Corruption in APSRTC : ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం 10,000ల బస్సులు పరుగులు పెడుతుంటాయి. 50,000 మంది సిబ్బంది ఉన్నారు. కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం, పెద్ద ఎత్తున విడిభాగాల కొనుగోలు వంటి ఆర్థిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూసేందుకు, భద్రతాపరమైన చర్యల కోసం ఆర్టీసీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం (వీఅండ్ఎస్వో) ఉంది.
అయితే రాష్ట్ర స్థాయి అధికారులే కాకుండా, జోన్కు ఓ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి (వీఅండ్ఎస్వో) ఉంటారు. జిల్లాకు ఒకరు చొప్పున సబ్ ఇన్స్పెక్టర్లు, డిపోలకు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో ఈ వ్యవస్థ ఉంది. ఇటువంటి వీఅండ్ఎస్వోలో కొందరు అధికారుల వసూళ్ల పర్వం తారస్థాయికి చేరిందనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రతి నెలా ఇవ్వాల్సిందే : ఓ జోన్ వీఅండ్ఎస్వో సీమ సిబ్బందిని వేధించి, ఎక్కువగా వసూళ్లు సాగిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏదైనా జిల్లాలో డిపోల తనిఖీకి వెళ్తే హోటల్ గది ఏర్పాటు నుంచి సకల సదుపాయాలూ సిబ్బంది చూసుకోవాల్సిందే. ఆ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు ఎటువంటి సెలవు కావాలన్నా ఆయనకు డబ్బులు ఇస్తేనే లభిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఓ కండక్టర్ చనిపోతే, ఆయన భార్యకు ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చారు. తర్వాత ఆమె మరొక అద్దె బస్ డ్రైవర్ను పెళ్లి చేసుకున్నారు.
దీంతో ఆమె ఉద్యోగం తీయించేస్తానంటూ బెదిరించి, ఆ అధికారి లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే పదవీవిరమణ పొందిన ఓ డిపో ఏఎస్ఐ మొన్నటి వరకు ప్రతి నెలా నిత్యావసర సరకులన్నీ కొని వీఅండ్ఎస్వో ఇంటికి పంపేవారు. తాజాగా వేధింపులు భరించలేకపోతున్నానని, తాను చనిపోతే ఆ అధికారిదే బాధ్యత అని ఓ హెడ్కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు ఫోన్పే ద్వారా ఎలా డబ్బులు చెల్లించేవారో అందులో పేర్కొన్నారు.
రాష్ట్రం నడిబొడ్డున ఉన్న మరో జోన్ అధికారీ వసూళ్లలో ఇతరులతో పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఆయన మహిళా సిబ్బందిని వేధిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన బస్టాండ్లో తరచూ భద్రతా వైఫల్యాలను, ఆకతాయిల ఆగడాలనూ ఆయన పెద్దగా పట్టించుకోరు.
పోలీస్ బాస్లు లేకపోవడంతోనే : గతంలో ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం డైరెక్టర్ పోస్టుల్లో ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి ఉండేవారు. జోన్లలో వీఅండ్ఎస్వోలుగా డీఎస్పీలు ఉండేవారు. దీంతో ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది మంచిగా పనిచేసేవారు. 2020లో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు విజిలెన్స్ డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి అవసరం లేదని సిఫార్సు చేశారు. ఆ బాధ్యత ఆర్టీసీలోని పరిపాలన విభాగం చూసే ఈడీకి ఇచ్చారు. జోన్లలో డీఎస్పీలకు బదులు ఆర్టీసీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులకు బాధ్యతలను అప్పగించారు.
అప్పటి నుంచి నిఘా వ్యవస్థ పూర్తిగా దారితప్పింది. ఆర్టీసీకి సంబంధించి ప్రతి విషయంలో కీలకంగా వ్యవహరించాల్సిన నిఘా విభాగం నిద్రావస్థలో ఉంది. రాష్ట్రస్థాయిలో అదనపు ఎస్పీ అధికారి నాలుగేళ్లకు పైగా ఈ పదవిలోనే ఉన్నారు. ఆ అధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్రమంతటా ఆ విభాగం పనితీరు తీసికట్టుగా మారిందనే విమర్శలున్నాయి.
- ఒకరోజు సెలవు కావాలంటే రూ.1000. ఎన్ని రోజులు సెలవు కావాలంటే అన్ని వేల రూపాయలు ఇవ్వాల్సిందే.
- ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, దానికో ధర చెల్లించాల్సిందే.
- విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై ఫిర్యాదు వచ్చినా, దానిపై విచారణ పేరిట హడావుడి చేసి, దానికి ఓ రేటు మాట్లాడుకుంటారు.
- ఇలాంటివి వసూళ్లు చేసేందుకు ప్రతి జిల్లాలో ఇద్దరుకి బాధ్యత ఇచ్చారు. వసూళ్ల సొమ్మంతా నేరుగా ఫోన్పే ద్వారా అసలు వారికి చేరిపోతూ ఉంటుంది.
- ఇదంతా ఆర్టీసీలోని నిఘా, భద్రతా విభాగంలో కొంతమంది అధికారుల వసూళ్ల పర్వం. కంచే చేను మేసిందనే చందంగా సంస్థలో తప్పులు జరగకుండా చూడాల్సిన నిఘా అధికారుల్లోనే కొంతమంది పెడదారి పట్టారు. ఉన్నతస్థాయి అధికారి మద్దతు ఉండటంతోనే వీరి దందాకు అడ్డులేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
త్వరలోనే ఏపీకి 750 విద్యుత్ బస్సులు - అమరావతికి 50, విశాఖకు 100