కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కన్నుమూత
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి

Published : January 6, 2026 at 8:10 AM IST
Former Central Minister Passed Away : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, పుణె మాజీ ఎంపీ సురేశ్ కల్మాడి (81) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
రెండు రంగాల్లో కీలక పాత్ర పోషించిన సురేశ్
సురేశ్ కల్మాడి రాజకీయాలతో పాటు క్రీడా పరిపాలన రంగంలోనూ కీలక పాత్ర పోషించారు. పుణె నుంచి పలుమార్లు లోక్సభకు ఎన్నికైన ఆయన, కేంద్ర రైల్వే శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు, భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.
మధ్యాహ్నం పుణెలో అంతిమ సంస్కారాలు
సురేశ్ కల్మాడి కుటుంబ వివరాల ప్రకారం, ఆయనకు భార్య, ఒక వివాహిత కుమారుడు, కోడలు, ఇద్దరు వివాహిత కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఆయన భౌతికకాయం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పుణెలోని ఎరండవణే ప్రాంతంలోని కల్మాడి హౌస్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నవి పేఠ్లోని వైకుంఠ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
సైనిక సేవ నుంచి రాజకీయాల్లోకి
సురేశ్ కల్మాడి 1944 మే 1న జన్మించారు. పుణెలోని సెయింట్ విన్సెంట్ హైస్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన, ఫెర్గూసన్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1960లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన కల్మాడి, 1964 నుంచి 1972 వరకు భారత వైమానిక దళంలో పైలట్గా సేవలందించారు. 1965, 1971 భారత్– పాకిస్థాన్ యుద్ధాల్లో ఆయన సక్రియంగా పాల్గొన్నారు.
వైమానిక దళ సేవ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన సురేశ్ కల్మాడి, పుణె రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, పుణె ప్యాటర్న్గా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. పుణె నగరంలో కాంగ్రెస్ పార్టీ బలపడటంలో ఆయన పాత్ర కీలకమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
క్రీడా పరిపాలనలో కీలక పాత్ర
రాజకీయాలతో పాటు క్రీడా పరిపాలనలోనూ సురేష్ కల్మాడి పేరు ప్రముఖంగా వినిపించింది. భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడలకు గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. 2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఎన్ని జరిగినా తగ్గని కల్మాడి ప్రభావం
అయితే, అదే సమయంలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ కేసుల్లో అరెస్టు కావడం, విచారణలు ఎదుర్కోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ, పుణె రాజకీయాల్లో ఆయన ప్రభావం తగ్గలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీలకతీతంగా సంతాపం
సురేశ్ కల్మాడి మరణంపై కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా సంతాపం తెలిపారు. ప్రజాజీవితంలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. పుణె నగర రాజకీయాలపై, క్రీడా పరిపాలనపై కల్మాడి వేసిన ముద్ర చిరకాలం గుర్తుండిపోతుందని నేతలు వ్యాఖ్యానించారు. సురేశ్ కల్మాడి మరణంతో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా పుణె రాజకీయాలకు తీరని లోటు ఏర్పడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన జీవితం రాజకీయాలు, సైనిక సేవ, క్రీడా పరిపాలన మూడు రంగాల్లోనూ ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయిందని చెప్పాలి
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత- ప్రధాని, రాష్ట్రపతి సంతాపం
వృక్షమాత సాలుమరద తిమ్మక్క కన్నుమూత- వృక్ష సంరక్షణకు ఆమె జీవితం అంకితం

