'చేప చర్మంతో లెదర్'- వేస్ట్ అనుకున్న దాంతోనే రూ.కోట్ల వ్యాపారం- మంగళూరు రీసెర్చర్ల మ్యాజిక్!
చేపల వ్యర్థాల నుంచి నాణ్యమైన లెదర్ తయారు చేసే టెక్నాలజీ - సాంప్రదాయ లెదర్ ఇండస్ట్రీ కంటే చాలా తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మేలు

Published : January 9, 2026 at 8:03 AM IST
Fish Skin Leather In Mangaluru : చేపను కూర వండుకుని తినడం మనందరికీ తెలుసు కానీ పారేసే దాని చర్మంతో ఖరీదైన లెదర్ వస్తువులు తయారు చేయొచ్చని ఎప్పుడైనా ఊహించారా? వినడానికి వింతగా ఉన్నా కర్ణాటకలోని మంగళూరు ఫిషరీస్ కాలేజీ పరిశోధకులు ఇప్పుడు ఇదే నిజం చేసి చూపించారు. ఐదేళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత చేప చర్మం నుంచి హై క్వాలిటీ లెదర్ తయారు చేసే అద్భుతమైన మెథడ్ను డెవలప్ చేశారు. భవిష్యత్తులో మన పర్సులు, బెల్టులు అన్నీ ఈ చేప చర్మంతో చేసినవే ఉండబోతున్నాయి. వేస్ట్ అనుకుని పారేసే దానికి ఎంతటి విలువ ఉంటుందో ఈ రీసెర్చ్ నిరూపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే!
చెత్త నుంచి ఆదాయం
సాధారణంగా ఒక చేపలో 35 నుంచి 40 శాతం వరకు వ్యర్థాలే ఉంటాయి. మాంసం కోసం చేపను ప్రాసెస్ చేసినప్పుడు చర్మాన్ని పనికిరాదని పారేస్తుంటారు. కానీ ఈ వ్యర్థాల్లోనే అసలైన సంపద ఉందని ప్రొఫెసర్ బీ మంజా నాయక్ బృందం నిరూపించింది. సుమారు 10 నుంచి 15 రకాల చేపలపై స్టడీ చేసిన వీరు మలబార్ గ్రూపర్, కోబియా, క్యాట్ ఫిష్, మెలెగు వంటి చేపల చర్మం లెదర్ తయారీకి చాలా అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ చేపల చర్మం మందంగా, బలంగా ఉండటం వల్ల మన్నికైన లెదర్ ఉత్పత్తులను తయారు చేయవచ్చని తేలింది. చేప చర్మంలో ఉండే కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఈ లెదర్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
పర్యావరణానికి మేలు
ప్రస్తుతం లెదర్ ఇండస్ట్రీ అంతా ఆవులు, గొర్రెలు, ఒంటెలు, మొసళ్ల చర్మాలపైనే ఆధారపడి ఉంది. అయితే వీటిని ప్రాసెస్ చేసేటప్పుడు క్రోమియం వంటి అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతుంటారు. దీనివల్ల పర్యావరణం కలుషితం అవ్వడమే కాకుండా నీరు కూడా భారీగా వృథా అవుతుంది. కానీ చేప చర్మం నుంచి లెదర్ తయారు చేసే ఈ కొత్త టెక్నాలజీలో కెమికల్స్ వాడకం చాలా తక్కువ. తక్కువ నీటితోనే ఎకో ఫ్రెండ్లీ లెదర్ను తయారు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది పర్యావరణ ప్రేమికులకు ఒక గొప్ప వార్త అని చెప్పవచ్చు.

కుటీర పరిశ్రమలకు బూస్ట్
దక్షిణ కన్నడ జిల్లాలో చేపల ఉత్పత్తి చాలా ఎక్కువ కాబట్టి ఈ పరిశోధన స్థానిక ఆర్థిక వ్యవస్థను మార్చే అవకాశం ఉంది. ఇక్కడ పారేసే చేప చర్మంతో కీచైన్స్, పర్సులు, బెల్టులు వంటివి తయారు చేస్తే చిన్న తరహా పరిశ్రమలకు మంచి ఊతం లభిస్తుంది. పర్యావరణానికి హాని చేయని ఈ లెదర్తో స్థానిక మహిళలు, యువతకు కొత్త ఉపాధి మార్గాలు దొరుకుతాయి. జంతువుల చర్మంపై ఆధారపడటం తగ్గుతుంది. వేస్ట్ అనుకున్న వస్తువుకు వాల్యూ యాడ్ చేయడం వల్ల మత్స్యకారులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది.
అంతర్జాతీయ గుర్తింపు
ఈ ప్రాజెక్ట్ కోసం ఎనిమిది మంది పరిశోధకుల టీమ్ దాదాపు ఐదేళ్ల పాటు నిరంతరం కష్టపడింది. వీరి కృషిని గుర్తించిన అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'స్ప్రింగర్ నేచర్'లో ఈ పరిశోధన వ్యాసాన్ని పబ్లిష్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్కువ ఖర్చుతోనే ఈ ప్రాసెసింగ్ చేయవచ్చని ప్రొఫెసర్ నాయక్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక రీసెర్చ్ మాత్రమే కాదు. వేస్ట్ నుంచి వర్త్ను ఎలా క్రియేట్ చేయవచ్చో చెప్పే ఒక అద్భుతమైన ఐడియా. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ లెదర్ ఇండస్ట్రీలో ఒక గేమ్ ఛేంజర్ కాబోతోంది.
చేపను కేవలం ఆహారంగానే కాకుండా ఇలా ఒక విలువైన వనరుగా మార్చడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగిస్తే జంతువులను చంపాల్సిన అవసరం కూడా క్రమంగా తగ్గుతుంది. చేప చర్మం లెదర్ వస్తువులు మార్కెట్లోకి వస్తే కచ్చితంగా కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయి. మన దేశంలో ఇలాంటి వినూత్న ప్రయోగాలు జరగడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా సరికొత్త స్టార్టప్స్ కూడా పుట్టుకొస్తాయి. మరి ఈ ప్రక్రియకు మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో చూడాలి.
చేపల సాగులో రైతు అదుర్స్- ఏటా రూ.60లక్షల రాబడి- విదేశాల్లోనూ సుశీల్ పాపులర్!
కొర్రమీను రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ మేలు చేస్తుందట! - ఎందుకో తెలుసా?

