హనీమూన్ హత్యకేసు- సోనమ్ బెయిల్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
సోనమ్కు బెయిల్ రద్దు చేయాలంటూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం- విచారణలో తొలుత బెయిల్ రద్దు చేసిన సుప్రీం-నిందితురాలు ఇప్పటికే జైలు నుంచి విడుదలయిందని పేర్కొంటూ బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించిన న్యాయస్థానం

Published : July 3, 2026 at 12:36 PM IST
SC Refuses Stay Meghalaya HC Order : మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి హైకోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సోనమ్ ఇప్పటికే విడుదల కావడం సహా కోర్టు విధించిన షరతులను పాటిస్తున్నందున బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. విచారణ సందర్భంగా మేఘాలయ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక కామెంట్స్ చేశారు. సోనమ్పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి అని, సాంకేతిక కారణాలతో ఆమెకు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు.
ఇక, 'విగ్గు పెట్టుకున్నాడనే కారణంతో ఇటీవల ఓ యువతి కాబోయే భర్తను చంపేసింది' అని సియా కేతన్ కేసు గురించి మెహతా ఈ సందర్భంగా ప్రస్తావించారు. పై కేసు తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తొలుత తాము బెయిల్ రద్దుకే మొగ్గుచూపామని, కానీ ఆమె ఇప్పటికే విడుదలైనందున కఠినంగా ఉండాలనుకోవడం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా, ఈ ఏప్రిల్లో షిల్లాంగ్ న్యాయస్థానం సోనమ్కు బెయిల్ మంజూరు చేసింది. సెక్షన్ల విషయంలో పోలీసులు చేసిన తప్పిదం వల్లే ఆమెకు బెయిల్ వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు, సాంకేతిక లోపం వల్లే ఆ సమస్య తలెత్తినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ మెమోలోనే కాకుండా, కేసుకు సంబంధించిన అన్ని పత్రాల్లో తప్పిదం జరిగిందని మేఘాలయా కోర్టు అప్పట్లో గుర్తించింది. మరోవైపు, సాంకేతిక తప్పిదమనే పోలీసుల వాదనలను తిరస్కరించిన షిల్లాంగ్ కోర్టు, సోనమ్ అరెస్టుకి సరైన కారణాలు లేవని పేర్కొంది.
గతంలో ఏం జరిగింది?
ఇక, హత్య విషయానికొస్తే, మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తోంది. గతేడాది మే 11న రాజా రఘువంశీకి, సోనమ్తో వివాహం జరిగింది. అనంతరం, ఈ జంట అదే నెల 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అనంతరం వీరు కనిపించడం లేదని తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రాజా రఘువంశీ మృతదేహాన్ని సుమారు 11 రోజుల తర్వాత, సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగి అది హత్యగా అనుమానించారు. అనంతరం సోనమ్ కోసం గాలించగా, జూన్ 7న ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపుర్లో ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఆమెను విచారించగా, ప్రియుడితో కలిసి ఆమే భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధరణ జరిగింది. దీంతో పోలీసులు ఆమెతో సహా, ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్ కుశ్వాహాను అరెస్టు చేశారు. వీరితోపాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సోనమ్ సహా పలువురికి బెయిల్ లభించింది.
రూ. 50,000 విలువైన వ్యక్తిగత పూచీకత్తు సమర్పించిన మీదట కోర్టు సోనమ్కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సంబంధించి పలు కీలక సూచనలు చేసింది. బెయిల్ కాలంలో ఆమె షిల్లాంగ్ కోర్టు పరిధిని దాటి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆమె ఆ పరిధిని దాటి ప్రయాణించాల్సి వస్తే, కోర్టుకు తెలియజేసి, ముందస్తు అనుమతి పొందాలని తెలిపింది. ఈ కేసులోని సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయడానికి సోనమ్ రఘువంశీ ప్రయత్నించకూడదని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ ఘటన అనంతరం సోనమ్తో తాము బంధాన్ని తెంచేసుకుంటున్నట్లు నిందితురాలి కుటుంబం పేర్కొంది. మృతుడు రాజ్ కుటుంబానికి అండగా నిలుస్తామని సోనమ్ సోదరుడు తెలిపారు. అంతేకాదు, తాను సోనమ్కు ఎటువంటి వ్యక్తిగత సహాయం చేయనని స్పష్టం చేశారు.
అమర్నాథ్ యాత్ర ప్రారంభం- భారీ వర్షంలోనూ భక్తుల సందడి- యాత్రికులకు మోదీ లేఖ
భర్త గురక పెడుతున్నాడంటూ విడాకులు కోరిన భార్య- ఐదేళ్ల దాంపత్య జీవితం చివరకు ఏమైందంటే?

