Water Board Focus on Water Tanker Houses : హైదరాబాద్ మహానగరంలో నిత్యం వాటర్ ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్న వారిపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై వారంతా ఇంకుడుగుంతలు నిర్మించుకునే వరకు వదిలిపెట్టబోమని చెబుతోంది. అలాగే పదే పదే ట్యాంకర్ బుక్ చేస్తే మూడు రెట్లు అధికంగా వసూలు చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే సుమారు 40 వేల మందికి నోటీసులు ఇచ్చిన జలమండలి రెండు నెలల్లో వారంతా వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక సలహాలను ప్రజలకు ఉచితంగానే అందించనున్నట్లు జలమండలి వెల్లడించింది.
80 నుంచి 90 శాతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా : గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భజలాలు పెంచడమే లక్ష్యంగా జలమండలి ప్రత్యేక కార్యాచరణను మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచే నగరంలో నీటి మట్టాలు అడుగంటిపోవడం, బోరుబావులు ఎండిపోతుండటంతో పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇందుకోసం అక్కడి వారంతా వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతూ వేసవిని నెట్టికొస్తున్నారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, నిజాంపేట, ప్రగతినగర్, మాదాపూర్, మణికొండ, ఎస్సానగర్ ప్రాంతాల్లో ప్రతి వేసవిలో 42 వేల మంది వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నట్లు జలమండలి గుర్తించింది. నగరం మొత్తంలో ఈ ప్రాంతాలకే సుమారు 80 నుంచి 90 శాతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
ప్రస్తుతం రోజుకు 9 వేలకుపైగానే ట్యాంకర్ల సరఫరా చేస్తుండగా మార్చిలో ఏకంగా 10 వేలు దాటింది. ఏప్రిల్లో 15 వేల ట్యాంకర్లకు చేరువైంది. మే లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని జలమండలి చెబుతోంది. ఈ క్రమంలో నిత్యం వాటర్ ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్న వారిపై గతేడాది నవంబర్, డిసెంబర్లో సర్వే నిర్వహించిన జలమండలి వాటర్ ట్యాంకర్ వెళ్తున్న ఇళ్లల్లో ఇంకుడుగుంతలు లేవని నిర్ధారించింది. అందువల్లే వాళ్లు బోరుబావులు ఎండిపోయి గృహా అవసరాల కోసం కూడా జలమండలి నీటిపై ఆధారపడుతున్నట్లు గుర్తించింది. దీంతో జలమండలిపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితిని మార్చి భూగర్భజలాలు పెంచేందుకు 40 వేల ఇళ్లలో తప్పనిసరిగా ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. అందులో కొంత మంది మాత్రమే జలమండలి సూచనలతో ఇంకుడు గుంతలు నిర్మించుకోగా మరో 20 వేల మందికిపైగా అసలు ఆవైపే ఆలోచించలేదు.
దీంతో మళ్లీ ఈ వేసవిలో పరిస్థితి మొదటికొచ్చింది. నిత్యం ట్యాంకర్ల మీద ట్యాంకర్లు బుక్ చేస్తుండటంతో జలమండలి వారందరికి మరోసారి నోటీసులు జారీ చేసింది. రెండు నెలల్లో ఇంకుడు గుంతలు, ఇంజక్షన్ బోర్ వెల్స్ నిర్మించుకోవాలని, లేదంటే ట్యాంకర్కు రెట్టింపు డబ్బులు వసూలు చేయడంతోపాటు సరఫరాను నియంత్రిస్తామని హెచ్చరించింది. అయినా జలమండలి సూచనలను పెడచెవిన పెట్టడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ట్యాంకర్ డబ్బులు రెట్టింపు నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించామని, గ్రేటర్ పరిధిలో 200 నుంచి 300 చదరపు మీటర్లు ఆపై విస్తీర్ణం ఉండే ప్రతి నివాసానికి తప్పనిసరిగా ఇంకుడు గుంతల నిర్మించుకునేలా ప్రత్యేక డ్రైవ్కు సిద్ధమైనట్లు తెలిపారు. అలాగే పలు స్వచ్చంద సంస్థలతో సహకారంతో కమ్యునిటీ ప్రదేశాల్లో జలమండలి స్వయంగా 300 నుంచి 400 ఇంకుడుగుంతలు నిర్మించాలని భావిస్తోంది.
ప్రజలు అవగాహన పెంచుకోవాలి : అయితే 2016లో వివిధ కాలనీల అసోసియేషన్లతో అవగాహన ఒప్పందం కుదుర్చొని జలమండలి పెద్ద ఎత్తున ఇంకుడుగుంతలు తవ్వించింది. వాటి నిర్వహణ బాధ్యతను కాలనీ అసోసియేషన్ సభ్యులు విస్మరించడంతో అవన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయి. నిర్వహణ సరిగా చూసుకుంటున్న కాలనీల్లో ఇంకుడుగుంతల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రత తగ్గింది. మిగతా ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పక్కాగా జలమండలి ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇంకుడుగుంత అంటే చెత్తా చెదారాన్ని పారే ప్రాంతంగా కాకుండా వర్షపు నీళ్లను భూగర్భంలోకి మళ్లించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. అయితే ఎక్కడ ఇంకుడు గుంత తవ్వాలని, ఏ ప్రదేశంలో ఇంజక్షన్ బోర్ వెల్ వేయాలనే విషయాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు.
మండు వేసవిలో కూడా నీటి చింతను తీర్చుకోవచ్చు : నగరంలో ఎంత వర్షం కురిసినా ఆ నీరంతా భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. పడిన నీరంతా వరద రూపంలో కాలువల్లో కలిసిపోతుంది. ఆ నీటినంతా ఒడిసిపట్టి భూగర్భంలోకి మళ్లిస్తే నీటి కష్టాలతోపాటు రహదారులపై వరద ప్రవాహాన్ని కట్టడి చేయవచ్చని జలమండలి సూచిస్తోంది. కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఇంకుడుగుంతలను నిర్మించుకోవచ్చని, వాటి వల్ల మండు వేసవిలో కూడా నీటి చింతను తీర్చుకోవచ్చని చెబుతోంది.