ISRO Plans to Send Humans to Moon: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2040 నాటికి మానవులను చంద్రునిపైకి పంపాలని యోచిస్తోంది. ఈ మేరకు మంగళవారం తమిళనాడులోని తేని సమీపంలోని వాడపుడుపట్టిలోని ఒక ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. B.Ed శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఉపాధ్యాయులను ఆయన సత్కరించారు. కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన "చంద్రునిపైకి మానవులను పంపించే ప్రయోగాన్ని 2040 నాటికి షెడ్యూల్ చేశాం. అయితే ఇందుకోసం విస్తృతమైన పని చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇస్రో రెండవ ప్రయోగ వేదికను తమిళనాడులోని కులశేఖరపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం తమిళనాడు ప్రభుత్వం 95% భూమిని కేటాయించింది. డిసెంబర్ 2026 నాటికి కులశేఖరపట్నం నుంచి ఒక రాకెట్ ప్రయోగించనున్నారు. మూడవ ప్రయోగ వేదికను శ్రీ హరికోటలో ఏర్పాటు చేస్తారు" అని తెలిపారు.
"చంద్రయాన్-2 విజయవంతం కాలేదు. కారణం తెలుసుకోవడానికి 10 మంది శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేశాం. శాస్త్రవేత్తలు ఒక నెల పాటు రాత్రీ పగలు తేడా లేకుండా అహోరాత్రులు శ్రమించి 8 నెలలు పట్టే పనిని కేవలం ఒక నెలలోనే పూర్తి చేశారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా మేం చంద్రయాన్-3ని విజయవంతంగా అభివృద్ధి చేసి ప్రయోగించాం."
"తదుపరిది చంద్రయాన్-4 ప్రాజెక్ట్. దీని బరువు మొత్తం 9600 కిలోలు. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ చంద్రునిపైకి దిగి 14 రోజులు మాత్రమే అధ్యయనం చేసింది. కానీ చంద్రయాన్-4 చంద్రునిలోకి లోతుగా వెళ్లి, నమూనాలను తీసుకొని భూమికి తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అనంతరం చంద్రయాన్-5కు వెళ్లనున్నాం. దీన్ని చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ల్యాండర్ మాదిరిగానే రూపొందించనున్నాం. ఇది చంద్రునిపై దిగి 100 రోజుల పాటు వివరంగా అధ్యయనం చేస్తుంది. చంద్రయాన్-4, చంద్రయాన్-5 ప్రాజెక్టుల తర్వాతే మానవులను చంద్రునిపైకి పంపించనున్నాం" అని నారాయణన్ వెల్లడించారు.
రోదసి నుంచి డేగ కన్ను- రేయింబవళ్లు సరిహద్దులో కాపు కాసే 'రిశాట్-1B'- ప్రయోగం ఎప్పుడంటే?
మార్స్పై జీవం ఉందా?- పుర్రె ఆకారంలో మిస్టీరియస్ నిర్మాణాన్ని గుర్తించిన నాసా రోవర్
ఇస్రో నుంచి మరో అద్భుతం- ఇప్పుడు భారత్లో పిడుగుపాటుకు ముందుగానే సమాచారం!