ETV Bharat / bharat

భారత్​ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటోంది : కెనడా ప్రధానితో ప్రెస్​మీట్​లో మోదీ

భారత్‌- కెనడా దేశ ప్రధానుల సంయుక్త ప్రకటన- అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని కెనడా నిర్ణయం- కెనడా నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ

canada pm india visit
canada pm india visit (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 1:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Canada PM India Visit : భారత్, కెనడా మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య యురేనియం సరఫరా సహా పలు కీలక రంగాల్లో చరిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అనంతరం రెండు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో భారత్‌కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, అడ్వాన్స్‌డ్ రియాక్టర్ల తయారీలోనూ ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, రాడికలైజేషన్ అనేవి మానవాళికి పెను సవాలుగా మారాయని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. వీటిని అరికట్టేందుకు రక్షణ రంగం, సముద్ర తీర భద్రతలో పరస్పర సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి.

"తదుపరి స్థాయి భాగస్వామ్యంపై ఈరోజు చర్చించాం. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం 50 బిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే పూర్తి చేసుకుంటాం. సుమారు 100 బిలియన్ల కెనడియన్​ పెన్షన్​ నిధులను భారత్​లో పెట్టుబడులు పెట్టారు. ఇరు దేశాల మధ్య బలమైన వృద్ధికి, నమ్మకానికి ఇది సంకేతం. మా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాము. AI, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఆవిష్కరణల్లో అనేక విశ్వవిద్యాలయాల మధ్య కొత్త భాగస్వామ్యాలను కుదుర్చుకున్నాయి. కెనడియన్ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో క్యాంపస్‌లను ప్రారంభించడంపై కూడా అంగీకరించాం. సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి ఇరుపక్షాల మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది."

--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం-C.E.P.Aను త్వరలోనే ఖరారు
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం-C.E.P.Aను త్వరలోనే ఖరారు చేయాలని ఇరు దేశాలు సంకల్పించాయి. విద్యుత్‌, టెక్నాలజీ రంగాల్లో సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే యురేనియం ఒప్పందంపై భారత్‌, కెనడా సంతకాలు చేశాయి. పునరుత్పాదక ఇంధన వినియోగంతో పాటు కీలక లోహాల అంశంలో సహకారం కోసం భారత్‌, కెనడా ఎంవోయూ కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరాలని కెనడా నిర్ణయించింది. గ్లోబల్‌ బయోఫ్యూయల్‌ కూటమిలో చేరాలని కెనడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కెనడా నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు.

పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన
పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉన్న భారతీయుల భద్రత కోసం అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని మోదీ స్పష్టం చేశారు.

"పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం దేశాలతో సంప్రదింపులు చేస్తున్నాం. మేం ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చాం. రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి నిలబడినప్పుడు, శాంతి కోసం గొంతుక మరింత బలపడుతుంది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి మాకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. చర్చలు, దౌత్యం ద్వారా అన్ని వివాదాల పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుంది. పశ్చిమాసియాలోని భారతీయ పౌరుల భద్రత కోసం మేం అన్ని దేశాలతో కలిసి పని చేస్తూనే ఉంటాం. భారత్, కెనడా రెండు దేశాల ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఒకే రకమైన భావనను కలిగి ఉన్నాయి. ఇవి కేవలం మాకు మాత్రమే కాదు యావత్​ ప్రపంచానికి తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఉమ్మడి భాగస్వామ్యం అవసరం." అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.