ETV Bharat / bharat

'పాక్‌పై భారత్‌దే సంపూర్ణ ఆధిపత్యం- యుద్ధంలో ఇండియాదే విజయం'

ఆపరేషన్​ సిందూర్​పై స్పందించిన యుద్ధ విశ్లేషకుడు టామ్ కూపర్- పాక్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించదని వెల్లడి- ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేంత స్థాయి పాక్‌కు లేదని వ్యాఖ్య

Tom Cooper, Military aviation analyst and historian
Tom Cooper, Military aviation analyst and historian (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2026 at 6:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tom Cooper On Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీఓకేలోని ఉగ్రవాద మౌళిక సదుపాయాలే టార్గెట్‌గా భారత్ చేసిన దాడులపై ఆస్ట్రియన్ వైమానిక యుద్ధ విశ్లేషకుడు, చరిత్రకారుడు టామ్ కూపర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్ దాడులను స్పష్టమైన సైనిక విజయంగా అభివర్ణించారు. పాకిస్థాన్‌తో జరిగిన ఘర్షణల్లో భారత్‌కు ఉన్న నిర్ణయాత్మక ఆధిక్యాన్ని ఈ సందర్భంగా హైలైట్ చేశారు. భారత్ సైనికపరంగా పాక్‌ను మించిపోవడమే కాకుండా తన ప్రణాళికాబద్ధమైన, కచ్చితమైన ప్రతిస్పందన ద్వారా ఒక బలమైన వ్యూహాత్మక సందేశాన్ని కూడా దాయాది దేశానికి ఇచ్చిందని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో టామ్ కూపర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"పాకిస్థాన్‌లోని ప్రధాన ఉగ్రవాద శిబిరాలపై భారత్ అత్యంత విజయవంతమైన ప్రతీకార దాడులు నిర్వహించింది. అంతేకాకుండా భారత్ చేరుకోలేదని భావించిన అసాధ్యమైన లక్ష్యాలను కూడా ఛేదించింది. దీంతో పాక్ తీవ్రంగా నష్టపోయింది. అందుకే పాకిస్థాన్ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిపోయింది. భారతదేశ కార్యాచరణ సామర్థ్యం దాని వ్యూహాత్మక విధానంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. పాకిస్థాన్‌లోని దేనిపైనైనా దాడి చేయగలమని, తమను ఆపలేరని పాక్‌కు భారత్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. భారత్ చేపట్టిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ప్రయత్నించింది. భారత వైమానిక, సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉద్రిక్తతను పెంచడానికి ప్రయత్నించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అనుకున్న విధంగానే కచ్చితంగా పనిచేశాయి. పాక్ నుంచి దూసుకొస్తున్న రాకెట్లు, క్షిపణులు, యూఏవీలు వంటి 95-98 శాతానికి పైగా క్షిపణులను అవి అడ్డుకుని ధ్వంసం చేశాయి. పాక్ ప్రతీకార చర్యలు దాదాపు పూర్తిగా విఫలమయ్యాయి" అని టామ్ కూపర్ పేర్కొన్నారు.

'ఆ దాడులతో పాక్ నాయకత్వంలో ఒత్తిడి'
పాక్ వ్యూహాత్మక బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో భారత్‌పై దాడులకు యత్నించిందని టామ్ కూపర్ తెలిపారు. అయితే భారత్ ఆ ప్రయత్నాలను అడ్డుకోవడమే కాకుండా, పాక్‌లోని కీలక సైనిక సామర్థ్యాలను నాశనం చేసే అత్యంత కచ్చితమైన దాడులను కూడా చేసిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు పాకిస్థాన్ నాయకత్వంలో గణనీయమైన ఒత్తిడిని సృష్టించాయని అన్నారు. ఇండియా-పాక్ వార్‌లో భారతే విజేత అని స్పష్టం చేశారు. పాక్ గరిష్ఠంగా భారత్‌కు చెందిన ఒకట్రెండు యుద్ధ విమానాలను కూల్చేసి ఉండొచ్చు కానీ, యుద్ధంలో మాత్రం ఓడిపోయిందన్నారు.

"పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. బయటి దేశాల మద్దతు లేకుండా భారీ స్థాయి సైనిక ఆయుధాలను కొనుగోళ్లను కొనసాగించలేదు. భారత్-పాక్ మధ్య అంతర్లీనంగా ఉన్న ఉద్రిక్తతలు కొనసాగుతాయి. దీని అర్థం భవిష్యత్తులో కూడా ఇండియా- పాక్ మధ్య ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఆపరేషన్ సిందూర్ ఫలితం భారతదేశ సంసిద్ధతను, సాంకేతిక బలాన్ని, కొత్తగా తలెత్తే ముప్పులకు నిర్ణయాత్మకంగా స్పందించగల సామర్థ్యాన్ని తెలియజేసింది" అని టామ్ కూపర్ అభిప్రాయపడ్డారు.

పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు
మరోవైపు, అమెరికా- ఇరాన్ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంపైనా టామ్ కూపర్ స్పందించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలను ప్రాధాన్యం లేనివిగా కొట్టిపారేశారు. అంతర్గత అసమర్థత, స్వల్పకాలిక ఎత్తుగడలతో బలహీనపడిన ఒక చిన్న శక్తిగా పాక్‌ను అభివర్ణించారు. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య ఉన్నత స్థాయి మధ్యవర్తిగా ఇస్లామాబాద్ తనను తాను ప్రదర్శించుకుంటున్న తీరును తప్పుపట్టారు. వాస్తవానికి పాక్‌ అంతటి ప్రతిష్ఠాత్మకమైన దేశం కాదన్నారు. తక్షణ ప్రయోజనాలు పొందడం కోసం ట్రంప్ పరిపాలనను బుజ్జగించడంపైనే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారించిందని ఆరోపించారు.

"పాకిస్థాన్ విషయానికొస్తే రెండు విభిన్న ప్రపంచాలు ఉన్నాయి. ఒకవైపు పాక్ తనను తాను ఒక గొప్ప సంధానకర్తగా చిత్రీకరించుకుంటోంది. వాస్తవానికి పాక్ ప్రభుత్వం అనుకూలతలకు బదులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను బుజ్జగిస్తోంది. కశ్మీర్ సమస్య వంటి అజెండాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇస్లామాబాద్ అమెరికా లాబీయింగ్‌ను కోరుకుంటోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. పాకిస్థాన్ వాస్తవానికి తమ సొంత సైనికుల గుప్పిట్లో బందీగా ఉంది. రాజకీయ, పరిపాలనా అసమర్థత ప్రపంచ వేదికపై ఆ దేశం ఎలాంటి అర్థవంతమైన పాత్ర పోషించకుండా నిరోధిస్తోంది. పశ్చిమాసియాపై ఆధిపత్యం చెలాయించడానికి ఇజ్రాయెల్, యూఏఈ ఒక అజెండాను నడుపుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇచ్చింది. దీంతో పశ్చిమాసియా సంఘర్షణలో యూఎస్ చిక్కుకుపోయింది. దీంతో అమెరికా ప్రస్తుత ప్రభుత్వానికి యుద్ధం నుంచి గౌరవప్రదమైన నిష్క్రమణ వ్యూహం లేకుండా పోయింది" అని కూపర్ తెలిపారు.

'అంగ, బంగ, కళింగ' కల నిజమైన వేళ - తూర్పు తీరం బీజేపీ వశం

సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : మమత సంచలన కామెంట్స్