ఒకేసారి 250 ఫోన్స్కు ఛార్జింగ్- రాష్ట్రపతి, కేంద్రం నుంచి లేఖలు- పోరాడి గెలిచిన 'ఛార్జింగ్ మ్యాన్' స్టోరీ ఇదే!
న్యాయపోరాటంలో విజయం సాధించిన ఛార్జింగ్ మ్యాన్- గౌతమ్కు మద్దతుగా రాష్ట్రపతి భవన్, కేంద్రం లేఖలు

Published : October 16, 2025 at 12:17 PM IST
Charging Man Gautam Patra : ఓ మెడికల్ కాలేజీ దగ్గర చిన్న దుకాణంలో సెల్ఫోన్ ఛార్జింగ్ సర్వీస్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడు ఓ వ్యక్తి. దివ్యాంగుడైన ఆ వ్యక్తి రోజుకూ వైద్యులకు, రోగులకు వేల ఫోన్స్ చార్జింగ్ చేస్తూ ఉంటాడు. ఏకకాలంలో 250 ఫోన్స్ ఛార్జింగ్ చేసే పోర్టులు ఆ వ్యక్తి దగ్గర ఉన్నాయి. అందరూ ఆయనను ఛార్జింగ్ మ్యాన్గా పిలుస్తారు. కట్ చేస్తే ఏకకంగా రాష్ట్రపతి భవన్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఛార్జింగ్ మ్యాన్ కోసం లేఖలు వచ్చాయి. ఇంతకీ ఎవరీ ఆ వ్యక్తి? ప్రభుత్వం నుంచి లేఖలు ఎందుకు వచ్చాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.
సగం జీవితం ఆస్పత్రిలోనే
బంగాల్లోని కోల్కతా నగరానికి 130 కి.మీ దూరంలోని మేదినీపూర్కు జన్మించిన గౌతమ్దా. చార్జింగ్ మ్యాన్ గౌతమ్దా పూర్తి పేరు గౌతమ్ పాత్ర. దివ్యాంగుడైన ఈయన వయసు 60 ఏళ్లకుపైనే ఉంటుంది. బాల్యం నుంచి కోల్కతా మెడికల్ కాలేజీలోనే ఉంటున్నారు. ఆయన జీవితంలో సగం అక్కడే గడిచిపోయింది. ఇప్పుడు కూడా తన భార్యాపిల్లలతో ఈ కాలేజీ లోపల ఉన్న చిన్నపాటి రూంలోనే నివసిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం వరకు ఈ గదిలో 'టెలిఫోన్ పీసీఓ బూత్'ను గౌతమ్ నడిపారు. ఆస్పత్రిలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది, రోగులంతా ఈయన షాపుకు వచ్చి తమ వాళ్లకు కాల్స్ చేసుకునేవారు. తద్వారా మంచి ఆదాయమే వచ్చేది. ఫోన్ల సేల్స్ పెరిగిన తర్వాత టెలిఫోన్ పీసీఓ బూత్ వ్యాపారం డీలా పడింది. అందరూ తమతమ ఫోన్ల నుంచే కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు.


సెల్ఫోన్ ఛార్జింగ్ సర్వీస్
ఈ పరిస్థితుల్లో మరో వ్యాపారాన్ని గౌతమ్ మొదలుపెట్టారు. అదే 'సెల్ఫోన్ ఛార్జింగ్ సర్వీస్'. ప్రస్తుతం కోల్కతా మెడికల్ కాలేజీలోని ఆయన ఇల్లు, దుకాణంలో దాదాపు 500 సెల్ఫోన్ ఛార్జింగ్ పోర్ట్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 5వేల ఫోన్లకు ఛార్జింగ్ చేసే సదుపాయాలు తన దగ్గర సిద్ధంగా ఉన్నాయని ఈటీవీ భారత్కు గౌతమ్ పాత్ర తెలిపారు. ఒక్కో ఫోన్ను ఫుల్గా ఛార్జ్ చేసి ఇవ్వడానికి రూ.10 నుంచి రూ.20 దాకా తీసుకుంటానన్నారు. ఈయన వద్ద ఛార్జింగ్ కోసం ఇచ్చే ప్రతీ ఫోన్కు ఒక నిర్దిష్ట నంబరుతో 2 టోకెన్లను జారీ చేస్తారు. ఒక టోకెన్ను ఫోన్ యజమానికి ఇస్తారు. మరొక టోకెన్ను ఫోన్కు అతికిస్తారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో ఎప్పుడైనా వచ్చి ఫోన్ను తీసుకెళ్లొచ్చనే విషయం టోకెన్పై స్పష్టంగా రాసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ యజమాని టోకెన్ను పోగొట్టుకుంటే, రూ.200 దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

