Axiom 4 Mission Postponed: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కలిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యాక్సియమ్ మిషన్ 4' వాయిదా పడింది. ఈ మిషన్ను జూన్ 10, 2025న లాంఛ్ చేసేందుకు ఇటీవల షెడ్యూల్ చేశారు. అయితే అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేయాలని రెండు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రయోగ తేదీని జూన్ 11, 2025 వరకు పొడిగించినట్లు ఇస్రో తన అధికారిక 'X' వేదిక ద్వారా ప్రకటించింది.
Launch of Axiom-4 mission to International Space Station:
— ISRO (@isro) June 9, 2025
Due to weather conditions, the launch of Axiom-4 mission for sending Indian Gaganyatri to International Space Station is postponed from 10th June 2025 to 11th June 2025.
The targeted time of launch is 5:30 PM IST on 11th…
ఏంటీ 'యాక్సియమ్ మిషన్ 4'?: 'యాక్సియమ్ మిషన్ 4' అనేది యాక్సియమ్ స్పేస్ నిర్వహించే ప్రైవేట్ స్పేస్ మిషన్. ఇది మానవ అంతరిక్ష ప్రయాణ అవకాశాలను అందించడం, మొదటి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడంపై దృష్టి సారించిన ఓ ప్రైవేట్ సంస్థ. గతంలో 2022 ఏప్రిల్లో ఈ సంస్థ 'యాక్సియమ్ మిషన్ 1' (యాక్స్-1)తో తన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 'యాక్స్-2' (మే 2023), 'యాక్స్-3' (జనవరి 2024) కూడా విజయవంతంగా ISSకి చేరుకున్నాయి. ఈ మిషన్లు వాణిజ్య అంతరిక్ష ప్రయాణానికి కొత్త మార్గాలను తెరిచాయి.
'యాక్సియమ్ మిషన్ 4' లాంఛ్: ఈ 'యాక్సియమ్ మిషన్ 4' ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి 2025 మే 29న లాంఛ్ చేసేందుకు మొదట షెడ్యూల్ చేశారు. అయితే ఈ మిషన్ను జూన్ 10, 2025కి మార్చారు. ఇప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మిషన్లో భాగంగా స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగించనున్నారు. ఈ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ సారథ్యం వహించనున్నారు.
ఇందులో మొత్తం నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని 14 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఆ సమయంలో ఈ వ్యోమగాములు సైంటిఫిక్ స్టడీస్, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, కమర్షియల్ ఆపరేషన్స్ను నిర్వహించనున్నారు. దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు ఈ మిషన్ ద్వారా రోదసీయాత్ర చేయనున్నారు. శుభాంశు శుక్లాతో పాటు పోలాండ్, హంగేరీ నుంచి వ్యోమగాములు కూడా మొదటిసారిగా ISSకి వెళ్తున్నారు.
ఈ మిషన్లో శుభాంశు శుక్లా పాత్ర: ఈ 'యాక్సియమ్ మిషన్ 4' ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం భాగస్వామిగా మారింది. శుభాంశు శుక్లా ఈ అంతరిక్షయానం భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక ప్రధాన అడుగుగా మారనుంది. ఇస్రో 'గగన్యాన్' మిషన్లో భాగంగా భాగంగా ఆయన 'యాక్సియమ్ మిషన్ 4'కు ఎంపికయ్యారు. ఈ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయోగించనున్న స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు పైలట్గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి కూడా మంజూరు చేసింది.
ఇంతకీ ఏంటీ గగన్యాన్?: గగన్యాన్ అనేది భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష మిషన్. ఈ మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ భూమి అత్యల్ప కక్ష్య (LEO) కు పంపించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 'గగన్యాన్' మిషన్కు ముందు శుక్లా 'యాక్సియం మిషన్ 4' ప్రయాణం ఒక ముఖ్యమైన ఎక్స్పీరియన్స్ను అందించనుంది.
బ్యాకప్ వ్యోమగామిగా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్: శుభాంశు శుక్లా కోసం బ్యాకప్ వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను భారతదేశం నియమించింది. ఒకవేళ శుక్లా ఈ మిషన్కు వెళ్లలేకపోయినట్లయితే ఆయన స్థానంలో నాయర్ ISSకి చేరుకుంటారు. ఈ బ్యాకప్ ప్లాన్ అంతరిక్ష కార్యకలాపాలలో నిర్వహించే ఓ సాధారణ ప్రక్రియ. ఇది ఏదైనా ఊహించని పరిస్థితులు ఎదురైన సమయంలో మిషన్ మధ్యలో ఆగిపోకుండా ఉండటంలో సహాయపడుతుంది.
జపాన్కు మళ్లీ నిరాశే- ఐస్పేస్ మూన్ ల్యాండింగ్ ఫెయిల్!- కారణం ఇదే!!
గూగుల్ జెమినిలో 'షెడ్యూల్డ్ యాక్షన్స్' ఫీచర్- ఇకపై ఆటోమేటిక్గా పనులు పూర్తి!