల్ 370 రద్దుపై ఆయన ఏమన్నారంటే?

1980ల్లో భారత్​లో పర్యటించిన ఖమేనీ- ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు- కశ్మీరీ ముస్లింలను అణిచివేస్తున్నారంటూ వ్యాఖ్యలు

Khamenei visited Kashmir in 1980
Khamenei visited Kashmir in 1980 (Photo source: Iran Govt Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 6:01 PM IST

4 Min Read
Choose ETV Bharat

Khamenei visited Kashmir in 1980: పశ్చిమాసియాలో అత్యంత ప్రభావవంతమైన మత, రాజకీయ నాయకుడిగా ఎదగడానికి చాలా కాలం ముందే అయతుల్లా అలీ ఖమేనీ కశ్మీర్​లో పర్యటించారు. కశ్మీర్​లోని ముస్లింల పరిస్థితిపై ఆయన బహిరంగంగానే మాట్లాడారు. దశాబ్దాల తర్వాత, ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక కూడా ఆయన కశ్మీర్​ అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా 2019లో కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని భారత్​ రద్దు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

భారత్​లో పర్యటన
1979లో ఇరాన్ చివరి షా (మొహమ్మద్​ రెజా పహ్లావి) పతనం తర్వాత ఆ దేశంలో సుమూలంగా పెను రాజకీయ మార్పులు జరిగాయి. ఆ సమయంలో ఖమేనీ వయస్సు 41 ఏళ్లు. ఇస్లామిక్​ విప్లవానంతర ఇరాన్​లో ఆయన ఒక కీలక నేతగా అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. ఈ తరుణంలోనే ఆయన భారత్​లో పర్యటించారు. విశ్వసనీయ ఆధారాల ప్రకారం, 1980లో ఖమేనీ కశ్మీర్​లో పర్యటించారు. శ్రీనగర్​లోని చారిత్రాత్మక జామియా మసీదులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే కశ్మీర్ ఆధునిక రాజకీయ, మతపరమైన చరిత్రలో ఈ పర్యటన ఇప్పటికీ అంతగా వెలుగులోకి రాని అధ్యాయంగా మిగిలిపోయిందని చెప్పవచ్చు.

జామియా మసీదులో చేసిన ప్రసంగంలో ఖమేనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల పరిస్థితుల గురించి మాట్లాడారు. రాజకీయ, సామాజిక పోరాటాలు చేస్తున్న ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఖమేనీ చేసిన ఈ ప్రసంగం ఆనాడి ఇరాన్ మొదటి సుప్రీం లీడర్​గా అయతుల్లా రుహొల్లా ఖమేనీతో సహా, కశ్మీర్ మత పెద్దలు, రాజకీయ విశ్లేషకులను విశేషంగా ఆకర్షించింది. ఈ పర్యటనలోనే ఖమేనీ శ్రీనగర్​లోని జాదిబల్​ ఇమాంబారాలో షియా ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. హజ్రత్​బల్ దర్గాను సందర్శించారు. బుద్గాంకు కూడూ వెళ్లారు. అక్కడ ఆయనకు 'ఆఘా' కుటుంబం అతిథ్యం ఇచ్చింది. ఈ విధంగా, ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ముస్లిం సమాజాలతో సంబంధాలు పెంపొందించుకోవాలనే ఇరాన్​ సిద్ధాంతానికి ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలిచింది.

ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు
2019 ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, కశ్మీర్​కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. జమ్మూకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. దీనితో ఆర్టికల్ 370 రద్దును ఖమేనీ తీవ్రంగా ఖండించారు. "కశ్మీర్​లోని ముస్లిం పరిస్థితి పట్ల మేము ఆందోళన చెందుతున్నాం. వాస్తవానికి భారత్​తో మా సంబంధాలు బాగున్నాయి. అయితే భారత్​ ఒక న్యాయమైన విధానాన్ని అనుసరించాలి. కశ్మీర్​ ముస్లింపై జరుగుతున్న అణచివేతను అరికట్టాలి. కశ్మీర్​లోని ప్రస్తుత పరిస్థితికి, భారత్​-పాక్​ల మధ్య కొనసాగుతున్న వివాదాలకు, బ్రిటీష్ వారి దుష్ట చర్యలే కారణం. బ్రిటీష్ వారు ఉద్దేశపూర్వకంగానే కశ్మీర్​లో ఘర్షణలు కొనసాగేలా ఈ గాయాన్ని మిగిల్చారు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.

