ETV Bharat / bharat

భారత పర్యటనలో ట్రంప్ కూతురు- తాజ్‌మహల్‌ను సందర్శించిన టిఫనీ

ఆగ్రాలో ట్రంప్ కుమార్తె టిఫనీ పర్యటన- భర్తతో కలిసి తాజ్ మహల్​ సందర్శన- అంతకుముందు ప్రఖ్యాత స్వామి నారాయణ్​ అక్షరధామ్​ ఆలయాన్ని సందర్శించారు

Trump Daughter Tiffany
Trump Daughter Tiffany (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2026 at 3:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Trump Daughter Visits Taj Mahal : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ, శనివారం చారిత్రాత్మక తాజ్​ మహల్​ను సందర్శించారు. భర్త మైఖేల్ బౌలోస్‌తో కలిసి, సుమారు గంటసేపు ఆ కట్టడాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఆ కట్టడాన్ని ఆసక్తికరంగా వీక్షిస్తూ ప్రాంగణంలోని వివిధ ప్రదేశాల్లో ఫొటోలు దిగారు. అంతేకాకుండా, తాజ్​మహల్​ కట్టడం, దాని చరిత్ర, వాస్తుశిల్పంపై ఎంతో ఆసక్తి చూపారని, నిర్మాణం గురించి అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారని టూరిస్ట్ గైడ్ రమేశ్​ దివాన్ తెలిపారు.

స్వామి నారాయణ్​ అక్షరధామ్​ ఆలయాన్ని సందర్శించిన టిఫనీ
దిల్లీ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత స్వామి నారాయణ్​ అక్షరధామ్​ ఆలయాన్ని టిఫనీ సందర్శించారు. ఆలయంలోని శిల్పకళను ఆసక్తిగా తిలకించారు. అలాగే, ఆలయం ఆవరణలోని 108 అడుగుల నీలకంఠ్​ వర్ణీ విగ్రహాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ ​మీడియాలో పంచుకున్నారు. ఈ పర్యటన గురించి ఎక్స్​లో వేదికగా పోస్ట్​ చేశారు. అందులో అక్షరధామ్​ ఆలయ సందర్శనలో తన అనుభవాలు అద్భతమని అభివర్ణించారు. "సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించిన ఒక అందమైన రోజు" అని టిఫనీ ఎక్స్​ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు, టిఫనీ పర్యటన వేళ భారత్​లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా స్పందించారు. భారత్​ పర్యటనకు వచ్చిన టిఫనీ, ఆమె భర్తకు స్వాగతమంటూ ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు.

నిఘా పటిష్ఠం
ఇదిలా ఉండగా, టిఫనీ, ఆమె భర్త శనివారం ప్రత్యేక విమానంలో ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, తాజ్​ మహల్​ సందర్శన అనంతరం వీరిద్దరూ రాజస్థాన్​లోని జైసల్మేర్​కు వెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టిఫనీ సందర్శన నేపథ్యంలో ఒక అమెరికా బృందం ఆగ్రాలో మకాం వేసినట్లు తెలిసింది. అంతేకాదు, టిఫనీ, ఆమె భర్త ఆగ్రా పర్యటన నేఫథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ట్రంప్​ రెండో భార్య మార్లా కుమార్తె అయిన టిఫనీ భారత్​ను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. 2018 ట్రంప్​ భారత పర్యటనలో ఉన్నప్పుడు ఆయనతో పాటు టిఫనీ కూడా భారత్​కు వచ్చారు.

2020లో తాజ్​ మహల్​ను సందర్శించిన ట్రంప్​
గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కూడా తాజ్​ మహల్​ను సందర్శించారు. 2020 ఫిబ్రవరి 24న, ట్రంప్ తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడితో కలిసి ఆగ్రాను సందర్శించారు. ట్రంప్, మెలానియా సుమారు 45 నిమిషాల పాటు తాజ్ మహల్‌ను వీక్షించి, తాజ్ ప్రాంగణంలో సందడి చేశారు. ఈ పర్యటన సందర్భంగా, ట్రంప్, మెలానియాను తాజ్ మహల్ పర్యటనకు తీసుకువెళ్లినట్లు టూరిస్ట్ గైడ్ నితిన్ సింగ్ వెల్లడించారు. తాజ్ మహల్ చరిత్ర, షాజహాన్, ముంతాజ్ మహల్ ప్రేమకథ, షాజహాన్ మరణం, మొఘల్ చక్రవర్తుల గురించి అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. వారు తాజ్ మహల్‌ అందాల గురించి కూడా ఆరా తీశారని చెప్పారు. పర్యటన సమయంలో వారిద్దరూ అత్యంత సంతోషంగా కనిపించారని తెలిపారు.

తాజ్​ మహల్​ను సందర్శించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి
ఇటీవల, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా భారత్​లో పర్యటించారు. తన భార్య, ప్రతినిధి బృందంతో కలిసి తాజ్ మహల్‌ను సందర్శించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి భద్రత దృష్ట్యా, ఆయన సందర్శనకు కేవలం కొన్ని నిమిషాల ముందు ఏఎస్ఐ ప్రధాన కార్యాలయం తాజ్ మహల్ రెండు గేట్లను మూసివేసింది. దీని కారణంగా, పర్యటకులు దాదాపు రెండు గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

భారీ ఉగ్రకుట్ర భగ్నం- దావూద్ నెట్‌వర్క్, ISI ముఠాకు చెందిన 9 మంది అరెస్ట్

ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఓటర్ల జాబితాలో SIR ఒకటి : విపక్షాల విమర్శల వేళ సీఈసీ జ్ఞానేశ్ కుమార్