WORKSHOP ON ARTIFICIAL INTELLIGENCE: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వర్క్షాప్నకు హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మిషన్ లెర్నింగ్పై సచివాలయంలోని ఐదో బ్లాక్లో నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్నకు సీఎం చంద్రబాబు సహా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. అదే విధంగా ఈ వర్క్షాప్నకు సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ సైతం హాజరయ్యారు.
పౌర సేవల్లో టెక్నాలజీ వాడకంపై చర్చ: వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ (WGDT) సీఈవో ప్రకాష్ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్తో సహా పలువురు నిపుణులు హాజరయ్యారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలించారు.
రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్క్షాప్: ఏయే విభాగాల్లో ఎటువంటి సాంకేతికను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృత పరచవచ్చు అనే దానిపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఏఐ, ఎంఎల్ (Machine Learning), డీఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వహించనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పలువురు నిపుణులు వివరించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్క్షాప్లో మొదటిరోజు కార్యదర్శులు, రెండో రోజు విభాగాధిపతులు హాజరుకానున్నారు.