Vizianagaram Terror Case Updates : విజయనగరంలో నమోదైన ఉగ్ర కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ బోయిగూడ వాసి సమీర్ను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఇద్దరూ విశాఖ జైలులో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆరుగురు వ్యక్తులతో ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని సిరాజ్, సమీర్తోపాటు టీమ్లో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని సమాచారం. హైదరాబాద్లో మూడు రోజులపాటు ఆరుగురు సభ్యుల ముఠా కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై చర్చించడం, బాంబులు తయారుచేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.
మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలిచ్చారని సమాచారం. పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని ఆన్లైన్లో సిరాజ్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న పోలీసులు అరెస్ట్ సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ సీజ్ చేసినట్లు సమాచారం.
Vizianagaram Terror Plot Case : పదో తరగతి చదివి సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్గా చేస్తున్న సమీర్ తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. సిరాజ్, సమీర్ ఫోన్లో కీలక సమాచారం సేకరించిన పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు. ఉగ్ర సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రల కోసం వీరిని నిర్దేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు కలిసి అల్హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థ – అహిం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈనెల 21, 22 తేదీల్లో విజయనగరంలో పేలుడుపై రిహార్సల్ చేయాలని హ్యాండ్లర్ నిందితులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. రిహార్సల్ విజయవంతమైతే ఎక్కడ పేల్చాలో చెబుతామని వారికి చెప్పినట్లు సమాచారం. గతంలోనూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై సమీర్ను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిసింది. అదే సమయంలో సమీర్కు కాంటాక్టులో ఉన్నవారి గురించి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
గత ఆరు నెలల్లో సిరాజ్ రెండు, మూడు సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్టు ట్రావెల్ హిస్టరీ కూడా పోలీసుల చేతిలో ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటిపై నిర్ధారణ కోసం ఇద్దరిని కస్టడీకి తీసుకుంటే పేలుళ్ల కుట్రకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పేలుడు పదార్థాల సేకరణ, తయారీ కోసం నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు.
కస్టడీకి కోరనున్న పోలీసులు : ఇప్పుటికే ఇద్దరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దృష్టి సారించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు. సిరాజ్, సమీర్ని పోలీసులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు విజయనగరం టూటౌన్ స్టేషన్కు వచ్చి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఆరు నెలల్లో మూడుసార్లు సౌదీకి సిరాజ్ - కస్టడీకి కోరిన పోలీసులు
'బోర్డర్లో మాధవరం సైనికులు' - ఉగ్గుపాలతో దేశభక్తి నూరిపోసిన మాతృమూర్తులు