మట్టి టీ కప్పుల తయారీ బిజినెస్లో అదుర్స్- ఏటా రూ.లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్న కేతన్
మట్టి టీ కప్పుల వ్యాపారంలో రాణిస్తున్న ఒడిశాకు చెందిన మకర్ కేతన్ సాహు- ఏటా లక్షలాది రూపాయల ఆదాయం- పదుల మందికి ఉపాధి కల్పిస్తున్న మకర్ కేతన్

Published : December 23, 2025 at 3:21 PM IST
Clay Tea Cups Business Success Story : సాధారణంగా చాలా మంది గాజు లేదా డిస్పోజబుల్ గ్లాస్లో టీ తాగుతారు. అయితే మట్టి కప్పులో టీ తాగడం వల్ల కలిగే ఆనందమే వేరు. అలాగే మట్టి కప్పు టీ రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యంపై ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపదు. అందుకే నేటి తరం ప్రజలు మట్టి కప్పులలో టీ సేవించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో మట్టి టీ కప్పులను డిమాండ్ పెరుగుతోంది. ఇదే విషయాన్ని గ్రహించారు ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి. దీంతో మట్టి కప్పులను తయారుచేస్తూ ఏటా లక్షలాది రూపాయలను గడిస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఏటా ఎంత సంపాదిస్తున్నారు? తదితర విషయాలు తెలుసుకుందాం.
లోన్ తీసుకుని వ్యాపారం ప్రారంభం
కేంద్రపారా జిల్లాలోని పరకుల గ్రామానికి చెందిన మకర్ కేతన్ సాహు (49) టెర్రకోట హస్తకళాకారుడు (మట్టితో శిల్పాలు, కుండలు, కప్పులు, అలంకరణ వస్తువులను తయారుచేస్తాడు). అతడు1999లో ఒక సంస్థలో టెర్రకోట హస్తకళ గురించి ట్రైనింగ్ ఇచ్చేవాడు. మకర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నవారు నెలకు రూ.10,000- రూ.20,000 సంపాదించారు. కానీ మకర్ కు కేవలం రూ.3వేలు-రూ.4వేలు మాత్రమే జీతంగా వచ్చేది. ఆ సాలరీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పి, సొంతంగా సొంత టెర్రకోట పనిని ప్రారంభించాడు. 2016లో రుణం తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించాడు. క్రమంగా మకర్ తయారుచేసిన టెర్రకోట వస్తువులకు డిమాండ్ పెరిగింది. దీంతో తాను మంచి ఆదాయమే పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధిని కల్పిస్తున్నాడు.

టెర్రకోట ప్రొడక్ట్స్ను తయారీ చేసి మంచి లాభాలు గడించిన మకర్, ఆ తర్వాత కుల్హాద్ ల (మట్టితో చేసిన టీ గ్లాసులు) తయారీపై దృష్టి సారించాడు. మకర్ ను కొంత మంది దుకాణదారులు మట్టి టీ కప్పులను తయారుచేయమని కోరారు. ఒక ఏడాది క్రితం కుల్హాద్ లు తయారు చేయడం ప్రారంభించాడు. అందుకోసం గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి యంత్రాలను తెప్పించాడు. తొలుత మట్టి టీ గ్లాసుల తయారుచేయడం రాక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత సవాళ్లను ఎదురొడ్డి విజయం సాధించాడు. ఇప్పుడు మార్కెట్లో మకర్ తయారుచేసిన కుల్హాద్లకు మంచి డిమాండ్ ఉంది.
నేలలో కలిసిపోయే ఈ పర్యావరణ అనుకూలమైన మట్టి టీ కప్పులకు తయారీకి ప్రభుత్వం నుంచి వచ్చిన మద్దతుపై మకర్ స్పందించారు. "నేను 2016లో పీఎంఈజీపీ రుణం తీసుకోవాలని అనుకున్నాను. వ్యాపారం ప్రారంభించడానికి లోన్ కోసం పలు బ్యాంకులకు వెళ్లాను. కానీ రుణం మంజూరు కాలేదు. దీంతో నిరాశ చెందాను. చివరగా, నేను 2శాతం వడ్డీ రేటుతో స్వయం సహాయక బృందం నుంచి రూ. 5 లక్షలు అప్పుగా తీసుకొని ఈ కుల్హాద్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాను" అని మకర్ తెలిపాడు.

