Tirumala Devotees Alipiri Base Camp : తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. అమరావతిలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించడంతో వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
గతంలో దేవలోక్, ఎంఆర్కేఆర్, ఒబెరాయ్ హోటల్ సంస్థలకు కేటాయించి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రద్దు చేసిన 35 ఎకరాలను బేస్ క్యాంప్ నిర్మాణానికి వినియోగించాలని యోచిస్తున్నారు. సుమారు 25,000ల మందికి ఇక్కడ వసతి కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రత ఉండేలా ఏర్పాట్లు ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారు.
Chandrababu on TTD Services : ప్రస్తుతం కొండపై 55,000ల మంది యాత్రికులను సర్దుబాటు చేయవచ్చు. అంతకు మించి భక్తులు వస్తున్నందున బేస్ క్యాంప్ ఎంతో ఉపయోగపడనుంది. ఇది అందుబాటులోకి వస్తే తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తదు. నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ఎవరైనా భక్తులు వాహనాల్లో బేస్ క్యాంప్నకు వస్తే ఇక్కడే వాహనాన్ని పార్క్ చేసుకుని విద్యుత్ బస్సుల్లో కొండపైకి వెళ్లొచ్చు. తద్వారా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది.
గతంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) మాస్టర్ప్లాన్లో ఈ అంశాన్ని పొందుపరిచింది. దీన్ని ప్రస్తుతం ఆచరణలోకి తీసుకురానున్నారు. మరోవైపు తిరుమల దార్శనికపత్రం (విజన్ డాక్యుమెంట్)- 2047 రూపకల్పనకు 18 అంశాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. తిరుమలలో ఫుట్పాత్లు కొన్నిచోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి. వీటిని కూడా ఓ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయనున్నారు. రాంభగీచా, బాలాజీ బస్టాండ్లను పునర్నిర్మించనున్నారు. అవసరమైతే వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. విజన్ డాక్యుమెంట్ టెండర్ను ఓ బహుళ జాతి సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది.మరోవైపు టీటీడీ 60 అనుబంధ ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుంది.
వేసవిలో శ్రీవారి సామాన్య భక్తులకు ప్రాధాన్యత - వారి సిఫారసు లేఖలు రద్దు