అప్పటి వరకు భారత్​, ఇరాన్​ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆర్టికల్ 370 రద్దుపై ఇరాన్ సుప్రీం లీడర్​గా ఉన్న ఖమేనీ విమర్శలు చేయడం - ఇరుదేశాల మధ్య రాజకీయ, దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

1990లో ఏమన్నారంటే?
వాస్తవానికి 1990లో కూడా ఖమేనీ కశ్మీర్​ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజాల పట్ల చూపిస్తున్న వివక్ష గురించి చర్చిస్తూ, కశ్మీర్​ను కూడా ప్రస్తావించారు. "చూడండి. ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు ఉన్నా, వారిని ఇతరుల కన్నా చాలా హీనంగా, కఠినంగా చూస్తున్నారు. దీనికి కశ్మీర్​ ఒక ఉదాహరణ" అని అన్నారు. కశ్మీర్​లోని ముస్లింలు తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారని, వారి డిమాండ్లు చాలా న్యాయమైనవని ఖమేనీ పేర్కొన్నారు.

"కశ్మీర్​లో ఏం జరుగుతుందో తెలిసిన ఎవరైనా సరే, అక్కడి ముస్లింలు చెబుతున్నది నిజం, న్యాయమని అంగీకరిస్తారు. వారిని అన్యాయమైన ఉద్దేశాలు ఉన్నవారు అణచివేస్తున్నారు. కశ్మీర్​ ముస్లింలపై దాడి చేసేవాళ్లు చాలా తప్పు చేస్తున్నారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచం ఇదంతూ చూస్తూ ఉదాసీనంగా ఉంది" అని ఖమేనీ అన్నారు.

భారత్​తో దౌత్య సంబంధాలు
ఏదేమైనప్పటికీ, భారత్​, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు చారిత్రకంగానూ, ఆచరణాత్మకంగానూ, పరస్పర సహకారంతోనే కొనసాగుతున్నాయి. మరోవైపు పాక్​తో ఇరాన్ సరిహద్దు కలిగి ఉంది., ఆఫ్గానిస్థాన్​, మధ్య ఆసియా వాణిజ్య మార్గాలతో అది వ్యూహాత్మక ప్రయోజనాలను పొందుతోంది. అందుకే దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాల్లో అది వ్యూహాత్మక సమతుల్య విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది.

పాక్​ తీర్మానంపై నీళ్లుజల్లిన ఇరాన్​
1990వ దశకం ప్రారంభంలో కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్​కు వ్యతిరేకంగా పాకిస్థాన్​ ఇస్లామిక్​ సహకార సంస్థ (ఓఐసీ)లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. నిజానికి అది విజయవంతం అయ్యుంటే, భారత్​ అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన ఒత్తిడి, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేంది. ఈ పరిస్థితుల్లో అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు ఇరాన్ మద్దతు కోరారు. పాక్​ ఎత్తుగడను తిప్పికొట్టడానికి అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి దినేశ్ సింగ్​ను టెహ్రాన్​కు పంపించారు. నాటి ఇరాన్ విదేశాంగమంత్రి స్వయంగా వచ్చి దినేశ్ సింగ్​కు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. భారత్ ఆందోళనను ఆనాటి ఇరాన్ అధ్యక్షుడికి కూడా చేరవేశారు. దీనితో పాక్ పెట్టిన తీర్మానానికి ఇరాన్ మద్దతు ఇవ్వలేదు. దీనితో ఆ అంశం ఐక్యరాజ్యసమితి వరకు వెళ్లలేదు.

గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులు- వారి భద్రతపై ఆందోళనలు- తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు

నెతన్యాహు, UAE అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ- పౌరుల రక్షణ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం