ETV Bharat / bharat

హెల్మెట్ పెట్టుకోకపోయి ఉంటే అభిషేక్ చనిపోయేవాడు: మేనల్లుడిపై జరిగిన దాడిపై మమత ఫైర్

మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి- హెల్మెట్ పెట్టుకోకపోతే అభిషేక్ మరణించేవాడన్న మమత- దాడి వల్ల అభిషేక్ ఛాతీలో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని వెల్లడి

TMC Supermo Mamata Banerjee
TMC Supermo Mamata Banerjee (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2026 at 9:59 AM IST

3 Min Read
Choose ETV Bharat

Mamata On Abhishek Banerjee Attack : తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిపై బంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. సోనార్‌పుర్‌లో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తర్వాత ఆయన ఛాతీలో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని తెలిపారు. ఎవరో అభిషేక్‌కు హెల్మెట్ పెట్టకపోయి ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడని ఆరోపించారు. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల తన మేనల్లుడి ఛాతీ, పక్కటెముకల ప్రాంతంలో గాయాలయ్యాయని పేర్కొన్నారు. అభిషేక్‌కు సరైన చికిత్స అందించకుండా ఉండేందుకు ఆస్పత్రులపై పైనుంచి ఒత్తిడి ఉందని విమర్శించారు.

పోలీసులు భద్రత కల్పించలేకపోయారు : మమత
అభిషేక్‌కు చికిత్సను విశ్వసనీయ వైద్యులు తమ కుటుంబ వైద్యుల పర్యవేక్షణలోనే కొనసాగించాలని మమతా బెనర్జీ కోరారు. అభిషేక్ సోనార్‌పుర్ పర్యటన గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, వారు ఎందుకు తగిన భద్రత ఏర్పాట్లు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. హింసను సృష్టించేందుకే బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆరోపించారు. బీజేపీ చట్ట ప్రకారం పనిచేయాలని కోరారు. కాషాయం పార్టీ కనీసం ఎవరినీ చికిత్స పొందనీయడం లేదని ఆరోపించారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఎవరికి చికిత్స చేయాలి? ఎవరికి చేయకూడదు? అనే దానికి బీజేపీ నుంచి అనుమతి కావాలని మండిపడ్డారు. అంత అమానవీయంగా బీజేపీ తయారయ్యిందని ఫైర్ అయ్యారు.

"నిజంగా అభిషేక్‌ను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేకపోతే అతడిని మొదట ఐసీయూకి ఎందుకు తరలించారు. పలు వైద్య పరీక్షలు, స్కాన్‌లు చేయించుకోమని ఎందుకు సలహా ఇచ్చారు? అభిషేక్‌ను పరీక్షించిన డాక్టర్లు పలు గాయాలను గమనించారు. తక్షణ వైద్య పరీక్షలు చేయించుకోమని అభిషేక్‌కు సలహా ఇచ్చారు. అభిషేక్ ముఖం, వీపు, ఛాతీ, మెడపై పలు బలమైన గాయాలయ్యాయి. గాయపడిన రోగికి చికిత్స అందించే విషయంలో వైద్యులు, ఆస్పత్రి అధికారులపై ఒత్తిడి తేవడం అత్యంత ఆందోళనకరమైన అంశం. రోగిని ఆస్పత్రిలో చేర్చుకోవడం, డిశ్చార్జ్ చేయడం, చికిత్స అందించడం వంటి నిర్ణయాలు పూర్తిగా వైద్యులకు సంబంధించిన అంశంగా ఉండాలి. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. రాజకీయ విభేదాలకు హింస, బెదిరింపులు, ఆయుధాలు ఏమాత్రం పరిష్కారం కావు. బీజేపీ అభిషేక్ బెనర్జీకి చికిత్స అందకూడదనే ఉద్దేశంతో అన్ని ఆస్పత్రులను బెదిరిస్తోంది. నేను ఓ ఆస్పత్రి నిర్వాహకుడితో కూర్చున్నప్పుడు తనకు పోలీసుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన నాతో చెప్పారు. వైద్యులు బాధలో ఉన్నారు. వారిపై ఒత్తిడి ఉంది. రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేశారు. అభిషేక్ బెనర్జీని చికిత్స కోసం హైదరాబాద్‌కు గానీ లేదా మరెక్కడికైనా తరలించమని సూచించారు"
-మమతా బెనర్జీ, మాజీ సీఎం

నాపై దాడికి బీజేపీయే కారణం : అభిషేక్
తనపై దాడికి బంగాల్‌లో ఇటీవలే అధికారంలోకి వచ్చిన బీజేపీయే కారణమని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఇదంతా బీజేపీ ప్రేరేపిత చర్యే అని మండిపడ్డారు. ఇదేనా బీజేపీ ప్రజాస్వామ్య నమూనా? ఎన్నికలు జరిగి కనీసం నెల రోజులు కూడా గడవకముందే ఇలా చేస్తున్నారని విమర్శించారు. తన రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. కాగా, అభిషేక్‌పై దాడి ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కర్మ రిటర్న్ గిఫ్ట్ : బీజేపీ
మరోపైపు అభిషేక్‌పై దాడిపై తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీజేపీ ధీటుగా తిప్పికొట్టింది. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని 'కర్మ రిటర్న్స్'గా బీజేపీ నాయకురాలు కీయా ఘోష్ వ్యాఖ్యానించారు. "గత 15 ఏళ్లుగా తృణమూల్ ప్రభుత్వ హయాంలో బంగాల్ ప్రజలు అనేక అకృత్యాలను చూశారు. ఈ రోజు వారికి (అభిషేక్‌కు) ఆ కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. కర్మ అంటే ఏమిటో మీకు తెలుసా? మీరు ఏది చేశారో, అదే మీకు తిరిగి లభిస్తుంది" అని ఆమె తెలిపారు.

అసలేం జరిగిందంటే?
బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో బాధితులైన టీఎంసీ కార్యకర్తలను పరామర్శించేందుకు శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పుర్‌కు వెళ్లారు అభిషేక్ బెనర్జీ. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు ఆయనపై రాళ్లు, చెప్పులు, గుడ్లతో దాడి చేశారు. ఆ తర్వాత హెల్మెట్‌ ధరించిన అభిషేక్‌ను అతి కష్టం మీద సురక్షిత ప్రాంతానికి పోలీసులు తరలించారు.

సీడీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి

దిల్లీలో దయనీయ పరిస్థితిలో చిల్డ్రన్స్ పార్కులు- సౌకర్యాల లేమితో సందర్శకుల పాట్లు