Drug Racket in Vijayawada City: విజయవాడ నగరంలో చాపకింద నీరులా మత్తు మందు వాడకం విస్తరిస్తోంది. గత రెండున్నరేళ్లలోనే పలుసార్లు ఎండీఎంఏ (మిథలీన్ డైఆక్సీ మెటామ్ఫెటామిన్) దొరికింది. ముఖ్యంగా యువత దీనిని వినియోగిస్తూ పెడదోవ పడుతోంది. కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి బెంగళూరు, దిల్లీ నుంచి ఎండీఎంఏను నగరానికి తీసుకొచ్చి విక్రస్తున్నారు. రవాణాపై పోలీసు నిఘా లేదు. ముందస్తు సమాచారం ఉంటేనే దాడి చేసి పట్టుకుంటున్నారు. మిగిలిన సందర్భాల్లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా అవుతోంది. తాజాగా దిల్లీ నుంచి పార్సిల్ ద్వారా ఎండీఎంఏను తెప్పిస్తూ ముగ్గురు పోలీసులకు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం.
దిల్లీ, బెంగుళూరు నుంచి దిగుమతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో చదువుతుంటారు. వీరిలో కొందరు మత్తుకు అలవాటుపడుతున్నారు. తమ ఆర్థిక అవసరాలకు దీనిని సరఫరా చేస్తున్నారు. వీరు బాగా నమ్మకస్థులకే ఇస్తుంటారు. నిఘా కళ్లుగప్పి గుట్టుగా తీసుకొస్తున్నారు. దిల్లీ, బెంగళూరు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
నగరంలో పట్టుబడుతున్న ఎండీఎంఏను బెంగళూరులో కొన్ని ముఠాలు పెద్దఎత్తున తయారు చేస్తున్నాయి. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోంది. అక్కడ కొని బస్సులు, రైళ్ల ద్వారా విజయవాడకు తీసుకొస్తున్నారు. కొరియర్ పార్సిల్ ద్వారా సైతం తీసుకొస్తున్నారు. గంజాయి కంటే ఎండీఎంఏను తేలికగా నగరానికి తీసుకురావచ్చని, లాభాలు అధికంగా ఉంటాయని పలువురు దీనిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. డ్రగ్ను విక్రయించేందుకు పెద్ద నెట్వర్క్నే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కువ మంది విద్యార్థులే ఈ మత్తు ఊబిలో కూరుకుపోతున్నారు.
పార్శిళ్లు, బస్సుల ద్వారా ఎగుమతులు: గతేడాది గుంటూరుకు చెందిన సాయి మస్తాన్రావు స్నేహితులు దిల్లీ వెళ్లి 35 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి వస్తూ విజయవాడలో రైలు దిగి బయటకు వస్తుండగా సంవత్సరం క్రితం జూన్లో విజయవాడ సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో గుంటూరు నగరానికి చెందిన కాంతికిరణ్, ఖాజామొహిద్దీన్, నాగూర్ షరీఫ్లను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సాయిమస్తాన్రావునూ అరెస్టు చేశారు.
- కాకినాడకు చెందిన సతీశ్ బెంగళూరు నుంచి కాకినాడకు 46 గ్రాముల ఎండీఎంఏ ను రవాణా చేస్తూ విజయవాడ బస్టాండ్లో పోలీసులకు చిక్కాడు. బెంగళూరు నుంచి తూర్పుగోదావరికి ఈ విధంగా తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
- రెండేళ్ల కిందట బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రైవర్ ద్వారా బ్యాగ్లో కిలో ఎండీఎంఏ చేరింది. నగరానికి చెందిన సుహాస్, కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ సాయి, హర్షవర్దన్, శశిలను అరెస్టు చేశారు. వీరంతా జైలుకు వెళ్లొచ్చినా తమ పద్ధతి మార్చుకోలేదు. సుహాస్ మత్తు మందు తీసుకొచ్చి విక్రయిస్తుండగా పోలీసులకు దొరికాడు.
- విజయవాడ నుంచి రెండున్నరేళ్ల క్రితం ఓ పార్సిల్లో 4.5 కిలోల ఎఫిడ్రిన్ను పట్టుచీరల మధ్యలో పెట్టి విదేశాలకు పంపించారు. ఇక్కడ పెద్దగా నిఘా ఉండదని చెన్నైకు చెందిన వ్యక్తి విజయవాడ వచ్చి ఆస్ట్రేలియాకు పంపించాడు. అది పొరపాటున కెనడాకు వెళ్లడంతో ముఠా కార్యకలాపాలు వెలుగుచూశాయి
- తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన అభిషేక్ బెంగళూరు నుంచి ఎండీఎంఏ తీసుకొస్తూ విజయవాడ బస్స్టేషన్లో కృష్ణలంక పోలీసులకు దొరికాడు. మరో పది మంది స్నేహితులు మత్తుకు అలవాటు పడ్డారు. బెంగళూరులోని ఆయన స్నేహితుడు డేనియల్ రాజు నుంచి రూ.10వేలకు 3.45 గ్రాములు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెెల్లడైంది.
కోరుకొన్న చోటకే కొరియర్లో మత్తు - కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠా అరెస్టు
యథేచ్ఛగా నిషేధిత ఇంజక్షన్ల వినియోగం - పశ్చిమబెంగాల్, ఒడిశాల నుంచి భారీగా దిగుమతి