ETV Bharat / state

మేమేం పాపం చేశాం - తల్లిదండ్రుల మరణంతో రోడ్డుపాలైన చిన్నారులు

అప్పుల బాధతో భర్త, తట్టుకోలేక భార్య ఆత్మహత్య - ఏ అండా లేక అనాథలుగా మారిన పిల్లలు - చిన్న వయసులోనే చెల్లి ఆలనాపాలనా చూసుకుంటున్న బాలుడు

Two Children Orphaned After Her Mother Died
Two Children Orphaned After Her Mother Died (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 17, 2025 at 7:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Two Children Orphaned After Their Mother Died : వారిది అన్యోన్య దాంపత్యం, ఆస్తిపాస్తులు లేకపోయినా భార్య, ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా చూసుకునే భర్త. రెక్కల కష్టంతో ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్న ఆ కుటుంబాన్ని విధి వంచించింది. వ్యవసాయం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. భూమితల్లినే నమ్ముకున్న ఆ రైతుకు అప్పులే మిగిలాయి. లక్షలాది రూపాయల అప్పులభారం మోయలేక గతేడాది భర్త ఉరి వేసుకుని చనిపోయాడు. సరిగ్గా భర్త సంవత్సరీకం రోజే బిడ్డలతో సహా చనిపోవాలని భార్య నిర్ణయించుకుంది. నిర్మానుష్య ప్రాంతానికి పిల్లలను తీసుకెళ్లి పెట్రోలు పోసుకుంది. అదృష్టవశాత్తు చిన్నారులు భయపడి పరిగెత్తుకురాగా ఆ తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది.

భర్త మరణంతో కుంగిపోయిన భార్య : పల్నాడు జిల్లా వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. రైతులు పెద్దఎత్తున మిరప, పత్తి సాగు చేస్తుంటారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, గిట్టుబాటు ధరలు రాక ఏటికేడు నష్టాలు వస్తున్నా భూమి తల్లినే నమ్ముకుని సేద్యం చేసిన రైతుల్లో మాచర్ల మండలం కొత్తపల్లికి చెందిన బ్రహ్మారెడ్డి ఒకరు. పెద్దఎత్తున అప్పులు చేసి వ్యవసాయం చేసినా దండగే రావడంతో అప్పుల భారంతో గతేడాది జులై 12న ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త, పిల్లలే ప్రపంచంగా బతికిన బ్రహ్మారెడ్డి దూరం కావడంతో భార్య సుబ్బమ్మకు ఒక్కసారిగా శూన్యం ఆవహించింది. భర్తతో పాటే తాను తనువు చాలించాలనుకున్నా ఇద్దరు బిడ్డలు అఖిల్‌రెడ్డి (12), లక్ష్మీ కార్తీక (11) కోసం జీవిస్తోంది. అయితే భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన సుబ్బమ్మ ఎప్పుడూ తానూ చనిపోతానని ఇతరులతో చెబుతూ ఉండేది.

పిల్లల ఎదుటే నిప్పంటించుకున్న తల్లి : భర్త మరణంతో మానసికంగా కుంగిపోయినా ఏడాదిపాటు కష్టనష్టాలు తట్టుకుని సుబ్బమ్మ ఇద్దరు బిడ్డలతో జీవితాన్ని నెట్టుకొచ్చింది. అయితే భర్త లేని లోటు ఆమెను వెంటాడుతూనే ఉంది. అప్పులు తీర్చే మార్గం లేక బిడ్డలను పోషించే స్థోమత లేక భర్త సంవత్సరీకం రోజే (జులై 12) చనిపోవాలని భావించింది. తాను కూడా చనిపోతే బిడ్డలు ఒంటరివాళ్లై పోతారని భావించి వాళ్లను కూడా తనతోపాటే తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకుంది.

బిడ్డలకు ఈ విషయం చెప్పకుండా నాన్న చనిపోయిన రోజు కదా గుడికెళ్దామని తీసుకెళ్లింది. పిల్లలకు తెలియకుండా మాచర్లలో ముందుగానే పెట్రోలు కొనుగోలు చేసిన సుబ్బమ్మ గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంది. తిరుగు ప్రయాణంలో పిల్లలను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఒక్కసారిగా తనపై పెట్రోలు పోసుకుంది. పిల్లలు అఖిల్‌రెడ్డి, లక్ష్మీకార్తీకపైనా పోసే ప్రయత్నం చేయగా వారు భయంతో పరుగులు తీశారు. సుబ్బమ్మ మాత్రం నిప్పంటించుకోవడంతో సజీవ దహనమైంది.

ఆర్తనాదాలు పెట్టిన పిల్లలు : తండ్రి మరణం చూసిన చిన్నారులు ఏడాది తిరక్కుండానే కన్న తల్లి కళ్లెదుటే కాలిపోతుంటే తట్టుకోలేక ఆర్తనాదాలు చేశారు. తల్లిని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. సాయం చేసే వారి కోసం వెతుకుతూ అటు, ఇటు పరుగులు తీశారు. ఈ క్రమంలో వారికి ఓ సెక్యురిటీగార్డు కనిపించగా జరిగిందంతా చెప్పి బావురమన్నారు. అతను పోలీసులకు సమాచారమిచ్చి వచ్చి చూసేసరికి సుబ్బమ్మ పూర్తిగా సజీవదహనమైంది.

ఏడాది క్రితం తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయి ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. కష్టాలకు ఎదురొడ్డి నిలవలేక తల్లిదండ్రులు తమదారి తాము చూసుకోగా చిన్నారులు మాత్రం ఏ అండా లేక రోడ్డుపాలయ్యారు. నిండా 12 ఏళ్లు కూడా లేని ఆ బాలుడే చెల్లి ఆలనాపాలనా చూసుకోవాలి. ఇంత చిన్నవయసులోనే వారికి జీవితానికి సరిపడినంత కష్టం వచ్చిపడింది.

చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడని చంపారు - శవాన్ని పూడ్చేశారు!

ప్రిన్సిపల్​ను కత్తితో పొడిచి చంపిన విద్యార్థులు- కటింగ్ చేసుకుని స్కూల్​కు రమ్మనందుకే!