రోగుల బంధువులకు సేవ
రోగి ఆస్పత్రి బెడ్పై ఉంటే, బంధువులు బయట ఉంటారు. ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి రోగుల బంధువులు తమ మొబైల్ ఫోన్లను ఆన్ చేస్తారు. ఫలితంగా వాటి ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. కానీ, అందరి వద్ద పవర్ బ్యాంకులు ఉండవు. అలాంటి వాళ్లంతా గౌతమ్ పాత్రా వద్దకొచ్చి మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేయించుకుంటారు. ఈ సర్వీస్ చేసినందుకు గౌతమ్కు సంతోషంగా రూ.10 నుంచి రూ.20 దాకా ఇస్తారు.

పదేళ్ల క్రితం షాకింగ్ ఘటన
దాదాపు పదేళ్ల క్రితం గౌతమ్ జీవితంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. దశాబ్దాలుగా కోల్కతా మెడికల్ కాలేజీ లోపల ఉన్న అతడి దుకాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయించింది. దీంతో ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. అకస్మాత్తుగా ఉపాధిని కోల్పోయి చాలా ఇబ్బందిపడ్డారు. బంగాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం రాలేదు. ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. దీంతో గౌతమ్ కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఉపాధినిచ్చే దుకాణం కోసం 2017 నుంచి 2019 మధ్య కాలంలో కోల్కతా మెడికల్ కాలేజీ, బంగాల్ ఆరోగ్యశాఖలతో ఆయన న్యాయపోరాటం చేశారు. ఇక ఇదే సమయంలో తాత్కాలిక ఉపాధి కోసం కోల్కతా మెడికల్ కాలేజీ సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని 'గౌతమ్ టెలికాం' పేరుతో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అందులోనూ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సర్వీస్తో పాటు జిరాక్స్, ఇతర సామగ్రిని విక్రయించారు. ఇప్పటికీ ఈ దుకాణం కూడా నడుస్తోంది.

అండగా నిలిచిన రాష్ట్రపతి భవన్, కేంద్ర సర్కారు
ఎట్టకేలకు గౌతమ్ న్యాయపోరాటం ఫలించింది. కోల్కతా మెడికల్ కాలేజీ లోపల దుకాణాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని గౌతమ్కు ఇవ్వాలంటూ బంగాల్ సర్కారును హైకోర్టు ఆదేశించింది. అనంతరం దీనిపై భారత ప్రభుత్వ వికలాంగుల ఉపాధి శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ పంపింది. ఇదే విషయంపై రాష్ట్రపతి భవన్ నుంచి బంగాల్ సెక్రటేరియట్కు ఒక లేఖ వచ్చింది. ఈవిధంగా మళ్లీ కోల్కతా మెడికల్ కాలేజీ లోపల తన దుకాణాన్ని గౌతమ్ ఏర్పాటు చేసుకున్నారు.


అన్యాయంపై పోరాడాలి : గౌతమ్ పాత్రా
'నాకు జీవితాన్ని ఇచ్చిన ఆ భగవంతుడు ఆహారాన్ని కూడా ఇస్తాడు. ఆ దేవుడు మన కోసం మాత్రమే. నిజమైన విషయం ఏమిటంటే పోరాడటం. మనం నిత్యం పోరాడాలి. అన్యాయంపై పోరాడాలి. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. పోరాటాన్ని అస్సలు వదలొద్దు' అని 'ఈటీవీ భారత్'తో గౌతమ్ పాత్రా చెప్పుకొచ్చారు.

