'లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులపై మోదీ ఎందుకు మౌనం?'- కాంగ్రెస్ ప్రశ్న
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శలు- అమెరికా–ఇరాన్ చర్చలు విజయవంతమైతే హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని జైరాం వ్యాఖ్య

Published : June 2, 2026 at 10:35 AM IST
Congress On Modi : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, లెబనాన్పై ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చలు విజయవంతమైతే ప్రాంతీయ యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించిన జైరాం రమేశ్, పశ్చిమాసియాలో యుద్ధాన్ని నిలిపివేసేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ చర్చలు సఫలమైతే అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై ఒత్తిడి తగ్గి ధరలు దిగివస్తాయని, ఇది భారత్కు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
Negotiations continue between the US and Iran to bring a halt to the war in West Asia. The immediate impact of such an agreement would mean the re-opening of the Strait of Hormuz and a downward pressure in oil prices—both of which India has a tremendous stake in.
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 2, 2026
But the…
అయితే ఈ దౌత్య ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలేనని జైరాం రమేశ్ ఆరోపించారు. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ భూభాగంలో అపూర్వ స్థాయిలో చొరబాట్లు, దాడులు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల వల్లే అమెరికా–ఇరాన్ చర్చల్లో తుది ఒప్పందం కుదరడం లేదని అన్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచంలోని అనేక దేశాలు బహిరంగంగా ఖండిస్తున్నాయని జైరాం గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల లెబనాన్ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోందని, అదే సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య కుదిరే అవకాశమున్న ఒప్పందాన్ని కూడా ఈ దాడులు దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోందని జైరాం రమేశ్ అన్నారు. రాజకీయంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ "సో-కాల్డ్ ఫాదర్ల్యాండ్ ఆయనకు మాతృభూమి కంటే ముఖ్యమైందా?" అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య కూడా ఇటీవల ఉద్రిక్త సంభాషణ జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. లెబనాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు పేర్కొన్నాయి. సోమవారం జరిగిన టెలిఫోన్ సంభాషణలో నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. లెబనాన్లో హెజ్బొల్లా కమాండర్ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన దాడుల్లో భారీ స్థాయిలో భవనాలు ధ్వంసం కావడం, బీరూట్పై పెరుగుతున్న బెదిరింపులు తనకు ఆందోళన కలిగించాయని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశంపై వ్యతిరేక భావన పెరుగుతోందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించినట్లు కథనాలు పేర్కొన్నాయి. నెతన్యాహుతో జరిగిన ఈ సంభాషణ తన రెండో అధ్యక్ష పదవీకాలంలో అత్యంత ఉద్రిక్తమైన వాటిలో ఒకటిగా నిలిచిందని అమెరికా పరిపాలన వర్గాలకు చెందిన అధికారులు చెప్పినట్లు సమాచారం. అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్, బీరూట్పై పెద్ద ఎత్తున దాడులు చేపట్టవద్దని తాను కోరిన తర్వాత ఇజ్రాయెల్ తన దళాల కదలికలను వెనక్కి మళ్లించినట్లు తెలిపారు. మరోవైపు ఇరాన్తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు.
కాగా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచ ముడి చమురు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుండటంతో అక్కడి పరిస్థితులను భారత్ సహా అనేక దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా–ఇరాన్ చర్చలు, లెబనాన్లో పరిస్థితులపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది.
జేబు దొంగల పట్ల జాగ్రత్త- వారు CBSEలోనే తిష్ట వేశారు: రాహుల్
తోటి దేశద్రోహ సోరోస్ ఏజెంట్లతో అసలు విషయాలు బయటపెట్టే సంభాషణ జరిపా: రాహుల్

