ETV Bharat / bharat

బిహార్​ పీఠం ఏ కూటమిది? ఓట్ల లెక్కింపునకు అంతా సిద్దం!

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

Bihar Election Result 2025
Bihar Election Result 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 13, 2025 at 7:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

Bihar Election Result 2025 : హోరాహోరీగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో విజేతలెవ్వరో శుక్రవారం తేలనుంది. ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ కూటముల్లో ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెట్టారో ఈ ఫలితాలతో వెల్లడి కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని ఈసీ తెలిపింది. ఇందుకోసం 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రతి ఓట్లు లెక్కింపు కేంద్రం వద్ద రెండంచెల భద్రత వ్యవస్థ ఉంటుందని పేర్కొంది. కౌంటింగ్ కేంద్రం లోపల కేంద్ర సాయుధ బలగాల పహారా ఉంటుందని వివరించింది. బయట బిహార్ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారని తెలిపింది.

తొలుత పోస్టల్ బ్యాలెట్‌లోని ఓట్ల లెక్కింపు
సెంట్రల్ అబ్జర్వర్స్‌తో పాటు అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది. జిల్లా ఎన్నికల అధికారితో పాటు రిటర్నింగ్ అధికారులు క్రమం తప్పకుండా స్ట్రాంగ్‌ రూమ్‌లను సందర్శించాలని ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్ట్రాంగ్ రూమ్‌లలోనే కంట్రోల్‌ రూంలను ఈసీ ఏర్పాటు చేసింది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లోని ఓట్లను లెక్కించనున్నారు.

రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి లాభం చేకూర్చనుంది?
బిహార్‌లో మొత్తం 243 స్థానాలుండగా ఈ నెల 6, 11న రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ సారి రికార్డు స్థాయిలో 67.13 పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ అని ఈసీ తెలిపింది. మహిళా ఓటర్లలో 71.78 శాతం, పురుషుల్లో 62.98 శాతం మంది ఓటు వేశారని వెల్లడించింది. రికార్డు స్థాయి పోలింగ్ జరగడంతో ప్రజల తీర్పు తమకే అనుకూలమంటూ అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌ బంధన్‌ రెండూ భావిస్తున్నాయి. విజయం సాధించబోతున్నామంటూ తమకు అనుకూలమైన భాష్యాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనను అందించినందువల్లే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి మద్దతు తెలిపారని ఎన్డీయే కూటమి నేతలు చెబుతున్నారు. ఓటర్లు మార్పు కోరుకున్నారు అనటానికి భారీ పోలింగే నిదర్శనమని ఆర్జేడీ నేతలు అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీయే కూటమికే పట్టం కట్టాయి.

అదే ఒరవడి కొనసాగుతుందా?
బిహార్‌లో పోలింగ్‌ 5 పర్సంటేజ్‌ పాయింట్ల కంటే ఎక్కువ పెరిగిన మూడుసార్లు అధికార మార్పిడి జరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటింగ్ శాతం 9.84 పర్సంటేజ్‌ పాయింట్లు పెరిగింది. దీంతో ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది.

501 కిలోల లడ్డూలను ఆర్డర్‌ చేసిన బీజేపీ
మరోవైపు చాలావరకు ఎగ్జిట్స్‌ పోల్స్‌ ఎన్డీయే కూటమికే పట్టం కట్టడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఈ క్రమంలోనే ఫలితాల రోజు భారీ ఎత్తున వేడుకలు చేసుకునేందుకుగానూ ఇప్పటినుంచే కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వేడుకల కోసం రాష్ట్ర రాజధాని పట్నాలో 501 కిలోల లడ్డూలను ఆర్డర్‌ చేసింది కాషాయ పార్టీ.

'ఎగ్జిట్​ పోల్స్ అంచనాల కన్నా మెరుగైన ఫలితాలు'- బిహార్​ ఎన్నికలపై NDA ధీమా

బిహార్​లో మళ్లీ NDAదే అధికారం- మహాకూటమికి 100లోపే సీట్లు- ఎగ్జిట్ పోల్స్ అంచనా