Plastic Water Bottle Harms Health : వేసవిలో దాహం వేయగానే నీటి సీసాలను కొనుక్కుంటాం. ఆ సమయంలో అవి మంచివా, కాదా అని ఆలోచించే వారు తక్కువే. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే అదనుగా బ్రాండ్ లేని, స్థానికంగా తయారీ చేసే నీటి సీసాలను అంటకట్టేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తుంటారు. కల్తీ నీటిని తాగితే ఆరోగ్యం దెబ్బ తింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ల నుంచి లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపారులు నిబంధనల ప్రకారం ఐఎస్ఐ మార్కు ఉన్న నీటి సీసాలే విక్రయించాలి.
నీటి సీసాల తయారీదారులు జాతీయ గుర్తింపు పొందిన టెస్టింగ్ లాబోరేటరీ (ఎన్ఏబీఎల్) అనుమతి తప్పనిసరిగా పొందాలి. సోడియం, మెగ్నీషియం, కాల్షియం తదితర ఏ మేర వినియోగిస్తున్నారన్న విషయం అనుమతి కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఆ రిపోర్టు వ్యాపారుల వద్ద సైతం ఉండాలి.
చర్యలు తప్పవు : తాగునీటి సీసాల విక్రయంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సంగారెడ్డి ఆహార పరిరక్షణ అధికారిణి అమృత శ్రీ తెలిపారు. నాచు తేలి, దుర్వాసన వచ్చినవి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లూజ్గా అమ్మినా నాణ్యత పాటించాల్సిందేని తెలిపారు. ఎక్కడైనా అనుమతి లేకుండా తయారు చేసినా, అమ్ముతున్నా తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
అనేక ఆరోగ్య సమస్యలు : కాలం చెల్లిన నీటి ప్యాకెట్లను సరఫరా చేస్తుంటారని ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్ కుమార్ తెలిపారు. ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయని నీటిని తాగితే ఆరోగ్యం దెబ్బ తింటుందని, వాంతులు, విరేచనాలు, తలనొప్పితో పాటు జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయని వివరించారు. టైఫాయిడ్ వచ్చే అవకాశమూ ఉందని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరించారు.
ఆ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా? - కిడ్నీ, గుండెకు ప్రమాదమేనంటున్న నిపుణులు