అమ్మా నాన్న పిలుపు కోసం - వేల సంఖ్యలో దరఖాస్తులు, వందల్లో చిన్నారులు
చిన్నారుల దత్తతకు వేల మంది ఎదురుచూపులు - దత్తత తీసుకోవాలంటే దంపతులిద్దరి వయసు కలిపి 85 ఏళ్లు - ఇప్పటికి తెలంగాణ నుంచి 267 మంది దత్తతకు వెళ్లిన చిన్నారులు

Published : July 21, 2025 at 4:40 PM IST
Await Adoption of Children : 'అమ్మా నాన్నా' అనే పిలుపు కోసం పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న వారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా వీరు వేలల్లో ఉండగా దత్తతకు అర్హులైన పిల్లలు వందల్లోనే ఉన్నారు. అలాగే మరోవైపు చట్టబద్ధమైన దత్తత గురించి తెలియక కొందరు దళారుల చేతుల్లో మోసపోతున్న ఘటనలు తరచుగా పెరుగుతున్నారు.
దంపతుల వయసు, వైవాహిక బంధం ఆధారంగా చిన్నారులను దత్తతకు ఇస్తారు. దత్తతకు కనీసం రెండేళ్లపాటు ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా జీవిస్తున్నావారే అర్హులు. రెండేళ్లలోపు ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే దంపతులిద్దరి వయసు కలిపి 85 ఏళ్లు, సింగిల్ పేరెంట్ అయితే మహిళలు మాత్రమే అర్హులు కాగా వారికి 40 ఏళ్లుకు మించకూడదు.
కేంద్రీయ దత్తత ఏజెన్సీ (కారా) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2,690 మంది చిన్నారులు సంరక్షణ గృహాల్లో ఉన్నారు. వీరిలో 967 మంది సాధారణ 1,723 మంది దివ్యాంగ పిల్లలున్నారు. వారిలో దత్తత కోరుకుంటున్నవారు 34,009 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారిలో భారతీయులు 33,123 కాగా మిగతావారంతా ఎన్నారైలు, విదేశీ భారతపౌరులు, విదేశీయులున్నారు.
ప్రభుత్వ లక్ష్యం : తెలంగాణ రాష్ట్రం నుంచి 2024-25లో 267 మంది చిన్నారులు దత్తతకు వెళ్లారు. వీరిలో దేశీయంగా తీసుకునే దత్తత కోసం 250 మంది, విదేశాల దత్తత కోసం 17 మంది ఉన్నారు. గత ఏడాదిలో తొలిసారిగా దత్తతల్లో బాలుర సంఖ్య పెరిగింది. 2025-26లో మొత్తం 300 మంది చిన్నారుల్ని దత్తతకు పంపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 200 మంది వరకు పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 2 వేల మంది దత్తత కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నట్లు శిశు సంక్షేమవర్గాలు వెల్లడించాయి.
దత్తతలో పెరుగుతున్న మగపిల్లల సంఖ్య : రాష్ట్రంలో చిన్నారుల దత్తతలో మగపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. పలువురు మాతృమూర్తులు అసహాయ పరిస్థితులు, పేదరికం, గృహహింస ఇలా పలు కారణాలతో పుట్టిన పిల్లలను వెంటనే కాదనుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సామాజిక రుగ్మతలు, దురాచారాలతో చెడు అలవాట్ల కారణంగా అడపిల్లలు పుట్టుగానే తీసుకువచ్చి శిశుసంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన ఊయలల్లో వదిలేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం శిశువిహార్తో సహా 13 శిశుగృహాల్లో మొత్తం 305 మంది పిల్లలు దత్తతకు సిద్ధంగా ఉన్నారు.
దత్తత ఇలా : స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారా సంతానం లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత కోసం అప్లై చేసుకోవాలి. దీనిలో నమోదు చేసుకున్న వారికి సీనియారిటీ ప్రకారం దత్తతకు అనుమతిస్తున్నారు. ఇతర మార్గాల చిన్నారులను తెచ్చుకుని పెంచుకోవడం చట్టరీత్యా నేరం.
వివరాలిలా :
- గత సంవత్సరం 2023-24లో దత్తతల్లో మొత్తం 70 మంది మగపిల్లలు ఉంటే ఈ ఏడాదిలో సంఖ్య 112కి చేరింది.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి దత్తత కింద మొత్తం 267 మంది చిన్నారులు వెళ్లారు.
- బాలికలు మొత్తం 155 మంది ఉన్నారు. ఇందులో 10 మంది విదేశాలకు చెందిన దంపతులకు చేరారు.
- దేశవ్యాప్తంగా జరిగని దత్తతల్లో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో కనీసం 300 మంది చిన్నారుల్ని దత్తత ఇచ్చి వారి జీవితాల మార్పే లక్ష్యంగా పెట్టుకుంది.
- శిశు సంక్షేమ శాఖ అధికారులు అనాథ పిల్లలను చేరదీసి పిల్లల సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆమోదంతో చట్టబద్ధంగా దత్తతకు అర్హులుగా మారుస్తున్నారు.
అమ్మాయిని దత్తత తీసుకోవడానికే 'సై' - రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న గర్ల్ చైల్డ్ అడాప్షన్
పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? - ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుంటే బెటర్!

