TTD Not Issuing Divya Darshan Tokens at Alipiri Footsteps : శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వస్తున్న వారికి గతంలో ఉన్న ప్రయోజనాలను పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు. వేసవి నేపథ్యంలో రెండు నడకదారుల్లో వచ్చేవారి కోసం దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వడంతో పాటు కోటా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీవారి భక్తులకున్న సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా ఒక్కోటి రద్దు చేస్తూ వచ్చారు.
కరోనా సాకుతో దివ్యదర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు. తదనంతరం పునరుద్ధరిస్తామని చెప్పినప్పటికీ, అలిపిరి నడకదారిలో చిరుత దాడిలో ఓ బాలిక మృతి చెందడంతో ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టారు. చంద్రగిరి వైపున ఉన్న శ్రీవారిమెట్టు మార్గంలో 2,100 మెట్లు ఉండగా, గంటన్నరలో తిరుమలకు చేరుకోవచ్చు.
3,650 మెట్లున్న అలిపిరి దారిలో ఆలయాలు, గోపురాలు, లోయలు, కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జింకల పార్కు, టీటీడీ ప్రదర్శనశాల వంటివి భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతాపరంగానూ ఇటీవల సౌకర్యాలు పెరిగాయి. ఈ మార్గంలో సాధారణ రోజుల్లో సుమారు 8 వేల మంది, రద్దీ సమయంలో 15 వేల మంది నడిచి వస్తున్నా వారికి అదనపు ప్రయోజనాలు కల్పించడం లేదు.
గతంలో అలిపిరి నడకదారిలో 14 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 6 వేల చొప్పున నిత్యం 20 వేల దివ్యదర్శన టోకెన్లు ఇచ్చేవారు. వైకుంఠం క్యూలైన్లలోనూ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్) కోటా తర్వాత దివ్యదర్శనం భక్తులకు ప్రాధాన్యముండేది. పైగా ఉచిత లడ్డూ ప్రసాదం అందేది.
తిరుమలకు పెరిగిన భక్తులు - అలిపిరి వద్ద భారీగా వాహనాల రద్దీ
ఒక్క మార్గంలోనే అవీ అరకొరే : కొవిడ్ తర్వాత అలిపిరి దారిలో దివ్యదర్శనం టోకెన్ల జారీ రద్దు కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో వీటిని పునరుద్ధరిస్తామని టీటీడీ ప్రకటించింది. గాలిగోపురం వద్ద స్కానింగ్ కేంద్రాన్ని సిద్ధం చేసింది. కారణం వెల్లడించకుండా, ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. దివ్యదర్శన టోకెన్ల కోసం భక్తులు శ్రీవారి మెట్టుమార్గం వరకూ వెళ్లాల్సి వస్తుంది. దీన్ని కొందరు టాక్సీ, ఆటోడ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు.
ఒక్కో భక్తుడి నుంచి రూ.500-1,000 వరకు దండుకుంటున్న వైనంపై చంద్రగిరి ఠాణాలో కేసులు సైతం నమోదయ్యాయి. అక్కడ కూడా రోజుకు సగటున 3 వేల టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో మధ్యాహ్నం తర్వాత వచ్చిన భక్తులకు అవీ మిగలడం లేదు. వారు అటు తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లు తీసుకోలేక, ఇటు మెట్లమార్గంలో దివ్యదర్శనం టోకెన్లూ దక్కించుకోలేక సర్వదర్శనానికి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడం, వేసవి రద్దీ దృష్ట్యా రెండు మార్గాల్లోనూ దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.
తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం - సీసీ కెమెరాలో దృశ్యాలు