వెరైటీ హోలీ- ఆ గ్రామాల్లో రంగులు పూసుకోరు- వంట చేయరు- రోజంతా అదే పని!
బిహార్లోని ఐదు ఊర్లలో భిన్నంగా హోలీ వేడుకలు- రంగులు చల్లుకోరు- వంట చేసుకోరు- రోజంతా ఉపవాసమే!

Published : March 3, 2026 at 8:03 PM IST
Holi Not Celebrated In Nalanda :హోలీ అంటే రంగుల పండుగ. ఆ పర్వదినం నాడు రంగులను ఒకరి ఒకరు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు. ఎంతో కోలాహలంగా హోలీని జరుపుకుంటారు. అయితే బిహార్ నలందా జిల్లాలోని ఓ ఐదు గ్రామాల్లో అందుకు భిన్నంగా హోలీని చేసుకుంటారు. హోలీ రోజు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకోరు. ఆ రోజు అసలే వంటే చేయరు. పూర్తిగా ఉపవాసంతో దైవ భక్తిలో మునిగిపోతారు.
భక్తి శ్రద్ధలతో హోలీ
బిహార్ షరీఫ్కు ఆనుకుని ఉన్న పటువానా, బసవన్ బిఘా, ధిబరాపర్, నకత్పురా, దేధ్ధర గ్రామాల్లో హోలీ వేడుకలు చాలా భిన్నంగా జరుగుతాయి. హోలీ నాడు ఈ ఐదు గ్రామాల ప్రజలు పొయ్యి వెలిగించరు. ఎటువంటి వంటకాలు చేయరు. ఉపవాసం ఉంటారు. హోలీ నాడు అసలు కోలాహలమే ఉండదు. ఫాగువా (ఫోక్) సాంగ్స్ ఊసే ఉండదు. గత 54 ఏళ్లుగా ఆ గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఒకరిపై ఒకరు రంగులు చల్లడం లాంటివి చేయకుండా హోలీ నాడు పూర్తిగా ఆధ్యాత్మికతలో నిమగ్నమైపోతారు.
ఉదయం నుంచే ఆయా గ్రామాల్లో భక్తి వాతావరణం ఏర్పడుతుంది. ఫాగువా పాటలకు బదులుగా భజన చేస్తారు. కీర్తనలు పాడుతారు. హరే రామ్, హరే కృష్ణ అంటూ భగవంతుడి నామాన్ని జపిస్తారు. లింగ బేధం, వయసుతో సంబంధం లేకుండా అందరూ భజనల్లో పాల్గొంటారు. రోజంతా గ్రామంలో క్రమశిక్షణ, శాంతిపూర్వక వాతావరణం కనిపిస్తుంది. హోలీ రోజు 24 గంటల అఖండ కీర్తన ప్రారంభమవుతుంది. ఈ కీర్తన తర్వాతి రోజు అదే సమయంలో వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.

54 ఏళ్లుగా ఇదే సంప్రదాయం
ఈ ఆచారం ప్రారంభమయ్యే ముందు గ్రామస్థులు తమ ఇళ్లలో స్వీట్లు, ఇతర సంప్రదాయ వంటకాలను తయారు చేస్తారు. ఎందుకంటే కీర్తన ప్రారంభమైందంటే అది ముగిసే వరకు ఇంట్లోని పొయ్యిని వెలిగించరు. 54 ఏళ్ల క్రితమే హోలీ నాడు ఇంట్లో వంట చేయడంపై నిషేధం విధించారు. అలాగే హోలీ నాడు చాలా మంది ఉప్పుకు దూరంగా ఉంటారు. అలాగే నిగ్రహమే నిజమైన హోలీ అని ఐదు గ్రామాల ప్రజలు నమ్ముతారు.

గ్రామాల ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం
50 ఏళ్ల క్రితం ఈ ఐదు గ్రామాల్లో హోలీ నాడు తాగుబోతులు మద్యం సేవించి గందరగోళం సృష్టించేవారు. గొడవలకు దిగేవారు. మందుబాబుల ఈ చర్యలు పండుగ ఆనందాన్ని దెబ్బతిసేవి. ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యేవి. అంతలో గ్రామంలోని ఒక సాధువు గ్రామస్థులకు దిశానిర్దేశం చేశాడు. హోలీ నాడు భక్తిగా ఉండాలని సూచించారు. అప్పటి నుంచి ఆ ఐదు గ్రామాల్లో సంప్రదాయం మారిపోయింది. హోలీ రోజున నిరంతర కీర్తనల సంప్రదాయం ప్రారంభమైంది. క్రమంగా ఈ ఆధ్యాత్మిక చొరవ గ్రామాల్లో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పింది.
"సంత్ బాబా స్వస్థలం ఇమాద్పుర్. ఆయన చిన్న వయసులో ఇల్లును వదిలిపెట్టి సాధువు జీవితాన్ని ప్రారంభించాడు. పటువానా, రజకువాన్ ఖండాలో తదితర గ్రామాల్లో ఉంటూ తపస్సు చేశాడు. ఆయన 2000 అక్టోబర్ 2న మరణించాడు. ఇప్పుడు ఆయన ఆశ్రమం, సమాధి సమీపంలో ఒక ఆలయం ఉంది. అక్కడ హోలీ రోజున ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సంత్ బాబా దయ వల్లే మా గ్రామాల్లో శాంతి, సామరస్యం నెలకొంది" అని గ్రామస్థుడు విలాస్ యాదవ్ అని తెలిపాడు.

అయితే హోలీ రోజున తమ ఊర్లలో భక్తి వాతావరణం ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. అయితే కీర్తన ముగిసిన మరుసటి రోజు (హోలీ తర్వాతి రోజు) సంప్రదాయ పద్ధతిలో రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటారని చెబుతున్నారు. హోలీ నాడు ఆధ్యాత్మికంగా గడుపుతామని అంటున్నారు. ఆ తర్వాతి రోజు హోలీ వేడుకలను చేసుకుంటున్నామని చెబుతున్నారు.
హోలీ రోజు 'రామ్లీలా' ప్రదర్శన- 120ఏళ్లుగా ఇదే సంప్రదాయం- ఈ నాటకానికి పాకిస్థాన్తో కనెక్షన్!
హోలీ కోసం నేచురల్ కలర్స్ తయారుచేస్తున్న మహిళలు- వారి హెర్బల్ గులాల్కు ఫుల్ డిమాండ్

