VIJAYAWADA MACHILIPATNAM HIGHWAY: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65ని (NH65) ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కార్యాచరణ ఆరంభించింది. నేషనల్ హైవేలను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకూ విస్తరిస్తారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు.
విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి 63 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ORR) కంకిపాడు-ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం దగ్గరలో క్రాస్ అవుతుంది. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ మేర ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల మార్గాన్ని 6 వరుసలుగా విస్తరిస్తారు. మచిలీపట్నం వద్ద ఒంగోలు-కత్తిపూడి నేషనల్ హైవే రెండు వరుసలుతో ఉంది.
ఇందులో మాచవరం రైస్మిల్లు వరకు 4 కిలోమీటర్లు నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. మాచవరం రైస్ మిల్లు వద్ద నుంచి పోర్టుకు 3.7 కిలోమీటర్లను నాలుగు వరుసలతో కొత్తగా రహదారిని నిర్మిస్తారు. వీటిలో ఆరు వరుసలుగా విస్తరించనున్న 44 కిలో మీటర్లతో పాటు 3.7 కిలో మీటర్లు మేర నాలుగు వరుసల హైవే నిర్మాణాన్ని NHAI చేపడుతుంది. ఒంగోలు-కత్తిపూడి హైవేలో 4 కిలోమీటర్ల మేర విస్తరించే పనులను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. మొత్తంగా ఈ రహదారికి చెందిన DPR తయారీ బాధ్యత చైతన్య, ఎంఎస్ పార్క్ జేవీ సంస్థకు అప్పగించారు.
విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న హైవేలో ORR క్రాస్ అయ్యే ప్రాంతం నుంచి మాత్రమే రహదారిని విస్తరించనున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పోరంకి, పెనమలూరు జంక్షన్, కంకిపాడు మీదుగా చలివేంద్రపాలెం వరకు 19 కిలోమీటర్ల మేర ఉన్న మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించడంపై ఇంకా స్పష్టత లేదు. విజయవాడ పరిధిలోనే వాహన రద్దీ ఈ పరిధిలోనే ఎక్కువగా ఉంటుంది. హైవే నుంచి పోర్టు కనెక్టివిటీకి NHAI ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా ఓఆర్ఆర్ క్రాస్ అయ్యే ప్రాంతం నుంచే పోర్టుకు అనుసంధానంపై ప్రస్తుతం దృష్టిపెట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
గుడ్న్యూస్ - అమరావతి-హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి గ్రీన్సిగ్నల్