బస్తర్ టు లద్ధాఖ్- యువకుడి 2,700 కిలోమీటర్ల సైకిల్ జర్నీ- అమరవీరులకు నివాళి అర్పించేందుకే!
డోర్నపాల్ నుంచి లద్దాఖ్ వరకు సైకిల్ ప్రయాణం - అమరవీరులకు నివాళి అర్పించేందుకు చేస్తున్న యువకుడు - పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న బస్తర్ ప్రాంతానికి చెందిన జగత్

Published : March 1, 2026 at 4:00 PM IST
|Updated : March 1, 2026 at 4:28 PM IST
Man Cycle Journey Tribute To Soldiers : దేశంలోనే అత్యధిక నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా పేరు పొందిన బస్తర్కు చెందిన ఒక యువకుడు 2,700 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లేందుకు ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఇది సాహస యాత్ర లేదా రికార్డుల కోసం చేసే ప్రయాణం కాదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్న అమరవీరులకు నివాళులర్పించడానికి చేస్తున్నాడు. అసలు ఎవరు ఆ యువకుడు? ఎందుకు ఈ యాత్ర చేస్తున్నాడు? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్వగ్రామం నుంచి లద్దాఖ్ వరకు
ఛతీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం సమీపంలోని డోర్నపాల్ గ్రామంలో జగత్ మండల్ అనే యువకుడు నివసిస్తున్నాడు. జగత్ తన గ్రామం నుంచి లద్దాఖ్ వరకు సైకిల్పై ప్రయాణిచేందుకు సంకల్పం చేసుకున్నాడు. సుమారు ఆరు నెలల పాటు ఉండే ఈ ప్రయాణంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఉండే యువతను కలిసి అమరవీరుల పట్ల తనకు ఉన్న గౌరవం, దేశభక్తి గురించి అంతటా వ్యాప్తి చేస్తానని తెలిపాడు. అలాగే పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులకు కూడా ఈ విషయాలు చెబుతాడని అన్నాడు.

కుటుంబ ప్రోత్సాహంతో సైకిల్ ప్రయాణం
డోర్నపాల్ నుంచి లద్దాఖ్ వరకు 2,700 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రయాణం అంత సులభం కాదు. దట్టమైన అడవులు, మైదానాలు, నిటారుగా ఉన్న పర్వతారోహణలు, తీవ్రమైన వేడి, ఆకస్మిక వాతావరణ మార్పులు ఇలా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా జగత్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అందుకు తన కుటుంబం నుంచి కూడా ప్రోత్సాహం లభించిందని అన్నాడు.
"మనం ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో మాత్రమే అమరవీరులను గుర్తుచేసుకుంటాం. కానీ వారి త్యాగాన్ని ప్రతిరోజూ గుర్తుంచుకోవాలి. మన సరిహద్దులు కాపాడుతున్న సైనికులు కారణంగానే మనం ఇంకా సురక్షితంగా ఉన్నాం. వారిని కేవలం రెండు రోజుల పాటు గుర్తు చేసుకుంటే సరిపోదు. అలా చేసినంత మాత్రాన వారి త్యాగానికి న్యాయం జరిగినట్లు కాదు"
- జగత్ మండల్, యువ సైక్లిస్ట్
మంచుకొండల్లో సైనికులకు నివాళి
జగత్ గ్రామాన్ని విడిచి ప్రయాణం మొదలు పెడుతున్న తరుణంలో తన గ్రామస్థులు, స్నేహితులు, యువకులు తనకి ఎంతో సంతోషంగా వీడ్కోలు పలికారు. పెద్దలు ఆశీర్వదించి, పిల్లలు జాతీయ జండాను ఊపుతూ ప్రోత్సహించారు. మంచుతో నిండిపోయిన దేశ సరిహద్దులో, సైనికుల చేసిన త్యాగానికి లద్దాఖ్లో నివాళులర్పిస్తాడని జగత్ అన్నాడు. ఈ ప్రయాణం కేవలం లద్దాఖ్ చేరుకునేందుకు కాదని, అందరికీ అమరవీరుల గురించి తెలియజేయడానికని చెప్పాడు.
సమాజంపై మంచి ప్రభావం
చాలా కాలంగా నక్సలిజం పరంగా వార్తల్లో నిలిచిన బస్తర్ ప్రాంతంలోని యువకుల్లో ఇప్పుడు కొత్త మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ హింసను దేశ నిర్మాణం కోసం ఉపయోగించకూడాదని జగత్ చెప్పాడు. ఇటువంటి పర్యాటనలు సమాజంలో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తాయని నిపుణులు అంటున్నారు. అది యువతకు దేశభక్తి, సామాజిక బాధ్యతను నేర్పుతాయని తెలిపారు. పరిమిత వనరులతో ఒక యువకుడు ఇంత నిబద్ధతను చూపినప్పుడు, ఇది వేలాది మంది యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా
జగత్ మండల్ తీసుకున్న ఈ ప్రతిజ్ఞ 'నివాళి అంటే కేవలం మాటలు కాదు, ఆచరణలో కూడా ఉండాలి' అనే మాటను నిరూపిస్తుంది. అతను లద్దాఖ్ చేరుకునే సమయానికి కేవలం ఒక సైక్లిస్ట్గా మాత్రమే ఉన్నా, చేరుకున్న తర్వాత బస్తర్కు చెందిన ఒక కొత్త గుర్తింపుగా మారతాడు. అతని ప్రయాణం భవిష్యత్తులో చాలా మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అందరూ అంటున్నారు.
చిన్నతనంలో చూపుకోల్పోయిన 'ఆమె'- కానీ వందల మంది మహిళలకు ఉపాధి- ప్రేమలత స్టోరీ ఇదే!

