సీబీఎస్ఈ OSM భద్రతా లోపాలు కట్టడి- IIT నిపుణులతో మరింత పటిష్ట చర్యలు
12వ తరగతి ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై వివాదాల మధ్య సీబీఎస్ఈ స్పందన- ఆన్మార్క్ పోర్టల్లో గుర్తించిన భద్రతా లోపాలను సరిచేసినట్లు వెల్లడి- ఐఐటీలు, ప్రభుత్వ విభాగాల సైబర్ నిపుణులతో ప్రత్యేక బృందం ఏర్పాటు

Published : May 31, 2026 at 6:47 PM IST
CBSE On OSM Issue : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కొత్తగా అమలు చేస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై ఇటీవల వెలువడిన భద్రతా ఆందోళనల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. మూల్యాంకనానికి వినియోగిస్తున్న తమ సర్వీస్ ప్రొవైడర్కు చెందిన ఆన్మార్క్ డిజిటల్ పోర్టల్లో గుర్తించిన భద్రతా లోపాలను కట్టడి చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు నిపుణుల బృందం నిరంతరం పనిచేస్తోందని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా సీబీఎస్ఈ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్మార్క్ పోర్టల్కు సంబంధించిన భద్రతా లోపాలపై సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల్లో వస్తున్న సమాచారాన్ని తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ప్రజల దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. సీబీఎస్ఈ ప్రకారం, గత కొన్ని రోజులుగా ఐఐటీలు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం ఈ వ్యవస్థపై పనిచేస్తోంది. పోర్టల్లోని భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేయడంతో పాటు, అవసరమైతే మరింత సురక్షితమైన సాంకేతిక వేదికకు మార్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
ఇప్పటివరకు గుర్తించిన సాంకేతిక, భద్రతా లోపాలను సరిచేసినట్లు బోర్డు తెలిపింది. అంతేకాకుండా, ఇంకా ఏవైనా హ్యాకింగ్కు అవకాశం కల్పించే బలహీనతలు ఉన్నాయా అనే అంశాన్ని నిపుణులు సమగ్రంగా పరిశీలిస్తున్నారని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇటీవల ఆన్మార్క్ పోర్టల్లో భద్రతా లోపాలు ఉన్నాయంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది.
ముఖ్యంగా 12వ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం వంటి కీలక ప్రక్రియలో ఉపయోగిస్తున్న డిజిటల్ వ్యవస్థ భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ స్పందిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. అలాగే, పోర్టల్లోని బలహీనతలను ముందుగానే గుర్తించి బోర్డు దృష్టికి తీసుకువచ్చిన పౌరులు, ఎథికల్ హ్యాకర్ల పాత్రను సీబీఎస్ఈ ప్రశంసించింది. వారి అప్రమత్తత వల్ల సమస్యలను వేగంగా గుర్తించి చర్యలు తీసుకోవడం సాధ్యమైందని తెలిపింది.
ఇప్పటికే కొంతమంది ఎథికల్ హ్యాకర్లను నేరుగా సంప్రదించినట్లు వెల్లడించింది. ఇంకా ఎవరైనా భద్రతా అంశాలకు సంబంధించిన సమాచారం లేదా సూచనలు ఇవ్వాలనుకుంటే తమ సైబర్ భద్రతా విభాగాన్ని సంప్రదించాలని సీబీఎస్ఈ కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా secy-cbse@nic.in ఈ-మెయిల్ చిరునామాను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. డిజిటల్ మూల్యాంకన విధానాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్మార్క్ పోర్టల్లో గుర్తించిన లోపాలను సరిచేసినట్లు సీబీఎస్ఈ ప్రకటించడం కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ, వ్యవస్థ పూర్తిస్థాయిలో సురక్షితంగా ఉందని నిర్ధారించేందుకు కొనసాగుతున్న పరిశీలనలు పూర్తయ్యే వరకు అప్రమత్తత కొనసాగించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
తోటి దేశద్రోహ సోరోస్ ఏజెంట్లతో అసలు విషయాలు బయటపెట్టే సంభాషణ జరిపా: రాహుల్
ప్రధాని మోదీకి తన ప్రభుత్వ మనుగడపై తప్ప, విద్యార్థుల భవిష్యత్పై శ్రద్ధ లేదు: రాహుల్ గాంధీ

