SPADEX Second Docking: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ మిషన్ డాకింగ్ ప్రక్రియ రెండోసారి కూడా విజయంతంగా పూర్తయింది. ఈ మేరకు ఏప్రిల్ 20, 2025న రాత్రి 8:20 గంటలకు సెకండ్ టైమ్ కూడా SPADEX ఉపగ్రహాలు SDX 01, SDX 02లను డాకింగ్ చేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. దీనితో పాటు ఈ మిషన్లో భాగంగా 21 ఏప్రిల్ 2025న SDX 01 నుంచి SDX 02కు, SDX 02 నుంచి SDX 01కు పవర్ను బదిలీ చేసే ప్రక్రియ కూడా విజయవంతంగా జరిగినట్లు ఇస్రో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈసారి స్పేడెక్స్ మిషన్ డాకింగ్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్గా జరిగింది. 15 మీటర్ల దూరం నుంచి ప్రారంభించి ఉపగ్రహాల డాకింగ్ను విజయవంతంగా పూర్తి చేశారు. మొదటిసారి (జనవరి 16, 2025న) డాకింగ్ సమయంలో 3 మీటర్ల దూరంలో హోల్డ్ పాయింట్ తీసుకున్నారు. అయితే ఈసారి రెండు ఉపగ్రహాలను 15 మీటర్ల దూరంలో ఉంచి ఆటోమేటిక్ డాకింగ్కు ప్రయత్నించగా ఈ మొత్తం ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా సక్సెస్ అయింది.
రెండవసారి డాకింగ్ ఎలా విజయవంతమైంది?: ఇస్రో ఈ ప్రత్యేక మిషన్లో రెండోసారి ఆటోమేటిక్ డాకింగ్, పవర్ను బదిలీ చేసే విజయవంతమైన ప్రయత్నాన్ని తనతో పాటు SPADEX మిషన్ ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని అభివర్ణించింది. ఈ రెండవ డాకింగ్ ప్రయోగంలో ఒక ఉపగ్రహం హీటర్ ఎలిమెంట్ మరొక ఉపగ్రహం నుంచి అందుకున్న పవర్తో ఆపరేట్ అవుతుందని ఇస్రో తెలిపింది. ఈ పవర్ బదిలీ చేయడానికి దాదాపు 4 నిమిషాలు పట్టిందని, ఉపగ్రహాలు కూడా ఊహించిన విధంగానే పనిచేశాయని పేర్కొంది.
ఈ మిషన్లో రెండవ డాకింగ్ ప్రయోగానికి ముందు ఇస్రో విస్తృతమైన గ్రౌండ్ సిమ్యులేషన్స్, ఆన్-ఆర్బిట్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ సమయంలో మొదటిసారి చేసిన డాకింగ్, అన్డాకింగ్ ప్రక్రియ నుంచి పొందిన అనుభవాన్ని కూడా ఉపయోగించుకుంది. ఈ అన్ని ప్రిపరేషన్స్ కారణంగా రెండవ డాకింగ్ ప్రదర్శన విజయవంతమైందని, దీంతో తమ కాన్ఫిడెన్స్ కూడా గణనీయంగా పెరిగిందని ఇస్రో తెలిపింది.

SPADEX మిషన్లో రెండవ డాకింగ్ విజయవంతం కావడంపై భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం: ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్లో శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఆ తర్వాత ఈ మిషన్లో భాగంగా ఉపగ్రహాల మొదటి డాకింగ్ ప్రక్రియను జనవరి 16, 2025న విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో అన్డాకింగ్ ప్రక్రియ మార్చి 13, 2025న విజయవంతంగా పూర్తియింది.
ఇప్పుడు ఏప్రిల్ 20, 2025న రెండవసారి డాకింగ్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మిషన్ విజయంతో స్పేస్ డాకింగ్ వంటి క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా సాధించగల కొన్ని దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ స్పేడెక్స్ మిషన్ విజయం భారతదేశానికి భవిష్యత్తు ప్రయోగాల్లో ఉపయోగపడుతుంది.
స్పేడెక్స్ మిషన్ భవిష్యత్ ప్రయోగాలకు ఎలా ఉపయోగపడుతుందంటే?: అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను నిర్మించడానికి, ఉపగ్రహాల్లో ఇంధనం నింపి వాటి మెంటైనెన్స్ చూసుకోవడం కోసం, సపోర్టింగ్ శాంపుల్ రిటర్న్ మిషన్స్, అంతరిక్ష శిధిలాలను తగ్గించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ మిషన్ అంతరిక్ష అన్వేషణను మరింత సమర్థవంతంగా, స్థిరంగా చేస్తుంది.
సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన డాకింగ్ సామర్థ్యాలతో స్పేడెక్స్ మిషన్ భారతదేశాన్ని సన్నద్ధం చేయడమే కాకుండా, ఇస్రో మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇలా ఈ ప్రయోగం భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణ ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్- టెర్మ్ స్పేస్ ప్రాజెక్ట్ల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం.
సింపుల్గా చెప్పాలంటే జాబిల్లిపై వ్యోమగామిని దించడం, చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)ను నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే ఇస్రే ఈ స్పేడెక్స్ ప్రయోగాన్ని చేపట్టింది.
ఇంతకీ ఏంటీ స్పేడెక్స్ మిషన్?: ఇస్రో చేపట్టిన ఈ స్పేడెక్స్ మిషన్ SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు చిన్న ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. వీటిలో ఒక్కో శాటిలైట్ బరువు దాదాపు 220kg ఉంటుంది. ఈ జత ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరిగి, ఆ తర్వాత అత్యాధునిక సెన్సార్స్, అల్గారిథమ్లను ఉపయోగించి ఒకదానినొకటి గుర్తించి అనుసంధానం చేసేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఇటీవలే జనవరి 16న రోదసిలో మొదటిసారి స్పేడెక్స్ శాటిలైట్ల డాకింగ్ ప్రక్రియను పూర్తి చేయగా ఇప్పుడు రెండోసారి కూడా ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.
ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్ను కొన్ని దేశాలు మాత్రమే చేయగలిగాయి. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ప్రస్తుతం సక్సెస్ కావడంతో అటానమస్ డాకింగ్ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన భారత్ చేరింది. ఈ ప్రయోగంతో ప్రపంచంలో ఇంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్న్యూస్- స్పామ్ డిటెక్షన్ టూల్లో మరో రెండు ఫీచర్లు- ఇవి ఎలా ఉపయోగపడతాయంటే?
సూపర్ ఫీచర్లతో 'వివో T4 5G' స్మార్ట్ఫోన్- బడ్జెట్ ధరలోనే లాంఛ్!
ఆకాశం నవ్వటాన్ని ఎప్పుడైనా చూశారా?- ఏప్రిల్ 25న చూస్తే 'స్మైలీ ఫేస్'తో పలకరిస్తుంది కూడా!