"మట్టి టీ కప్పులు తయారీకి అవసరమైన మట్టిని పొలం నుంచి తీసుకొస్తాం. వ్యవసాయ భూమిలో 3-5 అడుగుల లోతులో లభించే మట్టి కుల్హాద్ లు తయారీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కుల్హాద్ లు అన్ని నేలల్లో దొరికే మట్టితో తయారవ్వవు. చుట్టుపక్కల ప్రాంతంలో కుల్హాద్ ల తయారీకి అనువైన మట్టి దొరకకపోతే, ట్రాక్టర్ ను అద్దెకు పెట్టుకుని మంచి మట్టిని తీసుకొస్తాం. కుల్హాద్ లు తయారు చేయడానికి కనీసం 10 మంది అవసరం. మట్టి వచ్చిన తర్వాత ఇద్దరు దానిని బాగా చూర్ణంలా చేస్తారు. ఆ తర్వాత మట్టి మొత్తాన్ని కుల్హాద్ ల తయారీకి అనుకూలంగా చేస్తారు. ఈ మట్టి వచ్చి యంత్రంపై పడిన తర్వాత అది గుండ్రంగా మారుతుంది. ఆ తర్వాత దాన్ని ఎండబెడతారు. ముగ్గురు వ్యక్తులు కుల్హాద్ లకు షేప్ ను ఇస్తారు. మరో ఇద్దరు దానిని బట్టీకి తీసుకెళ్లి, కాల్చి ప్యాక్ చేస్తారు. చివరగా ఒకరు మార్కెటింగ్ చేస్తారు"
--మకర్ కేతన్ సాహు, కుల్హాద్ల వ్యాపారి
మట్టి టీ కప్పులకు ఫుల్ డిమాండ్
డిమాండ్ దృష్ట్యా కేంద్రపారా, జగత్సింగ్ పుర్, భువనేశ్వర్లలో తాము తయారుచేసిన కుల్హాద్ ల మార్కెటింగ్ జరుగుతోందని మకర్ అన్నాడు. ఒక బట్టీలో రోజుకు 4,000 కుల్హాద్ లను తయారు చేస్తున్నామని తెలిపాడు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ.15,000- రూ.16000 జీతం ఇస్తున్నానని పేర్కొన్నాడు. ఒక మట్టి టీ కప్పు తయారు చేయడానికి రూపాయిన్నర ఖర్చు అవుతుందని వెల్లడించాడు. అంతేకుండా రవాణా కోసం మరో 20 పైసలు అదనంగా ఖర్చు అవుతున్నాయని స్పష్టం చేశాడు. ఒక కుల్హాద్ పై తమకు 30 పైసల లాభం వస్తుందని చెప్పాడు. నెలకు రూ.22,500, సంవత్సరానికి 2 లక్షల 70 వేల రూపాయల రాబడిని సంపాదిస్తున్నానని అన్నాడు.

కొవిడ్ సమయంలో టీ తాగడానికి గాజు గ్లాసులకు బదులుగా ప్లాస్టిక్, పేపర్ టీ కప్పులను విస్తృతంగా ఉపయోగించారు. అయితే, ఈ కప్పులో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెప్పిన తర్వాత, ఇప్పుడు కుల్హాద్ లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా కటక్, భువనేశ్వర్ వంటి పెద్ద నగరాల్లో మట్టి టీ కప్పులకు డిమాండ్ పెరిగింది. అలాగే మట్టి కప్పులో టీ తాగితే దాని రుచి డబుల్ అవుతుందని కస్టమర్లు భావిస్తున్నారు. అలాగే ఆరోగ్యకరమైనదని కూడా అభిప్రాయపడుతున్నారు.
ఓవైపు లాయర్గా ప్రాక్టీస్- మరోవైపు మోడ్రన్ ఫార్మింగ్లో అదుర్స్- యువరైతుకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం

