పవన్ కాన్వాయ్ వల్లే విద్యార్థులు పరీక్షకు వెళ్లలేకపోయారా - విశాఖ సీపీ ఏమన్నారంటే?
పవన్ కల్యాణ్ కాన్వాయ్పై విద్యార్థులు చేసిన ఆరోపణలపై స్పందించిన విశాఖ సీపీ - విశాఖలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 8, 2025 at 10:20 PM IST
Vizag CP Comments on Pawan Kalyan Convoy Issue: విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణంగా జేఈఈ (మెయిన్) పరీక్షలకు హాజరు కాలేకపోయామంటూ పెందుర్తిలో కొందరు విద్యార్థులు చేసిన ఆరోపణలపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ స్పందించారు. పవన్ కాన్వాయ్ వల్ల విద్యార్థులకు ఆలస్యమైందనడం అవాస్తవమని అన్నారు.
డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీపీ తెలిపారు. విద్యార్థులే ఆలస్యంగా వచ్చి పోలీసులపై నిందలు వేస్తున్నారని సీపీ అన్నారు. సీసీ ఫుటేజ్, ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల సెల్ఫోన్లను ట్రాక్ చేశామని అలానే పోలీసుల వల్ల విద్యార్థులకు ఎక్కడా ఇబ్బంది కలగలేదని వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లాకే డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్లిందని సీపీ తెలిపారు.
విచారణ చేపట్టాలని ఆదేశించిన పవన్: మరోవైపు, తన కాన్వాయ్ కారణంగా పెందుర్తిలో విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవలేకపోయారనే వార్తలపై విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే. కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ను నిలిపారని పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులు వెళ్లే సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితేంటని సర్వీసు రోడ్లలో ట్రాఫిక్ను నియంత్రించారా లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖ పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తాజాగా ఈ వివరాలను వెల్లడించారు.

